Begin typing your search above and press return to search.

'మా' లోని రెండు వర్గాలు ఒక్కటయ్యాయి...!

By:  Tupaki Desk   |   28 May 2020 4:30 PM GMT
మా లోని రెండు వర్గాలు ఒక్కటయ్యాయి...!
X
టాలీవుడ్ లోని సినీ ఆర్టిస్టుల కోసం 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' (మా) 1993లో మెగాస్టార్ చిరంజీవి ఫౌండర్ ప్రెసిడెంటుగా అక్కినేని నాగేశ్వర రావు చీఫ్ అడ్వైజర్ గా ఏర్పాటైంది. అప్పటి నుండి గత రెండేళ్ళకి ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తూ మూవీ ఆర్టిస్టుల సమస్యలపై నిర్ణయాలు తీసుకుంటూ వారి అభున్నతికి కృషి చేస్తూ వస్తున్నారు. గతేడాది ఎన్నికలలో సీనియర్ నరేష్ వర్గం 'మా' ఎన్నికలలో విజయం సాధించింది. నరేష్ 'మా' అధ్యక్షుడిగా.. రాజశేఖర్ ఎక్సిక్యూటివ్ ప్రెసిడెంట్ గా.. జీవిత జనరల్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. అయితే ఏమైందో తెలియదు కానీ కొన్ని రోజులకు నరేష్ వర్గంలో చీలిక ఏర్పడింది. నరేష్ ఆధ్వర్యంలో ఒక వర్గం.. జీవిత రాజశేఖర్ ఆధ్వర్యంలో మరో వర్గం కార్యకలాపాలను చేస్తూ వచ్చారు.

ఒకరికి తెలియకుండా ఒకరు మీటింగులు పెట్టుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ ఒకరిమీద ఒకరు ఆధిపత్యం చూపించుకోడానికి ట్రై చేసారు. అయితే ఎందుకో తెలియదు కానీ ఇండస్ట్రీ పెద్దలు నరేష్ ను తాత్కాలికంగా పక్కన పెట్టి జీవిత రాజశేఖర్ వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. 'మా' అధ్యక్షుడు నరేష్ లేకుండా పలు మీటింగులు కూడా నిర్వహించారు. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్విత మిత్రులు ఉండరు అన్నట్లు.. సినీ ఇండస్ట్రీలో కూడా శాశ్వత శత్రువులు శాశ్విత మిత్రులు ఉండరు అంటూ ఈ ఇద్దరు ఇప్పుడు మళ్లీ ఒక్కటయ్యారు. నరేష్-జీవిత రాజశేఖర్ వర్గాలు ఒకటయ్యాయి. ఇకపై కలిసి పనిచేయడానికి నరేష్ నే మళ్లీ 'మా' అధ్యక్షుడిగా యాక్టివ్ గా వుండడానికి ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.

నిన్న సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని ఆధ్వర్యంలో మాసాబ్ ట్యాంక్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన సమావేశానికి కూడా 'మా' అధ్యక్షుడి హోదాలో సీనియర్ నరేష్.. 'మా' జనరల్ సెక్రటరీ హోదాలో జీవిత హాజరయ్యారు. అయితే ఇన్ని రోజులు కారాలు మిరియాలు నూరుకున్న ఈ రెండు వర్గాలు సడన్ గా కలిసి పోవడానికి గల కారణాలైతే తెలియదు. కానీ ఇండస్ట్రీలో నెలకొనియున్న పరిస్థితులపై ఈ మధ్య ఇండస్ట్రీ ప్రముఖులు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో 'మా' కి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో.. వీరు తమ ఉనికిని కాపాడుకోవడానికి మళ్ళీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.