Begin typing your search above and press return to search.

క‌న్ఫ్యూజ్ చేయ‌డంలో ఆర్జీవీ త‌ర్వాత ఈయ‌నే!

By:  Tupaki Desk   |   28 May 2023 2:00 PM GMT
క‌న్ఫ్యూజ్ చేయ‌డంలో ఆర్జీవీ త‌ర్వాత ఈయ‌నే!
X
సూటిగా సుత్తి లేకుండా మాట్లాడ‌డం కొంద‌రికి అల‌వాటు. ఆర్జీవీ-కృష్ణ‌వంశీ బ్యాచ్ చాలా నిజాయితీగా మాట్లాడుతార‌న్న టాక్ కూడా ఉంది. ఓపెన్ హార్ట్ తో ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడ‌డం వీరికి అల‌వాటు. ఇక తేజ కూడా అందుకు మిన‌హాయింపేమీ కాదు. మ‌న‌సులో ఏం ఉన్నా సూటిగా దాని గురించి బ‌హిరంగ వేదిక‌ల‌పై అనేస్తుంటారు. అలా సూటిగా మాట్లాడి ఒక్కోసారి పెద్ద‌ చిక్కుల్లో కూడా ప‌డుతుంటారు. మంచిని బ‌య‌టికి గ‌ట్టిగా చెప్పాలి.. చెడును చెవిలో చెప్పాలి అని మెగాస్టార్ సూత్రీక‌రించిన దానిని ప‌ట్టించుకోకుండా తేజ చేసిన తాజా ప్ర‌క‌ట‌న అంద‌రినీ గంద‌ర‌గోళంలోకి నెట్టేసింది.

ఇంత‌కీ ఏమా గంద‌ర‌గోళ ప్ర‌క‌ట‌న అంటే...? డి.సురేష్ బాబు - రానా స‌హా ప్ర‌ముఖుల్లో సందేహాలు రేకెత్తించిన ఆ ప్ర‌క‌ట‌న సారాంశం ఇలా ఉంది. శ‌నివారం సాయంత్రం `అహింస` మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో తేజ మాట్లాడుతూ.. అభిరామ్ దగ్గుబాటితో ఎందుకు సినిమా తీయాల్సి వచ్చిందో చెప్పే ప్రయత్నం చేసారు. అయితే ఇదే వేదిక‌పై ఆ సినిమా సరిగ్గా రాలేదని ఆపేయాల‌నుకున్నామ‌ని కూడా వెల్ల‌డించారు. నిజానికి అహింస చిత్రంలోని పాత్ర‌కు అభిరామ్ ద‌గ్గుబాటి స‌రిపోతాడ‌నే ఎంపిక చేసుకున్న‌ట్టు ఇంత‌కుముందు వెల్ల‌డించినా కానీ ఇప్పుడు అందుకు విరుద్ధ ప్ర‌క‌ట‌న చేసి తేజ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

తాను అపరాధభావంతో ఈ సినిమా తీసినట్లు చెప్పాడు. కీ.శే ద‌గ్గుబాటి రామానాయుడు అభిరామ్ ని హీరోని చేయ‌మ‌ని త‌న‌ను కోరార‌ని .. కానీ తాను ఆ త‌ర్వాత ఆయ‌న ఫోన్ కాల్స్ ప‌ట్టించుకోలేద‌ని తెలిపారు. ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కే రామానాయుడు క‌న్నుమూశార‌ని.. అటుపై ఆయ‌న మాట‌ల‌ను ప‌ట్టించుకోనందుకు అప‌రాధ భావ‌న క‌లిగి అభిరామ్ తో సినిమా చేయాల‌ని నిర్ణయించుకున్నానని తేజ చెప్పారు.

కథ రాసి సురేష్ బాబుకి వినిపించ‌గా.. ఆయ‌న‌ వెంటనే `అభిరామ్ తోనే ఎందుకు?` అని అడిగార‌ని.. వెంటనే `గో ఎహెడ్` అన‌కుండా అయిష్టతను వ్యక్తం చేశార‌ని తేజ తెలిపారు. ఎలాగోలా సురేష్ బాబుని ఒప్పించాను. కానీ 90 శాతం సినిమా పూర్తి చేశాక సినిమా బాగా రాలేదని అర్థం చేసుకుని ఆపేద్దామన్నాడు. నేను దీన్ని బ్లాక్ బస్టర్ చేయడం లేదా భారీ లాభాలను ఆర్జించ‌డం గురించి కాదు.. లెజెండ్ రామా నాయుడుకి నేను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం మాత్రమే చేసానని అన్నాను. అప్పుడు సురేష్ బాబు కూడా ఒప్పుకున్నారు! అని అన్నారు.

అయితే తేజ చెప్పాల‌నుకున్న సందేశం కాస్త త‌లా తోక లేనిదిగా అవ్వ‌డంతో ఇది పూర్తిగా మిస్ అండ‌ర్ స్టాండింగ్ కి దారి తీసింది. ధ‌నార్జ‌న కంటే రామానాయుడు గారికి మాట ఇచ్చినందుకు అభిరామ్ తో సినిమా తీసాన‌ని అన‌డం బాగానే ఉంది కానీ 90శాతం తీసాక సినిమా బాలేదు ఆపేద్దామ‌ని అన్న‌ట్టు చెప్పుకొచ్చారు. ఆ మాట ద‌ర్శ‌కుడి నోటి నుంచి రాకూడనిది. దీనికి వేదిక ముందే ఉన్న సురేష్ బాబు - రానా త‌దిత‌ర బృందం నొచ్చుకోకుండా ఉంటుందా? సినిమా బాగా రాక‌పోయేస‌రికి స‌మ‌యం తీసుకుని తిరిగి రీషూట్లు చేసారా? అన్న‌దానిని తేజ ప్ర‌స్థావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కీ స్వ‌యంకృతం లేదా అప‌రాధ‌భావంతోనే అహింస సినిమాని తేజ తెర‌కెక్కించారా? అన్న‌దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.