Begin typing your search above and press return to search.

ఆ కార‌ణం వ‌ల్లే చిరుకి చెల్లెలుగా చేస్తున్నా: కీర్తి సురేష్‌

By:  Tupaki Desk   |   12 May 2022 6:30 AM GMT
ఆ కార‌ణం వ‌ల్లే చిరుకి చెల్లెలుగా చేస్తున్నా: కీర్తి సురేష్‌
X
సాధార‌ణంగా వ‌రుస ఆఫ‌ర్ల‌తో మంచి ఫామ్ లో దూసుకుపోతున్న హీరోయిన్లు చెల్లెలు పాత్ర చేయ‌డానికి అస్స‌లు ఒప్పుకోరు. ఒక్కసారి సిస్ట‌ర్ క్యారెక్ట‌ర్ లో కనిపిస్తే ఆ త‌ర‌హా పాత్ర‌లే వ‌స్తాయ‌ని, హీరోయిన్ ఆఫర్లు తగ్గిపోతాయని భావించ‌డ‌మే ఇందుకు కార‌ణం. అందుకే భారీ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేసినా హీరోయిన్లు చెల్లెలు పాత్ర‌లు చేయ‌డానికి నో చెప్పేస్తుంటారు. కానీ, ఇందుకు ప్ర‌ముఖ హీరోయిన్ కీర్తి సురేష్ పూర్తి భిన్నం.

ఈమె ఓవైపు స్టార్ హీరోల స‌ర‌స‌న హీరోయిన్ గా న‌టిస్తూనే.. మ‌రోవైపు సీనియ‌ర్ స్టార్ హీరోల‌కు చెల్లెలుగా చేస్తూ సాహసాలు చేస్తోంది. మొన్నామ‌ధ్య 'పెద్దన్న'లో రజనీకాంత్ కు సోద‌రిగా చేసిన కీర్తి సురేష్‌.. ఇప్పుడు 'భోళా శంకర్‌'లో చిరంజీవికి చెల్లెలిగా న‌టిస్తోంది. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌, ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్ రామ బ్ర‌హ్మం సుంక‌ర, అనీల్ సుంక‌ర నిర్మిస్తున్నారు.

మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ ఈ మూవీకి స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నారు. త‌మిళంలో అజిత్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం 'వేదాళం'కు ఇది రీమేక్‌. సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో చిరుకు సోద‌రిగా కీర్తి సురేష్ న‌టిస్తుండ‌గా.. హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఖ‌రారైంది.

అయితే తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్టార్ హీరోయిన్ గా స‌త్తా చాటుతున్న కీర్తి సురేష్ ఇలా చెల్లెలు పాత్ర‌ల‌ను ఎంచుకోవ‌డం ఏంటి..? అనే ప్ర‌శ్న ఎంద‌రి మ‌న‌సుల్లోనో మెదులుతోంది.

తాజాగా కీర్తి సురేష్ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన‌గా.. ఇదే ప్ర‌శ్న‌ ఆమెకు ఎదురైంది. అయితే అందుకు ఆమె ఇచ్చిన స‌మాధానం ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ ఆమె ఏం చెప్పిందంటే.. 'భవిష్యత్‌లో ఎలాంటి పాత్రలు వస్తాయో ఆలోచించి ఇప్పుడు వచ్చిన మంచి పాత్రలు వదులుకోవడం నాకు అస్స‌లు ఇష్టం లేదు. ఆ కార‌ణం వ‌ల్లే చెల్లెలు పాత్ర‌ల‌ను చేస్తున్నాను. పైగా రజనీ సార్‌తో చాన్స్‌ దొరకడం కష్టం. అందుకే పెద్ద‌న్న‌లో ఆయ‌న‌కు సోద‌రిగా న‌టించా. చిరంజీవి సార్‌తో కూడా అంతే. పాత్ర‌కు చ‌క్క‌టి ప్రాధాన్య‌త ఉండ‌టంతో భోళా శంక‌ర్ నుండి ఆఫ‌ర్ రాగానే ఓకే చెప్పేశాను.' అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.

కాగా, కీర్తి సురేష్ నేడు 'స‌ర్కారు వారి పాట‌'తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేసింది. టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు హీరోగా ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అయింది. సినిమాను చూసిన ప్రేక్షకులు అప్పుడే తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. చాలా వ‌ర‌కు పాజిటివ్ రివ్యూలే వ‌స్తుండ‌టంతో మ‌హేశ్, కీర్తి సురేష్ ల ఖాతాలో హిట్ ఖాయ‌మ‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.