Begin typing your search above and press return to search.

బాధ్యత లేనప్పుడు పెళ్ళెందుకు?.. హైకోర్టు చురకలు.. భరణంపై కీలక తీర్పు!

వివాహ వ్యవస్థలో బాధ్యత, నైతికత ప్రాధాన్యతను గుర్తు చేస్తూ అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

By:  Tupaki Political Desk   |   21 April 2026 1:15 PM IST
బాధ్యత లేనప్పుడు పెళ్ళెందుకు?.. హైకోర్టు చురకలు.. భరణంపై కీలక తీర్పు!
X

వివాహ వ్యవస్థలో బాధ్యత, నైతికత ప్రాధాన్యతను గుర్తు చేస్తూ అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ‘పెళ్లి అనేది కేవలం ఒక వేడుక కాదు, అది జీవితాంతం కొనసాగే ఒక సామాజిక మరియు ఆర్థిక బాధ్యత’ అని పేర్కొంది. భారతీయ సమాజంలో వివాహం అనేది ఒక పవిత్ర బంధం. అయితే, మనస్పర్థల వల్ల ఈ బంధం విడిపోయినప్పుడు, భార్య, పిల్లల పోషణ భారంగా భావించే భర్తలకు అలహాబాద్ హైకోర్టు గట్టి హెచ్చరిక జారీ చేసింది. ‘భార్యా పిల్లలను పోషించే స్తోమత లేదని భావించే వారు అసలు వివాహం చేసుకోకపోవడమే మంచిది’ అని జస్టిస్ రేణు అగర్వాల్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆర్థిక కారణాలను సాకుగా చూపి కుటుంబ బాధ్యతల నుంచి తప్పించుకోవడం చట్టరీత్యా చెల్లదని కోర్టు స్పష్టం చేసింది.

ఫ్యామిలీ కోర్టు తీర్పుపై సవాల్

ఈ వివాదం ఒక సాధారణ భరణం కేసు నుండి మొదలైంది. తన ఆర్థిక స్థితి బాగోలేదని, తనకు తగినంత ఆదాయం లేదని, కాబట్టి తన భార్యకు ఫ్యామిలీ కోర్టు విధించిన భరణాన్ని చెల్లించలేనని ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. భర్త ఆరోగ్యవంతుడై ఉండి, శారీరక శ్రమ చేయగల సామర్థ్యం ఉంటే.. కనీస కూలీ పనులు చేసైనా తన భార్యను పోషించాల్సిన బాధ్యత అతనిపై ఉందని కోర్టు తేల్చి చెప్పింది.

ఈ తీర్పు సందర్భంగా ధర్మాసనం సమాజానికి కొన్ని మౌలిక ప్రశ్నలను సంధించింది. ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడంటే, ఆ కుటుంబానికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చడం అతని ప్రాథమిక విధి. ఆదాయం లేదని చెప్పి భార్యను గాలికి వదిలేయడం చట్ట విరుద్ధం. భార్య తనపై ఆధారపడి ఉన్నప్పుడు, ఆమెకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం భర్త బాధ్యత. చట్టం ప్రకారం, భార్య తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉంటే భర్త ఖచ్చితంగా భరణం చెల్లించాలి. ఒకవేళ భవిష్యత్తులో వచ్చే బాధ్యతలను మోయలేమని ముందే తెలిస్తే, అసలు ఆ బంధంలోకి ప్రవేశించకుండా ఉండడమే అందరికీ మంచిదని కోర్టు అభిప్రాయపడింది.

చట్టం ఏం చెబుతోంది?

భారతీయ చట్టాల ప్రకారం, భర్త సంపాదన ఎంత ఉన్నా.. భార్య జీవన ప్రమాణాలకు తగ్గట్టుగా భరణం ఇవ్వాలి. భర్త నిరుద్యోగి అయినప్పటికీ, అతను పని చేయగల సామర్థ్యం కలిగి ఉంటే, కోర్టు అతనిని భరణం చెల్లించమని ఆదేశించవచ్చు. అతను యాచకుడైనా సరే, తన భార్యకు చట్టపరమైన రక్షణ కల్పించాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు కూడా పేర్కొంది.

తండ్రి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా పిల్లల చదువు ఆరోగ్యం, పోషణ బాధ్యత తండ్రిదే. హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు పురుషులను కించపరచడానికి కాదు, బాధ్యతను గుర్తు చేయడానికి అని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ రోజుల్లో చిన్న చిన్న కారణాలకే విడిపోతున్న జంటలు, ఆ తర్వాత కోర్టుల చుట్టూ తిరుగుతూ బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. భర్తపై ఆధారపడిన మహిళలకు ఈ తీర్పు ఒక పెద్ద భరోసా ఇస్తుంది. ఆర్థికంగా స్వతంత్రులు కాని మహిళలు విడాకుల తర్వాత రోడ్డున పడకుండా చట్టం అండగా ఉంటుందని ఇది నిరూపిస్తోంది.

అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు వివాహ వ్యవస్థలో బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నిస్తోంది. పెళ్లి అనేది కేవలం వ్యక్తిగత ఇష్టం మాత్రమే కాదు, అది ఒక చట్టపరమైన, సామాజిక ఒప్పందం. ఈ తీర్పు ద్వారా కోర్టు ఒక స్పష్టమైన సందేశాన్ని పంపింది ‘బాధ్యతను స్వీకరించే ధైర్యం ఉన్నప్పుడే బంధాలను కలుపుకోవాలి’. లేదంటే, ఆ బంధం విచ్ఛిన్నమైనప్పుడు ఎదురయ్యే చట్టపరమైన పర్యవసానాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.