గంగలో శవాలను కలిపితే తప్పులేదు.. కానీ.. : కోర్టు కీలక వ్యాఖ్యలు
గంగా నది ఎంత పవిత్రమో అందరికీ తెలిసిందే. అయితే.. గత రెండు దశాబ్దాలుగా ఈ పవిత్ర జీవనది కాలుష్య కాసారంగా మారిపోయింది.
By: Garuda Media | 18 May 2026 11:22 PM ISTగంగా నది ఎంత పవిత్రమో అందరికీ తెలిసిందే. అయితే.. గత రెండు దశాబ్దాలుగా ఈ పవిత్ర జీవనది కాలుష్య కాసారంగా మారిపోయింది. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ఈ విషయాన్ని గ్రహించిన ఆయన.. ''మిషన్ గంగ' పేరుతో .. నదిని శుభ్రం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాజాగా .. కొందరు మైనారిటీ వర్గానికి చెందిన వారు నదిలో విహరిస్తూ.. విందు చేసుకున్నారు.
ఈ క్రమంలో బిర్యానీలోని వ్యర్థాలను.. తినగా మిగిలిన మాంసాహారాన్ని నదిలోకి విసిరేశారు. దీంతో అధికారులు కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. దీంతో బాధితులు అలహా బాద్ హైకోర్టును ఆశ్రయించి.. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు.. మాంసాహారాన్ని జీవనదిలో పారేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఇలా చేయడం సరికాదని.. ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే.. పిటిషనర్లు క్షమించమని వేడుకున్న నేపథ్యంలో వారికి బెయిల్ మంజూరు చేసింది. కానీ, ఇదేసమయంలో పిటిషనర్లు మరో వాదన తెరమీదికి తెచ్చారు. తాము మాంసాహార ముక్కలను వేసిన మాట వాస్తవమేనని.. అయితే. నిత్యం పదుల సంఖ్యలో హిందువులు.. శవాలను నదిలో కలుపుతున్నారని.. దానివల్ల నది కలుషితం కాదా? అని కోర్టును సూటిగా ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన ధర్మాసనం.. శవాలను కలపడం అనేది అనాదిగా వస్తున్న ఆచారమని.. అది మతపరమైన చర్యగానే చూడాలని సెలవిచ్చింది. దీనికి మాంసాహారానికి ముడి పెట్టరాదని హితవు పలికింది. హిందూ ధర్మం ప్రకారంచేసుకునే ఆచారాలను ప్రశ్నించేందుకు పిటిషనర్లు హిందువులు కారని కూడా తేల్చి చెప్పింది. అనంతరం.. నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.
