Begin typing your search above and press return to search.

బాలయ్యతో బాబీ..?

By:  Tupaki Desk   |   29 Sep 2022 12:30 AM GMT
బాలయ్యతో బాబీ..?
X
'అఖండ' చిత్రంతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు లైన్ లో పెడుతూ దూకుడుగా వెళ్తున్నారు. ఒక సినిమా చివరి దశకు వచ్చిన వెంటనే మరో చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకొచ్చేలా ప్లాన్స్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా మరో ప్రాజెక్ట్ కు సీనియర్ హీరో కమిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది.

బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నారు. ఇందులో నటసింహం పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. క్రిస్మస్ లేదా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

గోపీచంద్ మలినేని సినిమా పూర్తయిన వెంటనే NBK108 సినిమా కోసం రంగంలోకి దిగనున్నారు బాలకృష్ణ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తైనట్లు సమాచారం. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది.

అయితే దీని తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో బాలకృష్ణ ఓ సినిమా చేసేందుకు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. బాబీ (కె.ఎస్.రవీంద్ర) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని.. స్క్రిప్ట్ నచ్చడంతో బాలయ్య సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది.

బాబీ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో కలిసి 'వాల్తేరు వీరయ్య' అనే కమర్షియల్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందే ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

ప్రస్తుతం వైజాగ్ లో 'మెగా154' సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత బాలయ్య సినిమాపై బాబీ దృష్టి సారించనున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ తదుపరి సినిమా ఉండొచ్చని ఈ మధ్య ఊహాగానాలు వినిపించాయి. పైసా వసూల్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుందని చెప్పుకున్నారు.

కానీ ఇప్పుడేమో గోపీచంద్ మలినేని - అనిల్ రావిపూడి తర్వాత డైరెక్టర్ బాబీ ని బాలయ్య లైన్ లో పెట్టారని రూమర్స్ వస్తున్నాయి. సూర్యదేవర నాగవంశీ ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తారని అంటున్నారు. మరి ఇదే నిజమైతే త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందేమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.