Begin typing your search above and press return to search.

ఈ ఇద్ద‌రి లాంటి వాళ్లుంటే థియేట‌ర్ల‌కు పండ‌గే!

By:  Tupaki Desk   |   28 Nov 2022 9:31 AM GMT
ఈ ఇద్ద‌రి లాంటి వాళ్లుంటే థియేట‌ర్ల‌కు పండ‌గే!
X
ఈ మ‌ధ్య ద‌క్షిణాదిలో కొత్త ట్రెండ్ మొద‌లైంది. ద‌ర్శ‌కుడే హీరోగా మారి వండ‌ర్స్ క్రియేట్ చేస్తున్నాడు. కోలీవుడ్, శాండ‌ల్ వుడ్ లో ఈ ట్రెండ్ చాలా కాలం క్రిత‌మే మొద‌లైంది. కానీ అది ఇప్ప‌డు ఇండియా వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టిస్తూ ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త చ‌ర్చ‌కు తెర తీస్తోంది. త‌మిళ ఇండ‌స్ట్రీలో శ‌శికుమార్ ద‌ర్శకుడిగా హీరోగా త‌న‌దైన మార్కు సినిమాల‌తో ఆక‌ట్టుకుంటూ విజ‌యాల్ని సొంతం చేసుకుంటున్నారు.

అదే త‌ర‌హాలో శాండ‌ల్ వుడ్ లోనూ శెట్టి త్రయం రాజ్ బి. శెట్టి, రిష‌బ్ శెట్టి, ర‌క్షిత్ శెట్టి ద‌ర్శ‌కులుగా, హీరోలుగా ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. రాజ్ బి. శెట్టి, రిష‌బ్ శెట్టి క‌లిసి న‌టించిన క‌న్న‌డ గ్యాంగ్ స్ట‌ర్ మూవీ 'గ‌రుడ గ‌మ‌న వృష‌భ వాహ‌న‌'. ఈ మూవీలోని కీల‌క పాత్ర‌లో రాజ్ బి. శెట్టి న‌టించ‌డ‌మే కాకుండా డైరెక్ట్ చేశాడు. ఇది అక్క‌డ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. ఇదే కాకుండా ప‌లు సినిమాల్లో న‌టించి తెర‌కెక్కించాడు.

రిష‌బ్ శెట్టి కూడా అంతే. ప‌లు సినిమాల‌కు డైరెక్ట‌ర్ ప‌ని చేసిన రిష‌బ్ శెట్టి హీరోగానూ రాణిస్తున్నాడు. రీసెంట్ గా రిష‌బ్ శెట్టి హీరోగా న‌టించి రూపొందించిన లేటెస్ట్ సెన్సేష‌న్ 'కాంతార‌'. సైలెంట్ గా విడుద‌లైన ఈ మూవీ దేశ వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విడుద‌లైన అన్ని భాష‌ల్లోనూ రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ రూ. 400 కోట్ల మైలురాయిని అధిగ‌మించి రికార్డు ద‌శ‌గా ప‌య‌నిస్తోంది.

ఈ మూవీ అందించిన స‌క్సెస్ తో త్వ‌ర‌లో 'కాంతార 2'ని కూడా రిష‌బ్ శెట్టి మొద‌లు పెట్ట‌బోతున్నాడు. దీనికి సంబంధించిన స్టోరీ డెవ‌లాపింగ్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే అనౌన్స్ చేసే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. ఇక ఇదే త‌ర‌హాలో మ‌రో ద‌ర్శ‌క హీరో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌ సంచ‌ల‌నం సృష్టిస్తున్నాడు. వాట్సాప్ కాద‌ల్‌, కాలేజ్ డైరీస్‌, హైవే కాద‌లీ, యాప్ లాక్ వంటి షార్ట్ ఫిలింస్ తో మంచి పేరు తెచ్చుకున్న ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ 'కోమాలి' సినిమాతో ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటుకున్నాడు.

'జ‌యం' ర‌వి, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన ఈ మూవీని రూ. 15 కోట్ల‌తో నిర్మిస్తే రూ. 50 కోట్లు వ‌సూలు చేయ‌డం విశేషం. దీని త‌రువాత తాను రూపొందించిన షార్ట్ ఫిల్మ్ 'యాప్ లాక్‌' ఆధారంగా ప్ర‌దీపః రంగ‌నాథ‌న్ చేసిన మూవీ 'ల‌వ్ టుడే'. న‌వంబ‌ర్ 4న త‌మిళంలో విడుద‌లైన ఈ మూవీ సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. కేవ‌లం రూ. 5 కోట్ల‌తో నిర్మించిన ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 70 కోట్ల మార్కుని దాటి రూ. 100 కోట్ల దిశ‌గా ప‌య‌నిస్తూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమాని తెలుగులో న‌వంబ‌ర్ 25న విడుద‌ల చేశారు. తొలి రోజే 2 కోట్ల మేర రాబ‌ట్టిందంటే దీని ప్ర‌భావం ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవ‌చ్చు. స్టార్ డైరెక్ట‌ర్స్ ఏళ్ల త‌ర‌బ‌డి వంద కోట్ల‌తో సినిమాలు నిర్మిస్తున్న వేళ మినిమ‌మ్ డేస్ లో మినిమ‌మ్ బ‌డ్జెట్ ల‌తో అద్భుతాలే సృష్టిస్తుండ‌ట‌మే కాకుండా థియేట‌ర్ల‌ని తమ సినిమాల‌తో రిష‌బ్ శెట్టి, ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ లు సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుండ‌టం విశేషం. దీంతో ఇలాంటి ద‌ర్శ‌కులు మ‌రింత‌గా పెరిగితే థియేట‌ర్ల‌కు పండ‌గే అనే కామెంట్ లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.