Begin typing your search above and press return to search.

మహేశ్ కోసం కథ రెడీ చేసుకుంటే.. మెగా రీమేక్ మూవీ ఛాన్స్ దక్కింది..!

By:  Tupaki Desk   |   7 Oct 2022 4:02 AM GMT
మహేశ్ కోసం కథ రెడీ చేసుకుంటే.. మెగా రీమేక్ మూవీ ఛాన్స్ దక్కింది..!
X
2001 లో 'హనుమాన్ జంక్షన్' వంటి రీమేక్ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమైన మోహన్ రాజా.. రీమేక్ స్పెషలిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకూ అతను 10 సినిమాలు డైరెక్ట్ చేయగా.. అందులో 8 రీమేక్ చిత్రాలే ఉండటం గమనార్హం.

తెలుగులో హిట్ అయిన 'జయం' 'అమ్మ నాన్నా ఓ తమిళ అమ్మాయి' 'బొమ్మరిల్లు' 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' 'ఆజాద్' 'కిక్' వంటి చిత్రాలను తమిళ్ లో రీమేక్ చేసాడు. ఈ క్రమంలో తొలిసారిగా ఒరిజినల్ స్టోరీతో 'తనివరువన్' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇది తెలుగులో రామ్ చరణ్ హీరోగా 'ధృవ' పేరుతో రీమేక్ చేయబడిన సంగతి తెలిసిందే.

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ''గాడ్ ఫాదర్'' చిత్రంతో తెలుగులోకి తిరిగి వచ్చారు దర్శకుడు మోహన్ రాజా. ఇది మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'లూసిఫర్' సినిమాకి అధికారిక రీమేక్. దసరా సందర్భంగా ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా థియేటర్లలోకి వచ్చింది.

అయితే 'గాడ్ ఫాదర్' సినిమాలో చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ మోహన్ రాజాకి రావడం వెనుక ఆసక్తికరమైన స్టోరీ ఉంది. నిజానికి దర్శకుడు మెగా రీమేక్ సినిమాని టేకాఫ్ చేయడానికి ముందు.. ఒరిజినల్ స్టోరీతో సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల మీడియా ఇంటరాక్షన్‌ లో మోహన్ రాజా తాను మహేష్ బాబు కోసం ఒక సబ్జెక్ట్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. 'స్పైడర్' నిర్మాత ఎన్వీ ప్రసాద్ సహాయంతో మహేష్‌ ని కలిసి స్టోరీ చెప్పాడట. అదే సమయంలో చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి లూసిఫర్' రీమేక్ ని హ్యాండిల్ చేయగలిగే దర్శకుడి కోసం వెతుకుతున్నారు.

అప్పటికే ఈ మెగా ప్రాజెక్ట్ కోసం సుజీత్‌ - వివి వినాయక్‌ తో సహా పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే చివరకు మోహన్ రాజా పేరును చరణ్ కు ఎన్వీ ప్రసాద్ సూచించడం జరిగింది. 'ధృవ' ఒరిజినల్ డైరెక్టర్ అప్పటికే చెర్రీ తో 'ధృవ 2' గురించి చర్చలు జరుపుతున్నారు. అయితే ఎన్వీ ప్రసాద్ చెప్పిన తర్వాత వెంటనే మోహన్ రాజా కు కాల్ చేసి 'లూసిఫర్' రీమేక్ చేయమని కోరాడట.

చరణ్ ఆఫర్ కి మోహన్ రాజా ఓకే చెప్పడం.. ఆయన తన తండ్రి చిరు వద్దకు తీసుకెళ్లడం.. మెగాస్టార్ కోరుకున్న విధంగా రీమేక్ రాజా మార్పులు చేర్పులు చేయడం.. దీనికి గ్రీన్ సిగ్నల్ రావడంతో ''గాడ్ ఫాదర్'' సినిమా పట్టాలెక్కడం జరిగిపోయాయి.

ఇలా మహేష్ బాబు మరియు రామ్ చరణ్ లతో సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేసిన మోహన్ రాజా.. చిరంజీవి తో మూవీ చేయాల్సి వచ్చింది. దీని తర్వాత కింగ్ అక్కినేని నాగార్జున తో సినిమా చేయడానికి దర్శకుడు సన్నద్ధం అవుతున్నాడు. మరోవైపు 'ధృవ 2' స్క్రిప్టు కూడా పూర్తి కావొచ్చింది.

అయితే మహేష్ బాబుతో మోహన్ రాజా చేసే సినిమాపై క్లారిటీ లేదు. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు ఎస్ఎస్ రాజమౌళి వంటి ఇద్దరు అగ్ర దర్శకులతో రెండు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. దీని తర్వాత అయినా మంచి కథతో వస్తే రీమేక్ స్పెషలిస్ట్ కు సూపర్ ఛాన్స్ దొరుకుతుందేమో!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.