Begin typing your search above and press return to search.

మారేడుమిల్లి నుంచి విదేశాలకు పుష్పరాజ్ పయనం..?

By:  Tupaki Desk   |   28 Sep 2022 4:21 AM GMT
మారేడుమిల్లి నుంచి విదేశాలకు పుష్పరాజ్ పయనం..?
X
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ మరియు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన "పుష్ప: ది రైజ్" చిత్రం.. పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నార్త్ సర్క్యూట్స్ లో వంద కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి సంచలన సృష్టించింది. దీంతో ఇప్పుడు 'పుష్ప 2' పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

'పుష్ప 1' ఊహించిన దానికంటే పెద్ద విజయం సాధించడంతో.. ఇప్పుడు రెండో భాగం "పుష్ప: ది రూల్" విషయంలో సుక్కూ అండ్ టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోందని తెలుస్తోంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా.. ఫస్ట్ పార్ట్ కు మించి ఉండేలా భారీ హంగులతో సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అందుకే ఈ ఏడాది ప్రారంభంలో స్టార్ట్ చేస్తామని చెప్పినటప్పటికీ.. హడావుడిగా సెట్స్ మీదకు వెళ్లకుండా.. ప్రీ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం తీసుకున్నారు. బన్నీ సైతం 'పుష్ప 2' సినిమా కోసం ఎక్కువ టైం కేటాయించడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సుక్కూ ముందుగా అనుకున్న కథలో మార్పులు చేసారని.. ఫైనల్ వెర్షన్ కూడా రెడీ అయినట్లు వినికిడి.

శేషాచలం అడవుల్లో కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్పరాజ్.. ఎర్ర చందనం స్మగ్లింగ్ సిండికేట్ ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది 'పుష్ప: ది రైజ్' లో చూపించారు. 'పుష్ప: ది రూల్' లో అతను చీకటి సామ్రాజ్యాన్ని ఎలా రూల్ చేయబోతున్నాడు? శత్రువులను ఏవిధంగా ఎదుర్కోబోతున్నాడు? అనేది చూపించే అవకాశం ఉంది.

కరోనా లాక్ డౌన్ పరిస్థితుల్లో 'పుష్ప 1' షూటింగ్ ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో చేశారు. కానీ ఈసారి పుష్పరాజ్ మారేడుమిల్లి నుంచి విదేశాలకు వెళ్తాడని.. కొన్ని కీలకమైన ఎపిసోడ్స్ ను విదేశీ అడవుల్లోనే షూట్ చేస్తారని తెలుస్తోంది. అడవులను వెతికే పని మీదే దర్శకుడు సుకుమార్ ఇటీవల ఫారిన్ కు వెళ్లారని టాక్.

ఇకపోతే 'పుష్ప 2' తారాగణంపైనా సోషల్ మీడియాలో అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అల్లు అర్జున్ కి జోడీగా నటించిన రష్మిక మందన్నా రెండో భాగంలోనూ హీరోయిన్ గా కొనసాగనుంది. అలానే ఫహాద్ ఫాజిల్ - జగదీష్ - సునీల్ - అనసూయ - రావు రమేష్ - అజయ్ పాత్రలు కూడా ఉంటాయి.

అయితే ఇప్పుడు సెకండ్ పార్ట్ లో కొత్తగా ప్రముఖ నటీనటులు భాగం అవుతున్నారని అంటున్నారు. ఇందులో సాయి పల్లవి - విజయ్ సేతుపతి - ప్రియమణి వంటి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే సుకుమార్ ఈసారి 'పుష్ప' కు సంబంధించిన ఎలాంటి వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబడిన 'పుష్ప 2' చిత్రాన్ని.. అక్టోబర్ నెలలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మళ్లీ పుష్పరాజ్ గా మేకోవర్ అయ్యాడు. త్వరలోనే షూటింగ్ అప్డేట్ ను వెల్లడించనున్నారు.

ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది చివర్లో లేదా ఆపై వచ్చే 2024 సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మొదటి భాగానికి పని చేసిన కోర్ టీమ్ అంతా 'పుష్ప: ది రూల్' లోనూ ఉంటారు. త్వరలోనే అన్ని విషయాలపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.