Begin typing your search above and press return to search.

'క్రాక్' వివాదం.. కథ నాదేనంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన రైటర్..!

By:  Tupaki Desk   |   14 May 2022 12:30 PM GMT
క్రాక్ వివాదం.. కథ నాదేనంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన రైటర్..!
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన సినిమా ''క్రాక్''. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ బ్యానర్‌ పై ఠాగూర్ మధు నిర్మించారు. 2021 సంక్రాంతికి 50% ఆక్యుపెన్సీతో విడుద‌లై.. బాక్సాఫీస్ వద్ద భారీ విజ‌యాన్ని నమోదు చేసింది. ఈ సినిమా వచ్చి ఏడాదిన్నర దాటినా ఇంకా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.

'క్రాక్' సినిమా కథ తనదేనంటూ సికింద్రాబాద్‌ లోని అల్వాల్‌ లో ఉండే శివ సుబ్ర‌మ‌ణ్యమూర్తి అనే రచయిత హైద‌రాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 2015లో 'బ‌ల్లెం సినిమా మీడియా డైరెక్ట‌రీ' అనే పుస్తకాన్ని రచించారని.. త‌న పుస్త‌కంలోని స‌న్నివేశాల‌ను కాఫీ చేసి 'క్రాక్' సినిమాలో ఉప‌యోగించుకున్నార‌ని రైటర్ ఆరోపించారు.

ఈ విషయమై 'క్రాక్' దర్శక నిర్మాతలతో పాటుగా హీరోకు ఫిలిం ఛాంబర్ నుంచి నోటీసులు పంపించినా.. ఎవరూ స్పందించలేదని.. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని రచయిత తెలిపారు. నిర్మాత ఠాగూర్ మ‌ధు జూబ్లీ హిల్స్‌ లోనే ఉండ‌టంతో ఆ పరిధిలోని పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసిన‌ట్లు చెప్పాడు.

'క్రాక్' చిత్రాన్ని ఒంగోలు ప్రాంతంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా అల్లుకున్న కథతో రూపొందించినట్లు దర్శకుడు గోపీచంద్ మలినేని చెబుతూ వచ్చారు. అయితే ఇది 'సేతుపతి' అనే తమిళ మూవీ ఫ్రీమేక్ అని రూమర్స్ వచ్చాయి. కాకపోతే అందులోని హీరో క్యారక్టరైజేషన్ తో పాటుగా కొన్ని సీన్స్ స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలుస్తుంది.

కానీ ఇప్పుడు శివ సుబ్ర‌మ‌ణ్యమూర్తి 'క్రాక్' సినిమాలోని సన్నివేశాలు తన పుస్తకం నుంచి కాపీ కొట్టారని ఆరోపిస్తున్నారు. నిజానికి 'క్రాక్' సినిమా విషయంలో అనేక వివాదాలు తలెత్తాయి. తమిళ నిర్మాతలతో ఉన్న ఆర్ధికపరమైన లావాదేవీల కారణంగా 'క్రాక్' సినిమా విడుదలపై హైకోర్టు స్టే విధించడంతో.. రిలీజ్ రోజు మార్నింగ్ - మ్యాట్నీ షోలు పడలేదు.

అలానే ఈ సినిమాకు సంబంధించి తనకు ఇవ్వాల్సిన రూ.12 లక్షల బ్యాలెన్స్ అమౌంట్ ఠాగూర్ మధు ఇవ్వడం లేదంటూ దర్శకుడు గోపీచంద్ మలినేని తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌ లో ఫిర్యాదు చేసారు. అయితే మిస్‌ కమ్యూనికేషన్‌ కారణంగానే ఇదంతా జరిగిందని నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు 'క్రాక్' పై కాపీ ఆరోపణలు వచ్చాయి. మరి దీనిపై దర్శకుడు గోపీచంద్ మలినేని - నిర్మాత ఠాగూర్ మధు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.