Begin typing your search above and press return to search.

వీడియో: ప్రభాస్ - అమితాబ్ చేతుల మీదుగా ప్రముఖ నిర్మాణ సంస్థ కొత్త ఆఫీస్ ప్రారంభం..!

By:  Tupaki Desk   |   29 Jun 2022 2:36 PM GMT
వీడియో: ప్రభాస్ - అమితాబ్ చేతుల మీదుగా ప్రముఖ నిర్మాణ సంస్థ కొత్త ఆఫీస్ ప్రారంభం..!
X
టాలీవుడ్ లోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థల్లో 'వైజయంతీ మూవీస్' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నందమూరి తారక రామారావు నటించిన 'ఎదురులేని మనిషి' సినిమాతో మొదలైన ఈ సంస్థ.. అగ్ర నిర్మాత చలసాని అశ్వినీద‌త్ సారథ్యంలో గత ఐదు దశాబ్దాలుగా సుధీర్ఘంగా సాగుతోంది. ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఈ ప్రొడ్యూసర్ హౌస్.. ప్రతీ జనరేషన్‌ హీరోలతో బ్లాక్ బస్టర్లు తీస్తూ వస్తోంది.

ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతోన్న ఎందరో సినీ వారసులు ఈ బ్యానర్ లోనే హీరోలుగా పరిచయమయ్యారు. ప్రస్తుతం ఈ సంస్థ బాధ్యతలు అశ్వినీ దత్ కుమార్తెలు స్వప్న - ప్రియాంక మరియు అల్లుడు నాగ్ అశ్విన్ చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు వైజయంతీ మూవీస్ లో ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రానికి ఈ సంస్థ శ్రీకారం చుట్టారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్​ లోని గచ్చిబౌలిలో కొత్త ఆఫీస్ ను కూడా ఏర్పాటు చేశారు. వైజయంతీ మూవీస్​ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవం జూన్ 25వ తేదీన ఘనంగా జరిగింది. లెజండరీ నటుడు, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మరియు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ఈ ఆఫీస్ ను ఓపెన్ చేయడం విశేషం. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

వైజయంతీ మూవీస్ తాజాగా తమ కొత్త ఆఫీస్ ఓపెనింగ్ కు సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ - బిగ్​ బీ అమితాబ్ తో పాటుగా హీరోలు నాని - దుల్కర్ సల్మాన్ హాజరై సందడి చేశారు. వీరితో పాటుగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు - సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ - 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ - క్రిష్ జాగర్లమూడి - ఆది శేషగిరిరావు కూడా ఉన్నారు.

అశ్వినీ దత్ - స్వప్న - ప్రియాంకలు అమితాబ్ కు సాదరంగా ఆహ్వానం పలకడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. అలానే ప్రభాస్ - రాఘవేంద్రరావు - క్రిష్ - ఆది శేషగిరిరావులు బాలీవుడ్ సీనియర్ నటుడిని శాలువాలతో సత్కరించారు. ప్రముఖ నటులు దర్శక నిర్మాతలు అందరూ ఒకే చోట దర్శనమివ్వడంతో ఈ వీడియో కనుల పండుగలా ఉంది. దాదాపు వీరంతా అశ్వినీ దత్ బ్యానర్ లో వర్క్ చేసినవారు.. చేస్తున్నవారు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

ఇక సినిమాల విషయానికొస్తే.. వైజయంతీ మూవీస్ బ్యానర్​ లో ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ''ప్రాజెక్ట్ K'' అనే పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ - దీపికా పదుకొణె - దిశా పటాని ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఇదే నిర్మాణ సంస్థలో దుల్కర్​ సల్మాన్ హీరోగా 'సీతారామం' అనే పాన్ సౌత్ ఇండియా మూవీ చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ - రష్మిక మందన్నా - సుమంత్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇక వైజయంతీ మూవీస్ కు అనుబంధ సంస్థగా స్వప్న సినిమాస్ బ్యానర్ పై పలు చిన్న మీడియం రేంజ్ చిత్రాలని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.