Begin typing your search above and press return to search.

పొలిటిక‌ల్‌ రూమ‌ర్స్ పై 'కింగ్' సైజ్ రిప్లై!

By:  Tupaki Desk   |   30 Sep 2022 1:34 PM GMT
పొలిటిక‌ల్‌ రూమ‌ర్స్ పై కింగ్ సైజ్ రిప్లై!
X
కింగ్ నాగార్జున న‌టించిన లేటెస్ట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ది ఘోస్ట్‌`. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గ‌త కొంత కాలంగా సాలీడ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ తో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని, అభిమానుల్ని అల‌రించాల‌ని నాగార్జున ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎట్ట‌కేల‌కు ఆయ‌న కోరుకున్న సినిమా `ది ఘోస్ట్‌`తో అక్టోబ‌ర్ 5న భారీ స్థాయిలో ద‌స‌రా బ‌రిలో దిగుతున్నారు. మూవీ రిలీజ్ కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల విష‌యంలో జోరు పెంచేశారు.

ఇందులో భాగంగా శుక్ర‌వారం హైద‌రాబాద్ లో ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మీడియా అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానాలు చెప్పిన నాగార్జున త‌న పొలిటిక‌ల్ ఎంట్రీపై వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున ఎంపీగా నాగార్జున పోటీకి దిగుతున్నార‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై నాగార్జున క్లారిటీ ఇచ్చారు. ఆ వార్త‌ల‌న్నీ అవాస్త‌వాల‌ని స్ప‌ష్టం చేశారు.

ఎన్నిక‌లొచ్చిన ప్ర‌తీసారి తాను పోటీచేస్తున్న‌ట్టుగా ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఈ వార్త‌ల‌ని గ‌త ప‌దిహేనేళ్లుగా వింటున్నాన‌ని, రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నానంటూ జ‌రుగుతున్న ప్ర‌చారంలో నిజం లేద‌ని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా తాను రాజకీయాల‌కు దూరంగా వున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. ఇక మంచి క‌థ‌తో వ‌స్తే పొలిటిక‌ల్ లీడ‌ర్ గా న‌టించాడానికి తాను రెడీ అన్నారు. దీంతో గ‌త కొంత కాలంగా నాగ్ వైసీపీ త‌రుపున ఎంపీగా బ‌రిలోకి దిగుతున్నారంటూ వ‌స్తున్న వార్త‌ల‌కు చెక్ పెట్ట‌డంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా వుంటే ఈ సంద‌ర్భంగా నాగార్జున సినిమా గురించి కూడా ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. `ది ఘోస్ట్` సెంటిమెంట్ తో మొద‌లైంద‌ని, త‌న‌దో సినిమా చేయాల‌నేది దివంగ‌త నిర్మాత నారాయ‌ణ్ దాస్ నారంగ్ గారి కోరిక‌ని, ఆ కోరిక ప్ర‌కారం ఆయ‌న త‌న‌యుడు సునీల్ నారంగ్ నిర్మాత‌గా ఈ మూవీ మొద‌లైంద‌ని త‌న‌తో పాటు ఈ మూవీని నిర్మించిన‌ జాన్వీ, ఆదిత్‌, శ‌ర‌త్ మ‌ర‌రార్‌, పి. రామ్మోహ‌న్ రావుల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాల‌న్నారు.

నా లానే ఈ సినిమాకు స‌ని చేసిన వారంతా చాలా యంగ్ . క‌సి, ప్రేమ‌తో ఈ మూవీని చేశాం. ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌చ్చి సినిమా చూడాలంటే కంటెంట్ తో పాటు సాంకేతికంగా వున్న‌తంగా వుండాలి. ఈ రెండింటితో ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు, అత‌ని టీమ్‌ ఈ మూవీని రూపొందించారని తెలిపారు. సినిమాపై గ‌ట్టి న‌మ్మ‌కంతో వున్నాం. క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు అన్ని ప్రాంతాల న‌టీన‌టులు న‌టించారు. ప్రీ రిలీజ్ వేడుక‌లో మాకు శుభాకాంక్ష‌లు చెప్పిన చిరంజీవికి థాంక్స్‌. నేను గ‌తంలో న‌టించిన `కిల్ల‌ర్‌` కు దీనికి ఎలాంటి సంబంధం వుండ‌దు. ప్రేక్ష‌కుల‌కు న‌చ్చితే సీక్వెల్స్ చేస్తాం` అని స్ప‌ష్టం చేశారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.