Begin typing your search above and press return to search.

తేజ నిజాయితీ.. సినిమాకు చేటు

By:  Tupaki Desk   |   29 May 2023 10:36 AM GMT
తేజ నిజాయితీ.. సినిమాకు చేటు
X
టాలీవుడ్ లో చాలా ముక్కు సూటిగా, నిజాయితీగా మాట్లాడే దర్శకుల్లో ఒకడిగా తేజకు పేరుంది. తన గురువు రామ్ గోపాల్ వర్మకు కొంచెం దగ్గరగా కనిపించే తేజ.. మాటలు, చేతల్లో ఆయనలా పతనం అయితే అయిపోలేదు.

కానీ అవతలి వాళ్లు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా తనకు ఏమనిపిస్తే అది మాత్రం మాట్లాడేస్తారు.ఎన్నో ఇంటర్వ్యూల్లో, సినిమా వేడుకల్లో తేజ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా తన కొత్త సినిమా 'అహింస' ప్రి రిలీజ్ ఈవెంట్లో తేజ చేసిన వ్యాఖ్యలు దగ్గుబాటి ఫ్యామిలీకి కొంచెం ఇబ్బందికరంగానే మారాయి.

అభిరామ్ దగ్గుబాటితో సినిమా చేయడానికి రామానాయుడికి ఇచ్చిన మాటే కారణమని చెప్పిన ఆయన.. అభిరామ్‌ను తాను లాంచ్ చేయాలనుకున్నపుడు సురేష్ బాబు ''వాడితో సినిమా ఎందుకు'' అంటూ తేలిగ్గా తీసి పడేసినట్లు వెల్లడించారు.

ఈ మాట అభిరామ్‌కు కచ్చితంగా కాస్త ఇబ్బందికరమే. తండ్రే నమ్మనపుడు వేరే వాళ్లు అభిరామ్‌ను ఎలా నమ్ముతారనే ప్రశ్న తలెత్తడం ఖాయం. ఇదే ఇబ్బందికరం అంటే 'అహింస' సినిమా ఔట్ పుట్ మీదే సందేహాలు కలిగేలా తేజ మరో మాట అన్నారు.

సినిమా షూటింగ్ జరుగుతున్నపుడు మధ్యలో రష్ చూసిన సురేష్ బాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. తన కొడుకును ఉద్దేశించి మాట్లాడుతూ.. ''వీడు సరిగా చేయలేదు కదా. సినిమా ఆపేయొచ్చు కదా'' అని సురేష్ అన్నట్లు తేజ వెల్లడించాడు. ఆ మాట 90 శాతం సినిమా పూర్తయిన దశలో సురేష్ అన్నట్లు తేజ చెప్పాడు.

ఐతే అప్పుడు తాను రామానాయుడికి ఇచ్చిన మాటను గుర్తు చేస్తే సురేష్ కూడా ఎమోషనల్ అయి.. ఎలా అయినా ఈ సినిమాను హిట్ చేద్దాం అని తమ దారిలోకి వచ్చినట్లు తేజ వెల్లడించాడు. ఐతే 90 శాతం సినిమా పూర్తయ్యాక రష్ చూసి ఔట్ పుట్ బాగా లేదని, తన కొడుకు బాగా చేయలేదని సురేష్ బాబు అభిప్రాయపడ్డాడంటే రేప్పొద్దున ప్రేక్షకులకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి తేజ నిజాయితీ ఈ సినిమా మీద జనాల్లో ప్రతికూల అభిప్రాయాలు కలిగేలా చేస్తోందన్నది వాస్తవం.