వైసీపీ లిక్కర్ స్కామ్.. హైకోర్టు సంచలన తీర్పు
జగన్కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్రెడ్డిలకు హైకోర్టులో తాజాగా భారీ షాక్ తగిలింది. వారు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది.
By: Tupaki Desk | 8 May 2025 10:31 AM ISTవైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో సుమారు 3 వేల కోట్ల రూపాయల మేరకు చేతులు మారాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో నాటి లిక్కర్ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దింపి.. విచారణ సాగిస్తోంది. ఇప్పటికే రాజ్ కసిరెడ్డి సహా పలువురు ఈ కేసులో అరెస్టయ్యారు. అయితే.. మరో ముగ్గురు కీలక వ్యక్తులు, వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్రెడ్డిలకు హైకోర్టులో తాజాగా భారీ షాక్ తగిలింది. వారు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది.
రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేసిన తర్వాత.. మద్యం కుంభకోణంలో అసలు ఏం జరిగింది? ఎలా జరిగిందన్న విషయాలపై సిట్ విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే సూత్రధారులుగా ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ల పేర్లు బయటకు వచ్చాయి. వీరే ఓ కీలక వ్యక్తికి సంబంధించిన ఖాతాలను సరిచూశారని.. మద్యం కేసులు.. ఎంతెంత వసూలు చేయాలి? ఎవరి నుంచి తీసుకోవాలన్న విషయాలపైనా వీరు చర్చించారని గుర్తించారు. దీంతో వీరి పేర్లు కూడా కేసు జాబితాలో చేరాయి. అయితే.. వీరు తమను అరెస్టు చేసే అవకాశం ఉందని భావించి.. వెంటనే హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై రెండు సార్లు విచారణ జరిపిన హైకోర్టు.. తాజాగా వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను రద్దు చేసింది. ''ఆరోపణలు బలంగా ఉన్నాయి. విచారణ కీలక దశలో ఉంది. ఈ సమయంలో బెయిల్ ఇచ్చే పరిస్థితి తలెత్తితే.. విచారణ ప్రభావవంతమవుతుంది'' అని సిట్ తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ వాదనకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది. వారు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను రద్దు చేసింది. అయితే.. ముందుగా నోటీసులు ఇవ్వాలని.. విచారణకు సహకరించేలా అధికారులు వ్యవహరించాలని కోర్టు సూచించింది. దురుసు ప్రవర్తన వద్దని తెలిపింది. నోటీసులకు స్పందించని పక్షంలో, విచారణకు సహకరించని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు పోలీసులకు స్వేచ్ఛ కల్పించింది.