Begin typing your search above and press return to search.

ప్రాణం పెట్టి పని చేస్తున్నాం.. 'ప్రాజెక్ట్‌ కే' హైప్ పీక్స్‌

By:  Tupaki Desk   |   17 May 2022 11:41 AM GMT
ప్రాణం పెట్టి పని చేస్తున్నాం.. ప్రాజెక్ట్‌ కే హైప్ పీక్స్‌
X
ప్రభాస్‌ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూసిన రాధేశ్యామ్‌ సినిమా నిరాశ పర్చింది. దర్శకుడు రాధాకృష్ణ తీవ్రంగా ప్రభాస్ అభిమానులను నిరాశ పర్చాడు. రాధేశ్యామ్‌ సినిమా నిరాశ పర్చినా ముందు ముందు రాబోతున్న ప్రభాస్ సినిమాలు ఖచ్చితంగా తాము తల ఎత్తుకునేలా చేస్తాయనే నమ్మకంతో ప్రభాస్ అభిమానులు ఉన్నారు. ప్రభాస్ పలు చిత్రాలు చేస్తున్న చాలా మంది ప్రాజెక్ట్‌ కే వైపే ఆసక్తిగా చూస్తున్నారు.

రాధేశ్యామ్‌ తర్వాత ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే ఆదిపురుష్‌ షూటింగ్‌ పూర్తి అయ్యి పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. వచ్చే ఏడాది సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఇక సలార్‌ సినిమా షూటింగ్ ఇప్పటికే 30 శాతం పూర్తి అయ్యింది. త్వరలో కొత్త షెడ్యూల్‌ ను ప్రారంభించేందుకు గాను దర్శకుడు ప్రశాంత్‌ నీల్ ఏర్పాట్లు చేస్తున్న విషయం తెల్సిందే.

ఇక ఇటీవలే ప్రాజెక్ట్‌ కే కు సంబంధించిన కీలక షెడ్యూల్‌ ను రామోజీ ఫిల్మ్‌ సిటీ లో నిర్వహించారు. అయితే ఇప్పటి వరకు ప్రభాస్‌ ప్రాజెక్ట్ కే యొక్క అప్‌డేట్‌ కాని.. ఫస్ట్‌ లుక్‌ కాని రావడం లేదు అంటూ అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు. ప్రభాస్ అభిమానులు రెగ్యులర్‌ గా ప్రభాస్ ప్రాజెక్ట్‌ కే గురించి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ను సోషల్‌ మీడియా ద్వారా ఏదో ఒక విధంగా ప్రశ్నిస్తూ.. ఫస్ట్‌ లుక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.

తాజాగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రభాస్ అభిమానులకు బూస్ట్‌ ఇచ్చే వ్యాఖ్యలు చేశాడు. ఆయన ప్రాజెక్ట్‌ కే గురించి స్పందిస్తూ... ఇటీవలే ఒక షెడ్యూల్‌ ను పూర్తి చేశాం. ప్రభాస్ ఇంట్రో సన్నివేశాలను చిత్రీకరించాం. సినిమా లో ఆయన లుక్ చాలా కూల్‌ గా ఉంటుంది.

జూన్ నుండి తదుపరి షెడ్యూల్‌ ను మొదలు పెట్టబోతున్నాం. సినిమా కోసం అందరం ప్రాణం పెట్టి పని చేస్తున్నాం అన్నాడు. విడుదల విషయంలో కాస్త సమయం పడుతుంది.. రిలీజ్ ఆర్డర్‌ లో మనం చివర్లో ఉన్నాం.. కనుక సమయం పట్టవచ్చు అన్నట్లుగా చెప్పాడు.

ప్రాజెక్ట్‌ కే కోసం ప్రతి ఒక్కరం ప్రాణం పెట్టి పని చేస్తున్నాం అంటూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా సినిమా పై ప్రతి ఒక్కరిలో హైప్స్ అమాంతం పెంచినట్లు అయ్యింది. సినిమా యొక్క అప్డేట్స్ అప్పుడప్పుడు ఇలా నాగ్‌ అశ్విన్‌ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ సినిమా టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ తో సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకే సింగీతం శ్రీనివాస్ ను ఈ సినిమా కోసం మెంటర్‌ గా తీసుకున్నారనే టాక్‌ కూడా వినిపిస్తుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా 2024 లో వస్తుందేమో చూడాలి.