Begin typing your search above and press return to search.

రీమేక్‌తో మరో క్లాసిక్‌ సాంగ్‌ను బ‌లి చేశారా?

By:  Tupaki Desk   |   24 Sep 2022 6:24 AM GMT
రీమేక్‌తో మరో క్లాసిక్‌ సాంగ్‌ను బ‌లి చేశారా?
X
వివిధ భాష‌ల్లో సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యిన సినిమాలు, పాట‌ల‌ను మ‌ళ్లీ తిరిగి రీమిక్స్ చేయ‌డం, రీమేక్ చేయ‌డం వంటి ప్ర‌యోగాలు త‌రచూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. వీటిలో హిట్ట‌య్యేవాటి కంటే అట్ట‌ర్ ప్లాపులు అయిన‌వాటి సంఖ్యే ఎక్కువ‌. అస‌లు గ‌తంలో క్లాసిక్స్‌గా నిలిచిపోయిన సినిమాల‌ను, పాట‌ల‌ను రీమేక్, రీమిక్స్‌, రీక్రియేష‌న్‌ల పేరుతో చెడగొట్ట‌వ‌ద్ద‌నే కోరేవారే ఎక్కువ‌. ఒరిజిన‌ల్ సినిమాల మేక‌ర్స్, న‌టీనటులు, సింగ‌ర్స్ కూడా ఈ రీమిక్స్, రీమేక్‌ల పేరుతో వాటిని చెడ‌గొట్టడంపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

తాజాగా బాలీవుడ్‌లో ఇప్పుడు ఇలాంటి అంశ‌మే కాక‌రేపుతోంది. ప్ర‌ముఖ గాయ‌ని నేహా క‌క్క‌ర్ గ‌తంలో మ‌రో ప్ర‌ముఖ గాయ‌ని పాల్గుని పాథ‌క్ పాడిన ఓ క్లాసిక్ సాంగ్‌ను రీమేక్ పేరుతో చెడగొట్టింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ట్రోల్స్, మీమ్స్ తో నేహా క‌క్క‌ర్‌పై విరుచుకుప‌డుతున్నారు. తాను పాడిన సూప‌ర్ హిట్ సాంగ్ ను నేహా క‌క్క‌ర్ చెడ‌గొట్ట‌డంపై ఒరిజిన‌ల్ సింగ‌ర్ పాల్లుని పాథ‌క్ కూడా తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నార‌ని స‌మాచారం.

తాజాగా.. శ్రీలంకకు చెందిన సింగ‌ర్ యోహానీతో 'మనికే మేగే' సాంగ్‌ను.. అజ‌య్ దేవ్ గ‌ణ్, సిద్ధార్థ మ‌ల్హోత్రా ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌స్తున్న‌ 'థ్యాంక్‌ గాడ్‌' సినిమా కోసం ఆమెతోనే పాడించారు. అయితే ఆ సాంగ్‌ కొరియోగ్రఫీ కంపోజిషన్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇప్పుడు మరో క్లాసిక్‌ పాటను చెడగొట్టే ప్ర‌య‌త్నం జ‌రిగింద‌ని ప్రేక్ష‌కులు భ‌గ్గుమంటున్నారు.

'మైనే పాయల్‌ హై ఛన్‌కాయి' సాంగ్‌ గుర్తుందా? 1999లో ప్రాంతం, భాషాబేధాలు లేకుండా దేశాన్ని ఊపేసింది ఈ మ్యూజిక్ వీడియో. యువ‌త‌ను బాగా ఆక‌ట్టుకుంది ఈ సాంగ్. ప్ర‌ముఖ గాయ‌ని పాల్గుణి పాథ‌క్ అదిరిపోయే వాయిస్‌తో ఈ పాట‌కు వ‌న్నె తెచ్చారు. వివన్‌ భాటేనా, నిఖిలా పలాట్‌లు ఇందులో నటించారు. స్కూల్ ఈవెంట్‌లో తోలుబొమ్మల ప్రదర్శన మీద ఈ సాంగ్‌ పిక్చరైజేషన్ ఉంది.

ఇప్పుడు 'మైనే పాయ‌ల్ హై ఛ‌న్‌కాయి' ను రీక్రియేష‌న్ చేస్తూ సింగర్‌ నేహా కక్కర్‌ 'ఓ సజ్‌నా' పేరిట రీమిక్స్ చేసింది. దీంతో ప్ర‌ముఖ ఆడియో కంపెనీ టి సిరీస్ నిర్మించింది. ఓ సజ్‌నాకు తన్షిక్‌ బాగ్చీ సంగీతం అందించగా.. ప్రియాంక శర్మ, ధనాశ్రీ వర్మ నటించారు.

దీంతో మంచి పాటను చెడగొట్టారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే నేహా కక్కర్‌ పాడిన పలు రీక్రియేషన్స్‌పై ఇప్ప‌టికే ప‌లు అభ్యంత‌రాలున్నాయి. గ‌తంలో ప‌లు పాట‌ల‌ను రీమిక్స్ చేసిన ఆమె వాటిని చెడ‌గొట్టింద‌నే అపప్ర‌థ మూట‌గ‌ట్టుకున్నారు.

మ‌రోవైపు అభిమానులు, ప్రేక్ష‌కులే కాకుండా 'మైనే పాయల్‌ హై ఛన్‌కాయి' ఒరిజిన‌ల్ పాట పాడటంతోపాటు దానికి కంపోజ‌ర్ కూడా అయిన ఫాల్గుణి పాథ‌క్ కూడా తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ని చెబుతున్నారు. ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో షేర్‌ చేసిన కొన్ని మీమ్స్‌ను, విమర్శలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో పోస్టు చేశారని మీడియా క‌థ‌నాలు పేర్కొన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.