Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో ప్రస్తుతం రెండు వర్గాలు రెండు కులాల కొట్లాట జరుగుతోందా..?

By:  Tupaki Desk   |   30 May 2020 11:30 AM GMT
టాలీవుడ్ లో ప్రస్తుతం రెండు వర్గాలు రెండు కులాల కొట్లాట జరుగుతోందా..?
X
సినీరంగంలో కూడా అన్ని రంగాలలో ఉన్నట్లే ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉంటుంది. ఇక మన టాలీవుడ్ విషయానికొస్తే సినీ ఇండస్ట్రీలో అందరం కలిసే ఉన్నాం.. అన్నదమ్ముల్లా ఉన్నాం.. మా మధ్య ఎలాంటి గ్రూపులు లేవు వర్గాలు లేవు.. గొడవలు లేవు అని చెప్తూ వస్తుంటారు. అయితే వారు ఎన్ని చెప్పినా అప్పుడప్పుడు ఇండస్ట్రీలో వర్గ పోరు ఆధిపత్య పోరు బయటపడుతూనే ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది ఆధిపత్యం కోసం వర్గాల పరంగా కులాల పరంగా గ్రూపులు క్రియేట్ చేస్తుంటారనేది ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటి నుంచో ఉన్న వాదన. ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు కృష్ణ స్టార్ హీరోలుగా ఉన్నప్పటి నుండి నెక్స్ట్ జనరేషన్ హీరోలు చిరంజీవి నాగార్జున బాలయ్య మోహన్ బాబుల వరకు ఈ వర్గ పోరు నడుస్తూనే ఉందనే మాటలు మనం తరచూ వింటూనే ఉంటాం. అనేక సందర్భాల్లో ఇది బయటపడటం.. ఒకరి మీద ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లో మరోసారి ఆధిపత్య పోరు..వర్గ పోరు.. గ్రూపు రాజకీయాలు బయట పడ్డాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన చిత్ర పరిశ్రమ కార్యకలాపాలన్నీ రెండు నెలల క్రితమే మూతబడిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య ప్రభుత్వాలు క్రమంగా కొన్ని నిబంధనలు సడలిస్తూ వస్తున్నాయి. దీనితో సినిమా కార్యకలాపాలకు కూడా అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఇటీవల సినీ ప్రముఖుల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ప్రభుత్వం తరపు నుండి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పాల్గొన్నారు. అలానే టాలీవుడ్ నుంచి నాగార్జున, రాజమౌళి, కొరటాల శివ, మెహర్ రమేష్, త్రివిక్రమ్, దిల్ రాజు, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత తెలంగాణలో సినిమా షూటింగ్స్‌ కు అనుమతులు కల్పించాలంటూ టాలీవుడ్‌ ప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్‌, ఎస్.ఎస్‌. రాజమౌళి, దిల్‌రాజు, సురేశ్‌ బాబు, మెహర్‌ రమేశ్‌, ఎన్‌. శంకర్‌, రాధాకృష్ణ, సి.కల్యాణ్‌, కొరటాల శివ, త్రివిక్రమ్‌, జెమిని కిరణ్‌, ప్రవీణ్‌ బాబు తదితరులు ఉన్నారు. అయితే ఇండస్ట్రీలోని చాలా మంది ప్రముఖులు ఈ మీటింగ్ లో కనిపించలేదు.

ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ సినీ ప్రముఖుల సమావేశం గురించి తనకు తెలియదని.. అందరిలాగే వార్తల్లో చూసి తెలుసుకున్నానని అన్నారు. ఆ సమావేశానికి నన్నెవరూ ఆహ్వానించలేదని కూడా బాలయ్య వ్యాఖ్యలు చేశారు. వీళ్లంతా కూర్చుని తలసానితో భూములు పంచుకుంటున్నారా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలయ్య వ్యాఖ్యలతో టాలీవుడ్ లో దుమారం రేగుతోంది. దీనిపై స్పందించిన నాగబాబు మాట్లాడుతూ.. సినీ పరిశ్రమపై నోరు జారొద్దు. మీటింగ్‌ కు ఎవరిని పిలవాలో కమిటీకి తెలుసు. బాలయ్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. బాలయ్య నోరు అదుపులో ఉంచుకోవాలి. బాలయ్య ఒకటంటే.. మేము రెండు మాటలనేందుకు రెడీగా ఉన్నాం. ప్రభుత్వానికీ సినీ ఇండస్ట్రీకి బాలయ్య క్షమాపణలు చెప్పాలి. ఇండస్ట్రీకి మీరు కింగ్ కాదు జస్ట్ ఒక హీరో మాత్రమే అంటూ పలు ఘాటైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వర్గ పోరు నడుస్తుందనే అనుమానం రేకెత్తిస్తున్నాయి.

నాగబాబు వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఈ ఇష్యూలో బాలయ్యని సపోర్ట్ చేస్తూ చిరంజీవిని విమర్శించారు. ''బాలకృష్ణని సమావేశానికి ఆహ్వానించకపోవడం తప్పు.. ఆయన కేవలం హీరో మాత్రమే కాదు. ఛాంబర్ లోని ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో మెంబర్.. ఈ సమావేశం గురించి నరేశ్‌, జీవితా రాజశేఖర్‌, ఫిలిమ్‌ ఛాంబర్‌, కౌన్సిల్‌ లోని సభ్యులెవరికీ తెలియదు.. చిరంజీవి గారి ఇంట్లో సమావేశం పెట్టుకుంటే నాకేం ఇబ్బంది లేదు.. కానీ అందరిని గౌరవించాల్సిన భాద్యత ఉంది.. మద్రాస్ నుండి ఇండస్ట్రీ ఇక్కడికి తరలి రావడంలో చిరంజీవి అప్పట్లో కొన్ని అభ్యంతరాలు తెలిపారు.. అలాంటిది ఇప్పుడు రాళ్ళూ రప్పలు ఉన్న చోట అద్భుతమైన స్టూడియోలు నిర్మించిన వారిని పక్కన పెట్టడం ఎంత వరకు కరెక్ట్'' అని ప్రసన్న కుమార్ ప్రశ్నించారు. అలానే నిర్మాత నట్టి కుమార్, కేతిరెడ్డి చిట్టి లాంటి సినీ ప్రముఖులు కూడా ఈ ఇష్యూ పై బహిరంగంగా మాట్లాడారు.

మరోవైపు సి. కళ్యాణ్ తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ఎక్కడికి ఎవరు అవసరమైతే వాళ్లను తీసుకెళ్తాం.. ఎవరితో పని జరుగుతుందంటే వాళ్లను తీసుకెళ్తాం.. అయినా ఇది ఆర్టిస్టులను పిలిచే మీటింగ్ కాదు.. నిర్మాతల సమావేశం. అందరినీ బొట్టు పెట్టి పిలవాలా.. అవసరం అనుకున్నవారిని పిలుస్తారు లేకపోతే లేదు అంటూ కామెంట్స్ చేసారు. ఇలా ఎవరికి వారు పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తుండటంతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు రెండు వర్గాలు రెండు కులాల కొట్లాటగా మారిపోయిందా అని సోషల్ మీడియాలో డిస్కషన్ చేసుకుంటున్నారు. అందుకనే కులాల వారీగా వర్గాలుగా ఏర్పడి ఇండస్ట్రీలో గొడవలకి కారణమవుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న వర్గాల కారణంగానే కొందరు మాత్రమే కలిసి మీటింగ్ పెట్టుకున్నారని.. కొత్తగా టాలీవుడ్ లో మొదలైన ఈ ఆధిపత్య పోరు వలన ఇండస్ట్రీ రెండుగా చీలిపోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి వచ్చి చర్చించుకోవాల్సింది పోయి.. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం ఏమిటని విమర్శిస్తున్నారు. మరి ఇప్పటికైనా ఇండస్ట్రీలో ఈ వర్గపోరు ఆధిపత్య పోరు వదిలేసి ఇండస్ట్రీ బాగు కోసం పాటుపడాలని నెటిజన్స్ సూచిస్తున్నారు.