Begin typing your search above and press return to search.

'మైత్రీ వాళ్ళకీ నాకు ఏ ప్రాబ్లమ్ లేదు'.. 'వారసుడు' వివాదంపై దిల్ రాజు..!

By:  Tupaki Desk   |   28 Nov 2022 8:30 AM GMT
మైత్రీ వాళ్ళకీ నాకు ఏ ప్రాబ్లమ్ లేదు.. వారసుడు వివాదంపై దిల్ రాజు..!
X
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం కోలీవుడ్ హీరో విజయ్ తో 'వారసుడు' అనే తమిళ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చుట్టూ వివాదం నెలకొంది. డబ్బింగ్ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్లు బ్లాక్ చేస్తున్నారని.. స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు థియేటర్లు లేకుండా చేస్తున్నాడని నిర్మాతపై ఆరోపణలు వస్తున్నాయి. దిల్ రాజు లక్ష్యంగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి ప్రకటన రావడం.. దీనిపై పలువురు తమిళ సినీ ప్రముఖులు స్పందించడంతో ఇది పెద్ద వివాదంగా మారింది. అయితే తాజాగా దిల్ రాజు ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కాంట్రవర్సీపై స్పందించారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. '2019లో నేనొక స్టేట్‌మెంట్ ఇచ్చా. అప్పుడు రామ్ చరణ్‌ 'వినయ విధేయ రామ' - బాలయ్య 'ఎన్టీఆర్ బయోపిక్' - 'ఎఫ్ 2' వంటి మూడు తెలుగు సినిమాలు రిలీజ్‌ కి ఉన్నాయి. ఇవన్నీ 4-5 నెలల ముందే సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించిన సినిమాలు. సంక్రాంతి అనగానే కాంపిటేషన్ ఎక్కువ ఉంటుంది. మూడు నెలలు ముందుగానే థియేటర్లు లాక్ అయిపోతాయి. అలాంటి టైంలో రజినీకాంత్‌ గారి 'పేట' అనే సినిమాని 10 రోజుల ముందు అనౌన్స్ చేసారు. అప్పుడు కూడా నామీదే పడ్డారు. అప్పుడు దిల్ రాజు విలన్. 'పేట' కి థియేటర్లు ఇవ్వడం లేదని అన్నారు. మూడు నెలల ముందుగానే ప్లాన్ చేసుకున్న తెలుగు సినిమాలకు ప్రయారిటీ ఇచ్చిన తర్వాతే.. మిగిలిన థియేటర్లు 'పేట'కి ఇస్తామని చెప్పా. ఇది 2019 సంక్రాంతికి వచ్చిన ప్రాబ్లమ్'.

'2020లో కోవిడ్ కంటే ముందు 'సరిలేరు నీకెవ్వురు' - 'అల వైకుంఠపురములో' సినిమాలు ఉన్నాయి. నైజాంలో రెండు సినిమాలు నేనే విడుదల చేశా. రెండు సినిమాల మధ్య గట్టి పోటీ. ఇద్దరు హీరోలతో మాట్లాడి.. థియేటర్లు అన్ని బ్యాలెన్స్ చేస్తామని ఇద్దరిని కన్విన్స్ చేశా. రెండు సినిమాలని అద్భుతమైన ప్లానింగ్‌ తో రిలీజ్ చేశాం. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలను ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. లేకుండా రిలీజ్ చేసాం'.

'2021లో మా ద్వారా రెండో మూడో సినిమాలు రిలీజయ్యాయి. 'క్రాక్' అనే సినిమా బయటి రిలీజ్. అప్పటి వరకు వరంగల్ శ్రీను అనే అబ్బాయి.. ఏ సినిమా కొన్నా మా ఆఫీస్‌ కి వచ్చి, బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్లేవాడు. మేం ఎంకరేజ్ చేసేవాళ్లం. ఇది ఒక సముద్రం. ఎవరి వ్యాపారం వాళ్లది. 'క్రాక్' సినిమాకు థియేటర్ల ఇష్యూ వచ్చిందని కావాలని కొందరు గొడవ చేశారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు.. ఎవరేం చేశారనేది నాకు తెలుసు. కానీ నేనెప్పుడూ ఓపెన్‌ గా ఎవరినీ కౌంటర్ చేయను. ఎందుకు చేయనంటే.. నువ్వు కౌంటర్ చేస్తే వెంటనే ఇంకో కౌంటర్ వస్తుంటుందని ఇండస్ట్రీలో పెద్దలు చెబుతుంటారు. 2021 లో ఈ రాద్ధాంతం చేసారు'.

'ఇప్పుడు 2023 కి వస్తే.. 'వారిసు' సినిమా నేను మొదలు పెట్టినప్పుడే 2023 సంక్రాంతికి అని అనౌన్స్ చేసిన ఫస్ట్ సినిమా. తెలుగు, తమిళ్, హిందీ.. మూడు లాంగ్వేజ్ లో చేస్తున్నామని మే నెలలో అనౌన్స్ చేసాం. మే లో అనౌన్స్ చేసిన సినిమాపై ఇప్పుడు రాద్దాంతం చేస్తున్నారు. ఇందులో వాళ్లది కూడా తప్పులేదు. ఇప్పుడు ఒక్కటే ప్రొడక్షన్ హౌస్ నుంచి చిరంజీవి గారు - బాలకృష్ణగారి సినిమాలు వస్తున్నాయి. అలాగే 'ఆదిపురుష్' కూడా సంక్రాంతికి బిగ్ రిలీజ్ ఉంది. 'ఆదిపురుష్' రిలీజ్ ఉంటే బిగ్ ప్రాబ్లమ్ అయ్యేది. ఎందుకంటే నాలుగు పెద్ద సినిమాలకు అడ్జస్ట్ చేసే అన్ని థియేటర్లు లేవు'.

'ఆదిపురుష్ ని నైజాం - ఉత్తరాంధ్ర మేమే రిలీజ్ చేయాలి. నిజానికి మొన్నటి వరకు మైత్రీ సినిమాలు కూడా మేమే డిస్ట్రిబ్యూషన్ చేశాం. ఇప్పుడు వాళ్లు సొంతగా నైజాంలో ఆఫీస్ పెట్టుకుంటున్నారు. ఆఫీస్ పెట్టుకుంటున్నారు కాబట్టే వేరే వాళ్లు దీనిని అడ్వాంటేజ్ గా తీసుకుని దీనిని న్యూస్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న విషయం ఎవరికీ తెలియదు. సంక్రాంతి రేసు నుండి 'ఆది పురుష్' తప్పుకుంది. ఇప్పుడు మిగిలింది చిరంజీవిగారి - బాలకృష్ణగారి పెద్ద సినిమాలు.. మూడోది మా 'వారసుడు' సినిమా. ఈ మూడు సినిమాలకు తెలుగు స్టేట్స్‌ లో సరిపోయేంత కంఫర్టబుల్ థియేటర్స్ ఉన్నాయి. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు'.

'మైత్రీ నుంచే రెండు సినిమాలు వస్తున్నాయి. 75 ఏళ్ళ మన సినీ ఇండస్ట్రీ చరిత్రలో సంక్రాంతికి ఒకే బ్యానర్ నుంచి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ చేయడం అనేది ఫస్ట్ టైమ్. మేము మే లో డేట్ అనౌన్స్ చేస్తే.. చిరంజీవిగారి సినిమా జూన్ - జూలై‌ లో అనౌన్స్ చేశారు. 'ఆదిపురుష్' ఏప్రిల్‌ లో అనౌన్స్ చేశారు. బాలకృష్ణ గారి సినిమా డేట్ అక్టోబర్‌ లో అనౌన్స్ చేశారు. బాలకృష్ణ‌ గారి సినిమా డిసెంబర్ లో విడుదల చేయాలని ట్రై చేశారు. కానీ వర్క్ కాలేదనో.. సంక్రాంతి అడ్వాంటేజ్ అనో.. హీరోగారి సెంటిమెంట్ అనో సంక్రాంతికి రెండు రిలీజులు పెట్టుకున్నారు. ఇప్పుడు మైత్రీ వాళ్లకి ప్రాబ్లమ్ లేదు. మాకూ ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ కౌన్సిల్‌ కి ప్రాబ్లమ్. అదే సమస్య. మైత్రీ వాళ్లు వెళ్లి కౌన్సిల్‌ కి ఏమైనా కంప్లయింట్ చేశారా? అంటే అదీ లేదు. అప్పుడెప్పుడో దిల్ రాజు ఇలా మాట్లాడాడు కాబట్టి.. దిల్ రాజుని కౌంటర్ చేయడానికి దీనిని బయటికి తీసుకొచ్చారు'.

'ఇక్కడ నేను చెప్పేదేంటంటే.. దిల్ రాజుతో సహా సినిమా వ్యాపారాన్ని ఎవరం శాసించలేం. ఎవరికీ తెలియని విషయాన్ని నేనిప్పుడు చెబుతాను. నైజాంలో టోటల్ 420 స్క్రీన్స్ ఉన్నాయి. అందులో ఏషియన్ సునీల్ వాళ్ల దగ్గర 100 స్క్రీన్లు ఉన్నాయి. మొత్తంలో 37 స్క్రీన్లు మాత్రమే మావి. ఈ 100 + 37 కాకుండా.. మిగతా మల్టీప్లెక్స్ లలో ఫస్ట్ ప్రయారిటీ మాకు ఇస్తారు. ఎందుకంటే మేమేదైనా చెబితే.. సంవత్సరం అంతా వాళ్లు ఇచ్చే డబ్బు సేఫ్‌ గా ఉంటుందని భావిసారు. నా సినిమా వస్తుంది స్క్రీన్స్ కావాలంటే.. వాళ్లు హోల్డ్ చేస్తారు. ఎందుకంటే మా సంస్థకి ఉన్న గుడ్ విల్ అది. మా దగ్గర డబ్బులు ఆగిపోవు.. అడ్వాన్స్ ఇచ్చినా తిరిగి వస్తుంది అని నమ్మకం. సంవత్సరంలో నేను తీసేవి కానీ, విడుదల చేసేవి కానీ.. 10 - 12 సినిమాలతో వాళ్లకి ఫీడింగ్ ఇస్తా. మా శిరీష్ మాట్లాడితే.. ఆ మాటకి వాల్యూ ఉంటుంది. అంతేకానీ 37 థియేటర్లతో మోనోపోలీ అవుతుందా?'.

'సంవత్సరంలో ఎక్కువ సినిమాలు నా చేతి మీద నుంచి వస్తాయి కాబట్టి.. ఎగ్జిబిటర్స్ మాకు ఇంపార్టెన్స్ ఇస్తారు. వ్యాపారంగా చూస్తే నాకు నేను ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి కదా. నా వ్యాపారం పక్కన పెట్టి.. వేరొకరికి సినిమా ఇవ్వలేను కదా?. అందుకే ఎప్పుడు సంక్రాంతి వచ్చినా కౌంటర్ గా నా మీద నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అందుకే 4 ఏళ్ళ హిస్టరీ చెప్పాను. ఈసారి అసలు ప్రాబ్లమ్ ఏమీ లేదు. ప్రాబ్లమ్ లేకుండానే ప్రాబ్లమ్ క్రియేట్ చేశారు. ఎందుకంటే దిల్ రాజు అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. దాన్ని ఏం చేయలేం. ప్రతి సంక్రాంతికి నేను ఫిక్స్ అయిపోతా' అని వివరణ ఇచ్చారు. అయినా ఇక్కడ మైత్రీ వాళ్ళకి నాకు ప్రాబ్లమ్ లేదు.. నిజంగా సమస్య ఉంటే నవీన్ గారు - రవి గారు నాకు ఫోన్ చేస్తారు. మా మధ్య ఏ సమస్యా లేదని దిల్ రాజు చెప్పుకొచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.