Begin typing your search above and press return to search.

నాలుగేళ్ల‌లోనే అల్లు బ్రాండ్ అమాంతం స్కైలోకి

By:  Tupaki Desk   |   22 March 2023 10:05 AM GMT
నాలుగేళ్ల‌లోనే అల్లు బ్రాండ్ అమాంతం స్కైలోకి
X
కార్పొరెట్ ఉత్ప‌త్తుల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ ని ఎంపిక చేసుకోవాలంటే బాలీవుడ్ స్టార్ల‌ను ఆశ్ర‌యించాల్సి వ‌చ్చేది. తొలి ప్రాధాన్య‌త ఉత్త‌రాది సెల‌బ్రిటీలే. కానీ ఇటీవ‌ల ఆ సీన్ మారింది. బాలీవుడ్ గ్రాఫ్ కొన్నేళ్లుగా అంత‌కంత‌కు కిందికి ప‌డిపోతుండ‌డం అదే స‌మ‌యంలో టాలీవుడ్ స‌హా ఇత‌ర ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌ల గ్రాఫ్ పెరుగుతుండ‌డంతో కార్పొరెట్లు ఇటువైపు చూడ‌టం ప్రారంభించాయి. దీనికి తోడు బాలీవుడ్ స్టార్ల‌కు ధీటుగా సోషల్ మీడియాలు డిజిట‌ల్ లో అసాధార‌ణంగా ఫాలోయింగ్ పెంచుకుంటున్న సౌత్ స్టార్ల బ్రాండ్ వ్యాల్యూ అమాంతం పెరుగుతోంద‌ని తాజా స‌ర్వే వెల్ల‌డిస్తోంది.

ప్ర‌స్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రాండ్ వ్యాల్యూ ఈ నాలుగేళ్ల‌లో గ‌రిష్ఠ స్థాయికి చేరుకుంది. అత‌డికి డిజిట‌ల్ ఫాలోయింగ్ అసాధార‌ణంగా ఉంద‌ని తాజా స‌ర్వే వెల్ల‌డిస్తోంది. అయితే దీనిని మరింత మెరుగు ప‌రుచుకునేందుకు అల్లూకి అవ‌కాశం ఉంది. నిజానికి స్పోర్ట్స్ స్టార్స్ కి ధీటుగా సినీస్టార్స్ బ్రాండ్స్ ని ఏల్తున్నారు. ఇక‌పై టాలీవుడ్ స్టార్లు అల్లు అర్జున్.. రామ్ చ‌ర‌ణ్‌.. మ‌హేష్.. ఎన్టీఆర్ బ్రాండ్స్ పై దృష్టి సారిస్తే మ‌రింత‌గా దూసుకెళ్లే ఛాన్సుంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. నిజానికి పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ బ్రాండ్ ప్ర‌మోష‌న్స్ కి అనుకూలంగా మారితే అత‌డి హ‌వా కూడా కొన‌సాగే వీలుంద‌ని అంచ‌నా.

క్రోల్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ 2022 ప్రకారం.. సౌత్ స్టార్లు అల్లు అర్జున్- రష్మిక మందన్న బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగింది. ఆ ఇద్ద‌రూ బాలీవుడ్ ఆధిపత్యాన్ని సవాల్ చేయడంలో ముందున్నారు. గత ఐదేళ్లలో బాలీవుడేతర సెలబ్రిటీల బ్రాండ్ విలువ రెట్టింపు అయ్యిందని తాజా స‌ర్వే వెల్ల‌డించింది. ఎంటర్ టైన్ మెంట్ విభాగంలో అల్లు అర్జున్ CNN-న్యూస్‌18 ఇండియ‌న్ ఆఫ్ ది ఇయ‌ర్ 2022 అవార్డును గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే.

పుష్ప చిత్రంలో పుష్ప‌రాజ్ గా అత‌డి న‌ట‌న‌కు ఉత్త‌రాది జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. దీంతో అత‌డి గ్రాఫ్ అమాంతం పెరిగింది. దక్షిణ భారత నటులు అల్లు అర్జున్ - రష్మిక మందన్న భారతదేశంలోని టాప్ 25 అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో చేరారు. ఈ స‌ర్వే ప్ర‌కారం... ఆ ఇద్ద‌రు టాప్ స్టార్స్ మొత్తం బ్రాండ్ విలువ పెర‌గ‌డానికి కార్పొరెట్ల నుంచి సహకారం పెరిగింది. క్రోల్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ 2022 ప్ర‌కారం.. అల్లు అర్జున్ $31.4 మిలియన్ల బ్రాండ్ విలువతో 20వ స్థానంలో ఉండగా.. రష్మిక మందన్న $25.3 మిలియన్ల బ్రాండ్ విలువతో 25వ స్థానంలో ఉన్నారు.

2022లో అల్లు అర్జున్ కు పది బ్రాండ్లు ఉన్నప్పటికీ బాలీవుడ్ స్టార్ల రేంజులో ప్యాకేజీలను అతను ఇంకా అందుకోవ‌డం లేద‌ని క్రోల్ లోని వాల్యుయేషన్ అడ్వైజరీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ అవిరాల్ జైన్ పేర్కొన్నారు. మరోవైపు.. రష్మిక మందన్న 20 బ్రాండ్ లతో పెద్ద పోర్ట్ ఫోలియోను సంపాదించింది.

అయితే ఆమె ఎండార్స్‌మెంట్ ఫీజు అభివృద్ధి చెందుతున్న బాలీవుడ్ సెలబ్రిటీతో పోల్చవచ్చు అని జైన్ చెప్పారు. గత ఐదేళ్లలో నాన్-బాలీవుడ్ సెలబ్రిటీల బ్రాండ్ విలువ రెండింతలు పెరిగిందని మొత్తం బ్రాండ్ విలువలో బాలీవుడ్ తారల వాటా 2016లో 81.7 శాతం నుంచి 2022లో 67.6 శాతానికి పడిపోయిందని జైన్ ఎత్తిచూపారు. అదే సమయంలో క్రీడాకారుల‌ వాటా 18.3 శాతం (2016 డేటా) నుండి 28.9 (నేడు) శాతానికి పెరిగింది.

2022 బ్రాండ్ విలువలో 3.5 శాతం టాలీవుడ్ స్టార్‌ లకు ఉంది. అయితే ఈ షేర్ 2016లో లేదు. కోవిడ్-19 ప్రభావిత సంవత్సరాల్లో బాలీవుడ్ కంటెంట్ గణనీయంగా తగ్గింది. స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ లలో హిందీయేతర కంటెంట్ స‌గ‌భాగం ఆక్ర‌మించింది. 2022లో టాప్ టెన్ సినిమాల్లో ఆరు దక్షిణ భారతదేశానికి చెందినవే. బాలీవుడ్ నాలుగు చిత్రాల(160మిలియ‌న్ డాల‌ర్లు)తో పోలిస్తే ద‌క్షిణాది ఆరు సినిమాలు $500 మిలియన్లు ఆర్జించాయి.

దక్షిణ భారత చిత్రాలకు వర్సెస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల పరంగా మూడు రెట్లు అధిక‌ రాబడి ఈ సీజ‌న్ లో ద‌క్కింది. అడ్వర్టైజర్లు ఈ ట్రెండ్ లను ఫాలో అవుతున్నారు. ఫలితంగా మొత్తం బ్రాండ్ విలువలో సౌత్ ఇండియన్ సెలబ్రిటీల వాటా పెరిగింది.

మునుముందు మొత్తం బ్రాండ్ విలువలో సౌత్ ఇండియన్ సెలబ్రిటీల వాటా మరింత పెరుగుతుందని జైన్ అంచనా వేస్తున్నారు. A-జాబితా బ్రాండ్ లు సాంప్రదాయ సెలబ్రిటీల కంటే .. ప్రాంతీయ సూపర్ స్టార్ లతో స్నేహాన్ని కొన‌సాగించాల‌ని భావిస్తున్నాయి. బహుళ సెలబ్రిటీ ప్ర‌చార స్ట్రాట‌జీతో కొన‌సాగాల‌ని ఆశిస్తున్నాయి. దక్షిణ భారత మార్కెట్ ను ప్రధానంగా లక్ష్యంగా చేసుకునే బ్రాండ్ లు దక్షిణ భారత స్టార్ లతో కలిసి పని చేస్తున్నాయి. తత్ఫలితంగా మరింత మంది దక్షిణ భారత సెల‌బ్రిటీలు పాన్-ఇండియా వేదికపైకి రావాలని భావిస్తున్నారు. టాలీవుడ్ లో అజేయ‌మైన విజ‌యాల‌తో అల్లు అర్జున్ ఇతర ప్రముఖులతో పోటీప‌డి పాపుల‌ర్ బ్రాండ్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు.

రెడ్ బస్- కోకా కోలా - జొమాటో- KFC వంటి బ్రాండ్‌లను స్వతంత్ర ప్రాతిపదికన ప్ర‌చారం చేస్తున్నాడు. అదేవిధంగా.. రష్మిక మందన్న వ్యక్తిగతంగా వేక్ ఫిట్ .. బోట్- సిటీ బ్యాంక్- మెక్ డొనాల్డ్ లను ఇతర స్టార్ లతో క‌లిసి ప్ర‌చారం చేస్తున్నారు. కోకా కోలా-లైషియస్- మామాఎర్త్- ఫోన్ పే- రెడ్ బస్ - జొమాటో వంటి జాతీయ బ్రాండ్ లు.. బాలీవుడ్ ప్రత్యర్ధుల బాక్సాఫీస్ ఆకర్షణ తగ్గుముఖం పట్టడం వల్ల దక్షిణ భారత స్టార్ లను అదనపు ఎండార్స‌ర్లుగా నియమించుకున్నాయి. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ కి పెరుగుతున్న సోషల్ మీడియా ఫాలోయింగ్ వారి బ్రాండ్ విలువను పెంచడానికి సహాయపడుతుందని ఈ నివేదిక పేర్కొంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.