Begin typing your search above and press return to search.

కొరియోగ్రాఫర్‌ కు మాధవీలత లీగల్ నోటీసులు...!

By:  Tupaki Desk   |   27 May 2020 12:10 PM GMT
కొరియోగ్రాఫర్‌ కు మాధవీలత లీగల్ నోటీసులు...!
X
'నచ్చావులే' సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది తెలుగమ్మాయి మాధవీలత. ఆ తర్వాత 'స్నేహితుడు' 'అరవింద్ 2' లాంటి అడపాదడపా సినిమాల్లో నటించింది. ఈ భామ సినిమాల ద్వారా ఫేమస్ అయింది తక్కువే అయినా.. తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎక్కువగా ఫేమస్ అవుతూ వచ్చింది. ఇటీవల మాధవీలత బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవల తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన రాకేష్ మాస్టర్ కు మాధవీలత లీగల్ నోటీసులు పంపింది. కొరియోగ్రాఫర్‌ రాకేష్ పలు యూట్యూబ్ ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా బాగా పాపులర్ అయ్యారు. ఇండస్ట్రీలోని చాలా మందిపై ఆయన వివాదాస్పద అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ చెలరేగిపోతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇండస్ట్రీ పెద్దలపై కూడా ఆయన ఘాటు విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో మాధవీలతపై ఆయన అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. రాకేష్ మాస్టర్ వ్యాఖ్యలపై స్పందించిన మాధవీలత.. రాకేష్‌ మాస్టర్‌ ఎవరో తనకు తెలియదని.. అతడి వ్యాఖ్యలను తనను ఎంతగానో బాధించాయన్నారు. ఏ పబ్లిక్ మీడియాలో అయితే తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారో.. అక్కడే తనకు క్షమాపణలు చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్‌కు రప్పిస్తానని.. కోర్టు మెట్లు ఎక్కిస్తానని అన్నారు.

ఈ క్రమంలో ఆయనకు లీగల్ నోటీసు కూడా పంపించారు. అడ్వకేట్ మన్నవ్ కుమార్ ద్వారా ఈ నోటీసును రాకేష్ మాస్టర్‌ కు మాధవి పంపారు. ఈ నెల 6వ తేదీన రెండు యూట్యూబ్ ఛానళ్లలో వీడియోలు అప్ లోడ్ చేశారని.. ఆ వీడియోలలో తన క్లైంట్ మాధవీలతపై నిరాధారమైన అసత్యపూరితమైన ఆరోపణలు చేయడమే కాకుండా అసభ్యపదజాలంతో దూషించారని లీగల్ నోటిసులో అడ్వకేట్ పేర్కొన్నారు. అంతేకాకుండా సినీ ప్రముఖులైన చిరంజీవి, బాలకృష్ణలతో మాధవీలతకు లింకులు పెట్టి ఆమె గౌరవానికి భంగం కలిగించారని వెల్లడించారు. ఇక ఈ తప్పుడు వ్యాఖ్యలన్నింటికీ రాకేష్ మాస్టర్ ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని.. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. మాధవీలతను ‘జప్ఫాదాన’ ‘అత్తాపూర్’ ‘బుడబుక్కలదాన’ ‘ముదనష్టపుదాన’ అనే తిట్లతో పాటు అసభ్యకర పదజాలంతో దూషించారని నోటీసులో అడ్వకేట్ పేర్కొన్నారు. ఒక మహిళపై అసత్యపూరిత ఆరోపణలు చేయడం.. ఆమె ప్రతిష్టకు భంగం కలిగించడం పట్ల ఐపీసీ సెక్షన్ 499.. సెక్షన్ 500.. సెక్షన్ 354ల కింద రాకేష్ మాస్టర్‌ పై కేసులు పెడతామని హెచ్చరించారు.

దీనిపై మాధవీలత స్పందిస్తూ.. ఒక వ్యక్తి సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుంటే దానిని ఎంజాయ్ చేస్తూ అతనికి పిచ్చి అని కామెంట్లు పెడుతున్నారని మాధవీలత ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అతనికి పిచ్చి అని డాక్టర్ నుంచి తనకు సర్టిఫికెట్ కావాలని అన్నారు. దీనిపై ఇంతకు మించి మాట్లాడనని.. ఏదైనా చట్టపరంగానే వెళ్తానని స్పష్టం చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మరియు తన అడ్వకేట్ సహాయంతో రాకేష్ మాస్టర్‌ కు లీగల్ నోటీసు పంపించానని వెల్లడించారు. ఇప్పటికే రాకేష్‌ మాస్టర్‌ కు శ్రీరెడ్డి లీగల్‌ నోటీస్‌ పంపించగా తాజాగా మాధవీలత కూడా అదే మార్గంలో వెళ్ళింది. మరి ఈ నోటీస్‌ లపై రాకేష్‌ మాస్టర్‌ మరేం కామెంట్స్‌ చేస్తాడో చూడాలి.