Begin typing your search above and press return to search.

'నాగబాబు వ్యాఖ్యలు బాధించాయి.. MAA ఎన్నిక ఏకగ్రీవమైతే తప్పేంటి?'

By:  Tupaki Desk   |   3 Aug 2021 2:30 PM GMT
నాగబాబు వ్యాఖ్యలు బాధించాయి.. MAA ఎన్నిక ఏకగ్రీవమైతే తప్పేంటి?
X
తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు సెప్టెంబర్ నెలలో జరగనున్నాయి. అధ్యక్ష పదవి కోసం ఈసారి పోటీ ఎక్కువైంది. ఇప్పటికే ఐదుగురు సభ్యులు బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటూ వాతావరణం వేడెక్కేలా చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు సీనియర్ నరేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'మా' మసకబారింది అని నాగబాబు చేసిన వ్యాఖ్యలు తనని బాధించాయని.. ప్రస్తుతం అధ్యక్ష స్థానంలో ఉన్నాను కాబట్టి ఎవరికి మద్దతిస్తాననే విషయంపై స్పందించటం కరెక్ట్ కాదని నరేష్ అన్నారు.

'మా' ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారనేది వారి పనితనం, వ్యక్తిగత కారణాలను బట్టి ఉంటుందని.. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను చెప్పడంలో తప్పులేదని నరేష్ చెప్పారు. 'మా' ప్రతిష్ఠ మసకబారిందని నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు బాధ పెట్టాయని అన్నారు. 'చెడు ఉంటే చెవిలో చెబుదాం. మంచి ఉంటే మైక్‌ లో మాట్లాడదాం' అని గతంలో చిరంజీవి గారు అన్నారని.. 'మా' గురించి తప్పుగా మాట్లాడితే వారిపై చర్యలు తీసుకోవచ్చని నిబంధనల్లో ఉందని.. చిరంజీవి - కృష్ణంరాజు వంటి పెద్దలు ఉన్న క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.

తాను 'మా' అధ్యక్షుడైన తర్వాత చాలా కష్టపడి పని చేశానని.. సభ్యులకు ఆరోగ్య బీమా కల్పించానని.. ‘మా’ సభ్యులు పదహారు మంది మరణిస్తే 24 గంటల్లో వారికి రూ.3 లక్షలు భీమా అందించామని నరేశ్ అన్నారు. లాక్‌ డౌన్‌ టైంలో కరోనా బాధితులకు సాయం నిమిత్తం రూ.14 లక్షలు ‘మా’ అకౌంట్ లో జమ చేశామని.. చిరంజీవి గారు కూడా మెచ్చుకున్నారని.. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లు తగులుతాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేసినా తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన నరేశ్‌.. కొత్త వారికి అవకాశం ఇవ్వడం కోసం తాను పోటీ చేయనని.. యంగ్ స్టర్స్ ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు.

'మా' ఎన్నికలు ఏకగ్రీవం చేస్తే గొంతు నులిమేసినట్లేనని నాగబాబు అన్న మాటలతో తాను ఏకీభవించనని.. బీజేపీ లాంటి నేషనల్ పార్టీకి అధ్యక్షుడిని ఏకగ్రీవం చేస్తారని.. అలాంటిది ‘మా’ అధ్యక్షుడు ఏకగ్రీవమైతే తప్పేంటని నరేష్ ప్రశ్నించారు. ‘మా’ బిల్డింగ్ నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని భరిస్తానని మంచు విష్ణు చెప్పడం అభినందించాల్సిన విషయమని.. దానికి తనవంతు సాయం కూడా చేస్తానని నరేష్ అన్నారు. ప్రకాష్ రాజ్ కు చిరంజీవి మద్దతు ఉంటుందని నాగబాబు మాత్రమే చెప్పారని.. పెద్దాయన చిరంజీవి దీనిపై ఇంకా స్పందించలేదు కదా అని నరేష్ చెప్పుకొచ్చారు.