Begin typing your search above and press return to search.

అదిరింది ఎగిరిపోయిందని వివాదాల బాట పట్టారా?

By:  Tupaki Desk   |   29 May 2020 11:30 AM GMT
అదిరింది ఎగిరిపోయిందని వివాదాల బాట పట్టారా?
X
సినీ పరిశ్రమకు చెందిన కొందరు ముఖ్యులు తెలంగాణా ముఖ్యమత్రిని కలవడం.. అందుకు తనను ఆహ్వానించకపోవడంపై నందమూరి బాలకృష్ణ తన అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నన్నెవరు పిలవలేదు అంటూ బాలయ్య ఫైర్ అయ్యారు. ఈ విషయంపై కేసీఆర్ ను కలిసిన బృందంలో ఉన్న చిరంజీవి.. రాజమౌళి.. నాగార్జున లాంటి వారు ఎవరూ ఇంతవరకూ స్పందించలేదు. అయితే చిరంజీవి సోదరుడు నాగబాబు కొంచెం ఘాటుగానే బదులిచ్చారు. దీంతో ఈ ఎపిసోడ్ లో బాలయ్య తర్వాత నాగబాబే హైలైట్ అయ్యారు.

ఈ విషయంపై సోషల్ మీడియాలో ఇప్పటికే భారీగా చర్చలు సాగుతున్నాయి. ఒకవైపు బాలయ్య వ్యతిరేకులు ఆయన అలా చిరంజీవి బృందంపై ఘాటుగా మాట్లాడి ఉండాల్సింది కాదని.. నన్ను పిలవలేదు అని చెప్పి ఊరుకుంటే సరిపోయేదని అంటున్నారు. నందమూరి అభిమానులు అయితే ఈ విషయంలో నాగబాబుపై విరుచుకుపడుతున్నారు. అసలు నాగబాబు గురించి బాలయ్య ఏం మాట్లాడలేదని అలాంటప్పుడు నాగబాబు దీన్ని పెద్ద వివాదం చేస్తున్నారని అంటున్నారు. అక్కడ ఏమీ జరగనిదానికి ఇలా హంగామా చేయడం అవసరం లేదని అంటున్నారు.

జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన తర్వాత 'అదిరింది' కార్యక్రమంపైన నమ్మకం పెట్టుకుంటే అదికాస్తా నిరాశపరిచిందని.. అటు జబర్దస్త్ పోయింది ఇటు అదిరింది విజయం సాధించలేదు.. దీంతో చేసేదేమీ లేక ఇలాంటి యూట్యూబ్ వీడియోలు కాంట్రవర్సీల మీద పడ్డారని విమర్శిస్తున్నారు. మొన్నేమో గాడ్సే పై తన అభిప్రాయం చెప్పి హాట్ టాపిక్ అయ్యారని.. తర్వాత కరెన్సీ నోట్లపై వేరే నాయకులు ఎందుకు ఉండకూడదు అంటూ మరో వివాదం తలకెత్తుకున్నారని అన్నారు. వాటి ప్రభావం ఇటు చిరంజీవి అటు పవన్ కళ్యాణ్ -జనసేన పై పడడంతో వారు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చిందని అంటున్నారు.

ఇప్పుడు కూడా బాలయ్య కామెంట్ల పైన చిరు బృందం స్పందిస్తే బాగుండేది కానీ ఇందులో కి నాగబాబు తలదూర్చాల్సిన అవసరమేంటని ప్రశ్నిస్తున్నారు. ఏదో ఒక రకంగా ఈ ఇష్యూ ను నాగబాబు పెద్దది చేస్తున్నారని అంటున్నారు. బాలయ్యకు చిరంజీవికి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి కానీ నాగబాబు లాంటివారితో అవి చెడిపోయేలా ఉన్నాయని అంటున్నారు. అదిరింది అటూ ఇటూ అయిందని ఈ వివాదాల బాట పట్టడం సరికాదని.. ఈ విషయం అందరూ గ్రహించాలని నందమూరి అభిమానులు కోరుతున్నారు.