Begin typing your search above and press return to search.

అల వైకుంఠపురం.. రాజధానిలో!

By:  Tupaki Desk   |   27 Nov 2021 9:38 AM GMT
అల వైకుంఠపురం.. రాజధానిలో!
X
సౌత్‌లో ఓ సినిమా హిట్టయ్యిందంటే అది నార్త్‌లో రీమేక్ అయ్యి తీరాల్సిందే అన్నట్టుంది పరిస్థితి. ముఖ్యంగా తెలుగులో సక్సెస్ అయిన ఏ సినిమానీ వదలట్లేదు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్. మరి రికార్డులు బద్దలుకొట్టిన ‘అల వైకుంఠపురములో’ని మాత్రం ఎలా వదులుతారు? అందుకే అక్కడ ఈ మూవీ రీమేక్ ఎప్పుడో మొదలైపోయింది.జోరుగా షూటింగ్ కూడా సాగిపోతోంది.

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్‌ తెరకెక్కించిన ఈ సూపర్‌‌ డూపర్ హిట్‌ని ‘షెహ్‌జాదా’ పేరుతో హిందీలో తీస్తున్నాడు రోహిత్ ధావన్‌. అమన్ గిల్, ఎస్‌.రాధాకృష్ణతో కలిసి అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ హీరో. కృతీసనన్ హీరోయిన్. టబు పాత్రలో మనీషా కొయిరాలా, జయరామ్ పాత్రలో రోనిత్‌ రాయ్, మురళీ శర్మ పాత్రలో పరేష్ రావెల్‌ నటిస్తున్నారు.

రీసెంట్‌గా దేశ రాజధాని ఢిల్లీలో కొత్త షెడ్యూల్‌ మొదలైంది. దాదాపు సినిమా అంతా అక్కడే జరుగుతుందట. ఈ మూవీ చాలావరకు వైకుంఠపురం అనే ఇంటిలోనే ఉంటుంది. ఆ సెటప్‌ మొత్తాన్నీ ఢిల్లీలోనే ప్లాన్ చేసిందట ‘షెహజాదా’ టీమ్‌. అందుకే కొన్నాళ్లపాటు కంటిన్యుయస్‌గా అక్కడే షూట్ చేయబోతున్నట్టు చెప్పారు. హీరో కార్తీక్ ఆర్యన్ తెల్లని కుర్తాలో ఉన్న ఫొటోస్ కూడా లీకయ్యాయి.

అల వైకుంఠపురములో స్టోరీ, స్క్రీన్‌ ప్లే ఎంత బలంగా ఉంటాయో.. పాటలు, బన్నీ డ్యాన్స్‌ కూడా సినిమాకి అంతే ప్లస్ అయ్యాయి. మరి బన్నీ స్థాయిలో కార్తీక్ ఆర్యన్ న్యాయం చేయగలడా అనే డౌట్‌ కొందరిలో ఉంది. నిజానికి బాలీవుడ్‌ వారికి డ్యాన్సులు పెద్ద ఇంపార్టెంట్ కాదు. అవసరమైతే తప్ప వాటిపై ఎక్కువ దృష్టి కూడా పెట్టరు. అందుకే వాళ్ల సినిమాల్లో మాంటేజ్ సాంగ్సే ఎక్కువ కనిపిస్తుంటాయి. మరి ఈ మూవీ విషయంలో కూడా అదే జరుగుతుందో లేక బన్నీని ఫాలో అవ్వడానికి కార్తీక్ ట్రై చేస్తాడో చూడాలి.