Begin typing your search above and press return to search.

ఎందరికో రోల్ మోడల్...ఈ మోడల్ కం ఐఏఎస్

By:  Tupaki Desk   |   6 Aug 2020 5:31 PM GMT
ఎందరికో రోల్ మోడల్...ఈ మోడల్ కం ఐఏఎస్
X
సాధారణంగా తమ పిల్లలు ఏం చదవాలి...ఏ రంగంలో స్థిరపడాలి అన్న విషయంలో తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటుంటారు. పిల్లలు పుట్టిన తర్వాత అందుకు తగ్గట్లు ప్రణాళికలు రూపొందించుకుంటారు. తమ కలలను సాకారం చేసుకునేలా పిల్లలను చదివించి...వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తుంటారు. అయితే, కొందరు పిల్లలు తమ కన్నవారి కలలు కాకుండా తమ కెరీర్ గురించి సొంతగా కలలు కంటారు. ఇటువంటి సందర్భంలో కేవలం ఏ ఒక్కరి కలో సాకారం అయ్యేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. అయితే, ఇటు తల్లిదండ్రుల కలతోపాటు తన కలను సాకారం చేసుకొని సత్తా చాటింది ఢిల్లీకి చెందిన ఓ యువతి. తన తల్లి కలను నెరవేరుస్తూ మోడలింగ్ లో రాణిస్తూనే...ఐఏఎస్ కావాలన్న తన కలనూ నెరవేర్చుకుంది రాజస్థానీ అమ్మాయి ఐశ్వర్యా శోరాన్. ప్రముఖ మోడల్ గా రాణిస్తూ, మిస్ ఇండియా 2016లో టాప్ -21లో నిలిచిన ఐశ్వర్యా శోరాన్...తాజాగా వెలువడిన సివిల్స్ ఫలితాల్లో 93వ ర్యాంక్ తో సత్తా చాటారు.


కరీంనగర్‌లో తెలంగాణ ఎన్‌సీసీ బెటాలియన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌గా పని చేస్తోన్న కల్నల్‌ అజయ్‌ కుమార్‌ గారాల పట్టి ఐశ్వర్యా శోరాన్‌. రాజస్థానీ కుటుంబ నేపథ్యం ఉన్న ఐశ్వర్యా శోరాన్....పుట్టక ముందే మోడల్ అయింది. ఐశ్వర్య తల్లికి నటి ఐశ్వర్యా రాయ్ అటే పిచ్చ అభిమానం. దీంతో, తనకు కూతురు పుడితే ఐశ్వర్యా రాయ లాగే ప్రపంచ స్థాయి మోడల్ కావాలని, మిస్ ఇండియా కావాలని ఆమె కలలు కనేవారు. అందుకే ఐశ్వర్యా రాయ్ పేరు కలిసి వచ్చేలా ఐశ్వర్యా శోరాన్ అని పేరు పెట్టారు. అందుకే, ఓ వైపు చదువు కొనసాగిస్తూనే మోడలింగ్‌పై కూడా ఐశ్వర్య దృష్టి పెట్టేలా చేశారు ఆమె తల్లి. అయితే, చిన్నప్పటి నుంచి ఐశ్వర్యకు ఐఏఎస్ కావాలని లక్ష్యం. అందుకే, ఇటు తల్లి కోరిక నెరవేర్చాలని మోడలింగ్ చేస్తూనే...చదువులోనూ ఐశ్వర్యా శోరాన్ రాణిస్తూ వచ్చారు.

‘ఆరడుగుల’ రూపం... నలుగురిలో కలిసిపోయే తత్వం... అన్నింటికీ మించి విజ్ఞానం... ఐశ్వర్యను ప్రత్యేకంగా నిలిపాయి. ఓ వైపు చదువుకుంటూనే...మోడలింగ్‌ చేస్తూ బ్యూటీ కాంపిటీషన్స్‌లో పాల్గొంటూ వచ్చారు ఐశ్వర్య. 2014లో ‘ఢిల్లీ టైమ్స్‌ ఫ్రెష్‌ ఫేస్‌’ టైటిల్‌ , ‘మిస్‌ క్లీన్‌ అండ్‌ క్లియర్‌ ఢిల్లీ’ టైటిల్‌, 2015లో ‘మిస్‌ క్యాంపస్‌ ప్రిన్సెస్‌ ఢిల్లీ’ టైటిల్‌ దక్కించుకున్నారు. ఇక, 2016లో పంథొమ్మిదేళ్ల ఐశ్వర్యా శోరాన్ తన తల్లి కల నెరవేర్చేందుక ప్రయత్నించారు. 2016 ‘మిస్‌ ఇండియా’ అందాల పోటీల్లో పాల్గొన్న ఐశ్వర్యా శోరాన్ టాప్-21లో నిలిచారు. 2017 ‘లాక్మే ఫ్యాషన్‌ వీక్‌’లో ర్యాంప్‌ వాక్‌ చేసి సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా అభినందనలు అందుకున్నారు. ‘మిస్‌ ఇండియా’ పోటీల తరువాత మనీష్‌ మల్హోత్రా వంటి ప్రముఖ డిజైనర్లు, మ్యాగజైన్ల కోసం మోడలింగ్‌ చేస్తున్నప్పుడు...‘సివిల్స్‌ సాధించాలన్న కలను సాకారం చేసుకోవాలనుకున్నారు ఐశ్వర్యా శోరాన్.

ఒక్కసారిగా మోడలింగ్ నుంచి సివిల్స్ ప్రిపరేషన్ వైపు అడుగులు వేశారు. మొబైల్‌ ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసిన ఐశ్వర్య.... సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్నారు. స్నేహితులు, కాలక్షేపాలు..సినిమాలు...మోడలింగ్....వంటి వాటికి గుడ్ బై చెప్పారు. సివిల్స్ ప్రిపరేషన్ పైనే ఫోకస్ పెట్టి...చదివారు. ఇంటర్‌లో సైన్స్‌ చదివి ఆ తరువాత డిగ్రీలో కామర్స్‌ గ్రూప్‌కి మారడం సివిల్స్‌ సన్నాహాలకు కలిసివచ్చాయి. పట్టుదలతో ప్రిపేర్ అయిన ఐశ్వర్య...సివిల్స్ లో 93వ ర్యాంకు సాధించి సత్తా చాటారు.నాన్న కల్నల్‌ కాబట్టి... ఆయనలా ఆర్మీలోకి వెళదామని కొన్నిసార్లు అనుకున్నానని ఐశ్వర్యా శోరాన్ అన్నారు. అయితే, మహిళలు ఎదగడానికి సైన్యంలో పరిమిత అవకాశాలుండడంతో సివిల్‌ సర్వీసెస్‌ వైపు మొగ్గు చూపానని అంటున్నారు ఐశ్వర్యా శోరాన్. ఏది ఏమైనా దేశానికి సేవ చేయాలన్నదే తన లక్ష్యమని అంటున్నారీ యువ మోడల్. ఇటు చదువులోనూ అటు మోడలింగ్ లోనూ రాణించిన ఐశ్వర్యా శోరాన్ ఎందరో యువతీయువకులకు రోల్ మోడల్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.