Begin typing your search above and press return to search.

ట్రాఫిక్‌ జామ్‌లో టోల్‌ వసూలుపై సుప్రీంకోర్టు ప్రశ్న

ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కున్నా టోల్‌ ఫీజు ఎందుకు వసూలు చేస్తున్నారని సుప్రీంకోర్టు ఎన్‌హెచ్‌ఏఐని ప్రశ్నించింది.

By:  Tupaki Desk   |   19 Aug 2025 3:15 PM IST
ట్రాఫిక్‌ జామ్‌లో టోల్‌ వసూలుపై సుప్రీంకోర్టు ప్రశ్న
X

ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కున్నా టోల్‌ ఫీజు ఎందుకు వసూలు చేస్తున్నారని సుప్రీంకోర్టు ఎన్‌హెచ్‌ఏఐని ప్రశ్నించింది. 65 కి.మీ ప్రయాణానికి 12 గంటలు పట్టినా రూ.150 వసూలు చేయడం సమంజసమా అని జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది.

ఇటీవల కేరళ హైకోర్టు కూడా ఇలాంటి తీర్పు ఇచ్చింది. త్రిస్సూర్ జిల్లా పలియెక్కర టోల్‌ ప్లాజా వద్ద రోడ్డు పనుల కారణంగా నెల రోజులపాటు టోల్‌ వసూలు చేయరాదని ఆదేశించింది. రోడ్డు పనులు సక్రమంగా జరగకపోవడం, ప్రమాదాలు జరగడం వంటి అంశాలు టోల్‌ వసూళ్లపై ప్రశ్నలు లేవనెత్తాయని సుప్రీంకోర్టు గమనించింది.

ఎన్‌హెచ్‌ఏఐ తరఫున సొలిసిటర్ జనరల్‌ తుషార్ మెహతా వాదిస్తూ, లారీ ప్రమాదం దైవఘటనగా పరిగణించాలన్నారు. అయితే జస్టిస్ వినోద్ చంద్రన్ దీనిని తిరస్కరించారు. రోడ్డుపై గుంతల కారణంగానే ప్రమాదం జరిగిందని, అదే ట్రాఫిక్‌కు కారణమని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో టోల్‌ వసూలు చేయడం ప్రజలకు అన్యాయం అవుతుందని వ్యాఖ్యానించారు.

ప్రజలు రోడ్డు నాణ్యత, వేగవంతమైన ప్రయాణం కోసం టోల్‌ చెల్లిస్తున్నారని, కానీ గుంతలు, పనులు, ట్రాఫిక్‌ జామ్‌లు ఉంటే ఆ వసూళ్లు సమంజసం కాదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో తుది తీర్పు రానున్నప్పటికీ, కోర్టు వ్యాఖ్యలు భవిష్యత్తులో టోల్‌ విధానాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.