Begin typing your search above and press return to search.

ఇదే జరిగితే మహేశ్ - బన్నీ మళ్ళీ బరిలో దిగుతారేమో..?

By:  Tupaki Desk   |   27 Oct 2021 5:30 PM GMT
ఇదే జరిగితే మహేశ్ - బన్నీ మళ్ళీ బరిలో దిగుతారేమో..?
X
2020 సంక్రాంతి సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన విషయం తెలిసిందే. మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’.. బన్నీ ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు ఒక్క రోజు గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కలెక్షన్ల సంగతి పక్కన పెడితే రెండూ సంక్రాంతి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయనే చెప్పాలి. కాకపోతే ఆ సమయంలో రెండు సినిమాల మధ్య జరిగిన వార్.. ఎవరికి వారు ఆధిపత్యం చూపించుకోవడం సినీ అభిమానులకు బాగా గుర్తుండి పోతుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మళ్ళీ మహేష్ - అర్జున్ మధ్య అలాంటి ఆసక్తికరమైన పోటీ ఏర్పడే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు జనవరి 6న వస్తున్న రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' సినిమా కోసం మహేష్ తన చిత్రాన్ని వాయిదా వేసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక జరిగితే వచ్చే ఉగాది కానుకగా 'సర్కారు వారి..' సినిమాను విడుదల చేయడానికి మహేశ్ ప్లాన్ చేసుకుంటారని అంటున్నారు. మరోవైపు అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' పార్ట్-1 చిత్రాన్ని ప్రస్తుతానికి డిసెంబర్ 17న రిలీజ్ చేస్తామని చెబుతున్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్లు రేట్ల సవరణ చేయకపోయినా.. పాన్ ఇండియా వైడ్ థియేటర్లు సరైన పద్ధతిలో తెరుచుకోకపోయినా 'పుష్ప' చిత్రాన్ని వాయిదా అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని పుష్ప చిత్రాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో 'పుష్ప' ఇప్పుడున్న విడుదల తేదీని మిస్ చేసుకుంటే మాత్రం.. మరోసారి బాక్సాఫీస్ వద్ద మహేశ్ - అల్లు అర్జున్ తలపడనున్నారనే అనుకోవాలి. కాకపోతే ఈ రెండు సినిమాలను నిర్మిస్తున్నది మైత్రీ మూవీ మేకర్స్ వారే కాబట్టి, కొంత గ్యాప్ తో ఈ చిత్రాలను రిలీజ్ చేసే ప్లాన్స్ చేసుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.

కాగా, 'సరిలేరు నీకెవ్వరు' 'అల వైకుంఠపురములో' సినిమాల రిలీజ్ డేట్స్ - ప్రమోషన్స్ దగ్గర నుంచి ప్రతీ విషయంలో పోటీ పడిన సంగతి తెలిసిందే. సినిమాలు విడుదల అయ్యాక ఒకరు సంక్రాంతి మొగుడు అంటే.. మరొకరు సంక్రాంతి విన్నర్ అని చెప్పుకున్నారు. మాది ఇండస్ట్రీ హిట్ అంటే.. కాదు మాది ఇండస్ట్రీ హిట్ అని.. మా సినిమావి రియల్ కలెక్షన్స్ అంటే.. మావి జెన్యూన్ అండ్ ఆర్గానిక్ కలెక్షన్స్ అంటూ పోస్టర్స్ రిలీజ్ చేసుకుంటూ నువ్వా నేనా అన్నట్లు ఫైట్ చేశారు. వాస్తవానికి ఈ రెండూ మంచి కలెక్షన్స్ సాధించి విజయవంతం అయ్యాయి. కొన్ని ఏరియాల్లో మహేష్ సినిమా మంచి కలెక్షన్స్ తెచ్చుకోగా.. మరికొన్ని ఏరియాల్లో బన్నీ సినిమా డామినేషన్ చూపించింది. ఈ నేపథ్యంలో మరోసారి వీరిద్దరూ బరిలో దిగితే మాత్రం, పోటీ ఆసక్తికరంగా ఉంటుందని చెప్పవచ్చు.

'సర్కారు వారి పాట' చిత్రాన్ని పరశురామ్ పెట్లా తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా స్పెయిన్ లో ఓ సాంగ్ షూటింగ్ పూర్తి చేశారు. త్వరలోనే ఈ సినిమా కోసం థమన్ స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాబోతోంది. మరోవైపు రెండు భాగాలుగా రానున్న 'పుష్ప' చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. గురువారం సినిమాలోని థర్డ్ సింగిల్ ని చిత్ర బృందం విడుదల చేయనుంది.