Begin typing your search above and press return to search.

తల్లిదండ్రుల కేసు.. లీగల్ నోటీసులు పంపిన ధనుష్

By:  Tupaki Desk   |   22 May 2022 9:44 AM GMT
తల్లిదండ్రుల కేసు.. లీగల్ నోటీసులు పంపిన ధనుష్
X
తమిళ స్టార్ హీరో ధనుష్ అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే మొన్నటివరకూ ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు. ఆయన కూతురుతో విడిపోయాక తల్లిదండ్రులతోనే ఉంటున్నాడు. తమిళ ప్రేక్షకులకే కాదు.. బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ధనుష్ సుపరిచితుడే. హీరోగా.. నిర్మాతగా రాణిస్తున్నాడు. అయితే తమిళంలో ఎంతో పెద్ద స్టార్ అయిన ధనుష్ ను ఇటీవల ఓ సమస్య వేధిస్తోంది. ధనుష్ మా కొడుకేనంటూ మధురైకి చెందిన కదిరేషన్, మీనాక్షి దంపతులు మద్రాస్ హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే.

దక్షిణ తమిళనాడులోని మధురైకి చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు ధనుష్ తమ కొడుకేనని.. చిన్నప్పుడే ఇంట్లోనుంచి పారిపోయాడని కోర్టులో ఫిర్యాదు చేశారు. ధనుష్ మాత్రం తాను వాళ్ల కొడుకు కాదని కోర్టులో పిటీషన్ వేశారు. దీంతో ధనుష్ ఎవరి కుమారుడోనన్న ఉత్కంఠ కోర్టులో.. మీడియాలో హైలెట్ అయ్యింది. హీరో ధనుష్ తమ కొడుకేనని కొద్దిరోజులుగా న్యాయపోరాటం చేస్తున్న మేలూర్ కు చెందిన వృద్ధ దంపతుల కేసును మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో తుది తీర్పును వెలువరించింది. ఈ కేసునుంచి హీరో ధనుష్ కు విముక్తి లభించింది. హీరో ధనుష్ 1983లో జూలై 28న ఎగ్మోర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కృష్ణమూర్తి, విజయలక్ష్మీ దంపతులకు జన్మించాడని ధనుష్ ఆధారాలు చూపించారు. ఇవన్నీ పక్కాగా ఉండడంతో ధనుష్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు కేసును కొట్టివేసింది..

అయితే ధనుష్ పుట్టమచ్చలు తొలిగించుకున్నారని వృద్ధ దంపుతులు కోర్టుకు విన్నవించారు. వీటిని కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఆధారాలు సరిగ్గా చూపలేదని.. కేవలం పుట్టుమచ్చలతో కేసును బలపరచలేమని కోర్టు వ్యాఖ్యానించింది. లేజర్ ట్రీట్ మెంట్ తో పుట్టుమచ్చలు తొలగించారని వారు వాదించారు. అయితే ధనుష్ దీన్ని ఖండించారు. తాను డైరెక్టర్ కస్తూరి రాజా కుమారుడినంటూ గతంలో కోర్టుకు జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించారు. కానీ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు తన అభ్యర్థనను తిరస్కరించిందని అప్పీల్ పై కతిరేశన్ ఆరోపించారు. కేసులో సదురు మధురైకి చెందిన దంపతులు ధనుష్ తమకు నెలకు రూ.65వేలను ఇవ్వాలంటూ పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ధనుష్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనను వేధిస్తున్న కదిరేషన్, మీనాక్షి దంపతులకు లీగల్ నోటీసులు పంపాడు. తనపై అసత్య ఆరోపణలను మానుకోవాలని.. పరువుకు భంగం కలిగిస్తున్నందుకు క్షమాపణలు చెప్పకపోతే రూ.10 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తనను వేధిస్తున్న తల్లిదండ్రులపై కోర్టులోనే తేల్చుకోవడానికి రెడీ అయ్యారు.