Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో 2018 కల్లోలం

By:  Tupaki Desk   |   29 May 2023 11:59 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో 2018 కల్లోలం
X
2018వ సంవత్సరంలో కేరళ రాష్ట్రాన్ని భారీ వరదలు అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడేమో ఆ రాష్ట్రంలో నాలుగు వారాలుగా '2018' మూవీ కల్లోలం కనిపిస్తోంది. అప్పటి వరదల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా మలయళ ఇండస్ట్రీని కలెక్షన్ల సునామీతో ఓ కుదుపు కుదిపేసింది. దీనివల్ల ఆ పరిశ్రమలో ఉన్న ఎన్నో రికార్డులు ఒక్కసారిగా కొట్టుకుపోయాయి.

టివినో థామస్ ప్రధాన పాత్రలో జూడే ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించిన చిత్రమే '2018'. కేవలం రూ. 15 కోట్లు బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కేరళలో కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. ఫలితంగా మే 5 నుంచి ఈ సినిమా హవాను చూపిస్తూ వచ్చి.. ఏకంగా రూ. 160 కోట్లు గ్రాస్‌ను, రూ. 80 కోట్లు షేర్‌ను వసూలు చేసింది. తద్వారా మలయాళంలో టాప్ మూవీగా నిలిచింది.

మలయాళంలో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న '2018' మూవీని గీతా ఆర్ట్స్ సంస్థ తెలుగులో రిలీజ్ చేసింది. మన దగ్గర కూడా ఈ సినిమాకు పాజిటివ్ టాకే వచ్చింది. దీంతో మొదటి రోజే ఇది మంచి స్పందనను సొంతం చేసుకుని కోటి రూపాయలకు పైగానే గ్రాస్‌ను రాబట్టింది. ఇక, రెండు, మూడు రోజులు హాలీడేస్ కావడంతో ఈ చిత్రానికి రెస్పాన్స్ మరింతగా పెరిగింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొదటి రోజే రూ. 1.01 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసిన '2018' మూవీ.. రెండో రోజు నుంచి భారీగా పుంజుకుంది. ఫలితంగా శనివారం రూ. 1.73 కోట్లు గ్రాస్, ఆదివారం రూ. 1.74 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఇలా ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ. 4.48 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 2.00 కోట్లుకు పైగా షేర్‌ను కూడా వసూలు చేసుకుంది.

యూనివర్శల్ కాన్సెప్టుతో రూపొందిన '2018' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.80 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2 కోట్లుగా నమోదు అయింది. ఇక, ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ. 2 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టింది. ఫలితంగా ఇది క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. ఇదే ఊపు కొనసాగితే ఈ చిత్రం మరింత లాభాలను అందుకుంటుంది.