Begin typing your search above and press return to search.

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: రేపు ముమైత్ ఖాన్ వంతు..!

By:  Tupaki Desk   |   14 Sep 2021 2:30 PM GMT
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: రేపు ముమైత్ ఖాన్ వంతు..!
X
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2017 లో ఎక్సైజ్ శాఖ సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ సప్లయర్ కెల్విన్ మాస్కెరాన్స్ తో పాటుగా పూరీ జగన్నాథ్ - ఛార్మి కౌర్ - రకుల్ ప్రీత్ సింగ్ - నందు - రవితేజ - రానా దగ్గుబాటి - నవదీప్ వంటి సినీ ప్రముఖులను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇప్పుడు నటి ముమైత్ ఖాన్ వంతు వచ్చింది.

డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా రేపు (సెప్టెంబర్ 15) బుధవారం ముమైత్ ఖాన్ ఈడీ అధికారుల ఎదుట హాజరుకానుంది. విచారణకు ముమైత్ బ్యాంక్ ఖాతాల స్టేట్మెంట్స్ ని తీసుకురావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఈ నేపథ్యంలో మాధకద్రవ్యాల వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు - కెల్విన్ తో పరిచయాలు - ఎఫ్ క్లబ్ పార్టీలలో జరిగిన లావాదేవీల గురించి ముమైత్ ఖాన్ ను అధికారులు ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది.

2017లో టాలీవుడ్ లో డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చినప్పుడు.. ఎక్సైజ్ శాఖ విచారణకు ముమైత్ ఖాన్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఈడీ విచారణ ఎదుర్కోనున్నారు. ఇక సెప్టెంబర్ 17న తనీష్ - సెప్టెంబర్ 22న తరుణ్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. వీరిని ప్రశ్నించడంతో సినీ ప్రముఖుల విచారణ ముగుస్తుంది. ఈ దర్యాప్తు తరువాత ఈడీ అధికారులు ఏం చేయబోతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నాలుగేళ్ళ క్రితం సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో చాలామందిని అరెస్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ చివరకు ఎక్సైజ్ శాఖ వారికి క్లీన్ చీట్ వచ్చింది. మరి ఇప్పుడు ఈడీ సేకరించిన సమాచారంతో ఎవరిపైన అయినా చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి.