Begin typing your search above and press return to search.

చోటా రాజన్ చనిపోడంటూ ఆర్జీవీ ట్వీట్.. బ్రతికే ఉన్నాడని వెల్లడించిన ఎయిమ్స్..!

By:  Tupaki Desk   |   7 May 2021 12:11 PM GMT
చోటా రాజన్ చనిపోడంటూ ఆర్జీవీ ట్వీట్.. బ్రతికే ఉన్నాడని వెల్లడించిన ఎయిమ్స్..!
X
ప్రపంచానికి కనిపించని అండర్ వరల్డ్ డాన్ ల జీవిత కథలు - హింసాత్మక నేపథ్యాల గురించి వెండితెర మీద చూపించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. చీకటి సామ్రాజ్యాన్ని ఏలే అనేకమంది డాన్‌ లను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఆర్జీవీ.. ఇప్పుడు ఒక అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కరోనా వైరస్ కారణంగా చనిపోయాడంటూ ట్వీట్ చేశారు. డి-కంపెనీకి చెందిన వ్యక్తి అని కూడా చూడకుండా కోవిడ్ వైరస్ చోటా రాజన్‌ ను చంపేసిందని పేర్కొన్నాడు.

'కరోనా వైరస్ చోటా రాజన్‌ ను చంపేసింది. అతను D-కంపెనీకి చెందిన 2వ వ్యక్తి అని కూడా పట్టించుకోలేదు. అతను ఆ వైరస్ ను ఎందుకు షూట్ చేయలేదని నేను ఆశ్చర్యపోతున్నాను? సీరియస్లీ ఇప్పుడు దావూద్ ఇబ్రహీం ఎలా ఫీల్ అవుతున్నాడో'' అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అయితే చోటా రాజన్ ఇంకా బ్రతికే ఉన్నాడని.. ప్రస్తుతం కోవిడ్ చికిత్స తీసుకుంటున్నాడని ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి.

కాగా, తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అండర్ వరల్డ్‌ డాన్‌ చోటా రాజన్‌ కు ఇటీవల కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. సాయుధ పోలీసుల పర్యవేక్షణలో రాజన్ కు చికిత్స అందించినప్పటికీ.. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఢిల్లీ ఎయిమ్స్‌ కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం చోటా రాజన్ ప్రాణాలు కోల్పోయాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజన్ బ్రతికే ఉన్నాడని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

కాగా, దావూద్ ఇబ్రహీం - చోటా రాజన్‌ ల మధ్య అంతర్యుద్ధం ఆధారంగా 2002లో ఆర్జీవీ 'కంపెనీ' అనే సినిమా తెరకెక్కించాడు. ఇప్పుడు లేటెస్టుగా డాన్‌ గా దావూద్‌ ఎలా మారాడనే కథతో 'D కంపెనీ' అనే సినిమా రూపొందించాడు. ఇకపోతే ముంబైలో దోపిడీ, హత్యలకు సంబంధించి 70 క్రిమినల్ కేసులను రాజన్ ఎదుర్కొంటున్నాడు. 2018లో జర్నలిస్ట్ జ్యోతిర్మయ్ డే హత్య కేసులో రాజన్ దోషిగా తేలడంతో అతనికి జీవిత ఖైదు విధించారు.