Begin typing your search above and press return to search.

చెప్పిన తేదీకే 'కొండ పొలం'.. ట్రైలర్ ఎప్పుడంటే..?

By:  Tupaki Desk   |   25 Sep 2021 1:44 PM GMT
చెప్పిన తేదీకే కొండ పొలం.. ట్రైలర్ ఎప్పుడంటే..?
X
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ - స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ''కొండ పొలం''. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో గ్రామీణ అడ్వెంచర్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎప్పుడో కంప్లీట్ అయిన ఈ సినిమాని అక్టోబర్ 8న థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వడంతో పాటుగా ట్రైలర్ అప్డేట్ తో వచ్చింది.

''కొండ పొలం'' చిత్రాన్ని ముందుగా ప్రకటించినట్లుగానే వచ్చే నెల 8వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు దర్శకనిర్మాతలు వెల్లడించారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ను సెప్టెంబర్ 27 సోమవారం మధ్యాహ్నం 3.33 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన పోస్టర్ ని వదిలారు. ఇందులో వైష్ణవ్ తేజ్ భుజంపై ఓ గొడ్డలి పట్టుకొని నిలబడగా.. దాని మీద కొందరు గ్రామీణులు నడుస్తూ కనిపిస్తున్నారు. అలానే గొర్రెల మంద మధ్యలో రకుల్ ప్రీత్ సింగ్ ఓ కర్ర పట్టుకొని నవ్వుతూ కనిపిస్తోంది.

'కొండపొలం' చిత్రంలో కటారు రవీంద్ర యాదవ్ గా వైష్ణవ్ తేజ్ - ఓబులమ్మగా రకుల్ ప్రీత్ నటిస్తున్నారు. ఇందులో ఇద్దరూ గొర్రెల కాపరులుగా కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ - 'ఓబులమ్మ' సాంగ్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన 'కొండపొలం' నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

బిబో శ్రీనివాస్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 8 గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీనికి సాయిబాబు జాగర్లమూడి - రాజీవ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రవణ్ కటికనేని ఎడిటర్ గా.. రాజ్ కుమార్ గిబ్సన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. 'ఉప్పెన' వంటి సూపర్ హిట్ తర్వాత పంజా వైష్ణవ్ తేజ్ నుంచి వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.