Begin typing your search above and press return to search.

సుప్రీం సంచలన నిర్ణయం.. కులాల లెక్కలకు అడ్డుతొలగిపోయినట్లే...

జనగణనలో కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కులగణన మినహాయించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.

By:  Tupaki Gallery Desk   |   20 May 2026 4:25 PM IST
సుప్రీం సంచలన నిర్ణయం.. కులాల లెక్కలకు అడ్డుతొలగిపోయినట్లే...
X

జనగణనలో కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కులగణన మినహాయించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. విధానపరమైన నిర్ణయాల్లో కోర్టు జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది. సంక్షేమ పథకాల రూపకల్పనకు కులాల జనాభా కూడా కీలకమని అభిప్రాయపడింది. జనగణన సందర్భంగా కులగణనను దుర్వినియోగం చేసే వీలుందని దాఖలైన పిల్ పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలలో జోక్యం చేసుకోలేమని తేల్చిచెబుతూ పిల్ ను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

సుప్రీం తీర్పుతో త్వరలో జరగబోయే జనగణనలో కులాల సమాచారాన్ని సేకరించేందుకు లైన్ క్లియర్ అయిందని అంటున్నారు. జనగణనలో భాగంగా ప్రస్తుతం గృహ గణన జరుగుతోంది. ఇది పూర్తయిన తర్వాత అక్టోబరు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు జనాభా లెక్కల ప్రక్రియ కొనసాగుతుందని చెబుతున్నారు. రాష్ట్రాల వారీగా చేపట్టే ఈ ప్రక్రియను వచ్చే ఏడాది మార్చినాటి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. చివరిగా మన దేశంలో 2011లో జనగణన చేపట్టారు. 2021లో జనాభా లెక్కలు సేకరించాల్సివున్నప్పటికీ, కోవిడ్-19 కారణంగా చేయలేకపోయారు.

ఇక ప్రస్తుతం జనగణనకు సిద్ధమైన ప్రభుత్వం కులగణన చేయాలని నిర్ణయించిందని అంటున్నారు. మన దేశంలో స్వాతంత్ర్యం రాక ముందు జనాభా లెక్కలతోపాటు కుల గణన చేసేవారని చెబుతున్నారు. బ్రిటీష్ పాలనలో 1881 నుండి 1931 వరకు ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగిన జనాభా లెక్కల్లో కులాల వారీగా వివరాలను సేకరించేవారని అంటున్నారు. 1931లో జరిగిన జనాభా లెక్కలే దేశంలో చిట్టచివరి పూర్తిస్థాయి కుల గణనగా చెబుతున్నారు. 1941లో డేటా సేకరించినప్పటికీ, రెండో ప్రపంచ యుద్ధం కారణంగా దాన్ని ప్రచురించలేదు. దీంతో 1931 నాటి కుల గణన సమాచారమే అధికారికంగా ఉందని అంటున్నారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1951 నుండి కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల్లో కేవలం ఎస్సీ, ఎస్టీ వర్గాల గణాంకాలను మాత్రమే సేకరిస్తూ వస్తోందని చెబుతున్నారు. సమాజంలో కుల వ్యవస్థ మరింత బలీయం కాకూడదనే ఉద్దేశంతో ఇతర కులాల లెక్కింపును నిలిపివేసినట్లు అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో బీసీ రిజర్వేషన్ల పెంచాలని డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు కుల గణన జరపాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా దేశ సామాజిక సమగ్రతను దృష్టిలో ఉంచుకుని వేర్వేరు సర్వేల కంటే ప్రధాన జనాభా లెక్కల్లోనే కులగణన చేర్చడం సురక్షితమని భావించింది. అయితే కోర్టులో పిల్ దాఖలు అవడంతో కులగణనపై సందేహాలు మొదలయ్యాయి. తాజాగా సుప్రీం ఆ పిల్ ను కొట్టివేయడంతో కులగణనకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లైందని అంటున్నారు.