Begin typing your search above and press return to search.

'ఘ‌రానా మొగుడు' 4కే వెర్ష‌న్ తో ట్రీట్

By:  Tupaki Desk   |   14 Aug 2022 9:30 AM GMT
ఘ‌రానా మొగుడు 4కే వెర్ష‌న్ తో ట్రీట్
X
సూపర్ స్టార్ మహేష్ న‌టించిన‌ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ 'పోకిరి' రీ-రిలీజ్ ఘ‌న‌విజ‌యం త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన 'జ‌ల్సా'ని రీరిలీజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సెప్టెంబ‌ర్ 2న ఈ చిత్రం ప‌వ‌న్ అభిమానుల సంద‌డి న‌డుమ థియేట‌ర్ల‌లో ఆడిస్తున్నారు. పోకిరి త‌ర‌హాలోనే జల్సా చిత్రం 4కెలో రీమాస్టర్ చేసి పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆరోజు విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు రికార్డు స్థాయిలో షోలు వేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇంత‌లోనే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న 'ఘరానా మొగుడు' స్పెషల్ షోలను ప్రదర్శించనున్నట్లు సమాచారం. మెగాభిమానుల‌కు సెప్టెంబర్ 2న ప‌వ‌న్ ట్రీటిస్తుండ‌గా.. ఆగ‌స్టు 22న మెగాస్టార్ క్లాసిక్ హిట్ మూవీతో ట్రీట్ ఇవ్వ‌నున్నారు. ఘరానా మొగుడు స్పెషల్ షోల గురించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నగ్మా - వాణీ విశ్వనాథ్ కథానాయికలుగా నటించారు. ఎంఎం కీరవాణి దీనికి సంగీతం అందించారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

కోటి పైగా పారితోషికం అప్ప‌ట్లోనే..!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ పారితోషికం అందుకున్న సౌత్ హీరోగా చిరుకి పేరు రావ‌డానికి 'ఘ‌రానా మొగుడు' క్రేజ్ ఒక కార‌ణం. ప్ర‌ఖ్యాత ది వీక్ మ్యాగ‌జైన్ .. బిగ్గ‌ర్ దేన్ అమితాబ్ పేరుతో క‌థ‌నాన్ని వెలువ‌రించ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మైంది. మెగాస్టార్ చిరంజీవి కేవ‌లం తెలుగు వ‌ర‌కే ప‌రిమితం కాదు. దేశంలోని అతిపెద్ద స్టార్ లలో ఒకరిగా నిస్సందేహంగా చెప్పుకోదగిన హీరో ఆయ‌న‌.

పారితోషికం ప‌రంగా రెజియ‌న‌ల్ మార్కెట్లో అత‌డు ఎప్పుడూ నంబ‌ర్ వ‌న్ హోదాను క‌లిగి ఉన్నారు. ఇటీవ‌ల ఇంత పోటీలోనూ తనదైన వాటాను కలిగి ఉన్నారు. కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ అందుకున్న తొలి తెలుగు నటుడిగా మెగాస్టార్ చిరంజీవికి గుర్తింపు ఉంది. కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన 1992 తెలుగు చిత్రం ఆపద్బాంధవుడు కోసం చిరంజీవికి రూ.1.25 కోట్ల పారితోషికం చెల్లించారు.

ఆ సమయంలో ఒక తెలుగు నటుడికి చెల్లించిన అత్యధిక పారితోషికం ఇదే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఒక్కో ప్రాజెక్ట్ కి రూ.1 కోటి వసూలు చేస్తున్న సమయంలో అతను అమితాబ్ బచ్చన్ ను మించి అందుకున్నారు.

ఘరానా మొగుడు బంప‌ర్ హిట్ కొట్టాక అప్పట్లోనే ఒక్కో చిత్రానికి రూ.1.25 కోట్లు పారితోషికం అందుకున్నారు చిరు. అప్ప‌టివ‌ర‌కూ దేశంలోనే నంబర్ వన్ హీరోగా ఉన్న అమితాబ్ రికార్డ్ ని బ్రేక్ చేశారు. ప్ర‌ఖ్యాత ది వీక్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ స్టోరీని ప్ర‌చురించ‌డంతో అది సంచ‌ల‌న‌మే అయ్యింది. చిరును ఆ స్థాయిలో నిల‌బెట్టిన 'ఘరానా మొగుడు' చిత్రం ఈ ఏడాదితో 30 వసంతాలు పూర్తి చేసుకుంది. దాదాపు 10కోట్లు గ్రాస్ వ‌సూలు చేసిన ఏకైక చిత్రంగా నాడు ఘ‌ర‌నామొగుడు రికార్డులకెక్కింది. తమిళంలో రజినీకాంత్-విజయశాంతి జంటగా పి.వాసు దర్శకత్వంలో రూపొందిన 'మన్నన్' ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.