Begin typing your search above and press return to search.

ఆమెకు భరణం వద్దు? కింది కోర్టు ఆదేశాలను కొట్టేసిన హై కోర్టు..

ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు స్పష్టంగా ఒక గీత గీసింది. తన పోషణకు తగిన ఆదాయం ఆర్జించగలిగే స్థితిలో ఉన్న మహిళ, మాజీ భర్తపై భరణం భారం మోపడం న్యాయసమ్మతం కాదని తేల్చి చెప్పింది.

By:  Tupaki Desk   |   14 Dec 2025 2:12 PM IST
ఆమెకు భరణం వద్దు? కింది కోర్టు ఆదేశాలను కొట్టేసిన హై కోర్టు..
X

భరణం అనేది దయ కాదు.. అది అవసరంలో ఉన్నవారికి చట్టం కల్పించిన రక్షణ. కానీ ఆ రక్షణను ఆయుధంగా మార్చి, నిజాలను దాచిపెట్టి, న్యాయవ్యవస్థను మభ్యపెట్టే ప్రయత్నం జరిగితే? అప్పుడు కోర్టు ముందు నిలిచేది ఒక వ్యక్తి మాత్రమే కాదు.. మొత్తం న్యాయస్ఫూర్తే. తాజాగా వెలువడిన ఒక తీర్పు ఇదే ప్రశ్నను గట్టిగా అడుగుతోంది: స్వీయ ఆదాయం ఉన్న మహిళకు భరణం ఎందుకు?

గీత గీసిన అలహాబాద్ హై కోర్టు..

ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు స్పష్టంగా ఒక గీత గీసింది. తన పోషణకు తగిన ఆదాయం ఆర్జించగలిగే స్థితిలో ఉన్న మహిళ, మాజీ భర్తపై భరణం భారం మోపడం న్యాయసమ్మతం కాదని తేల్చి చెప్పింది. దిగువ కోర్టు ఇచ్చిన భరణం ఉత్తర్వులను కొట్టివేస్తూ, న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ తీర్పు కేవలం ఒక వ్యక్తిగత వివాదానికి ముగింపు కాదు.. భరణం చట్టాల ఉద్దేశం ఏంటి? అనే అంశంపై స్పష్టమైన సందేశం.

వాస్తవ ఆదాయాన్ని దాచిపెట్టిన మహిళ..

ఈ వ్యవహారంలో కీలకమైన విషయం ఏమిటంటే.. సంబంధిత మహిళ తన వాస్తవ ఆదాయాన్ని తొలుత దాచిపెట్టింది. తాను నిరుద్యోగినని, ఆర్థికంగా ఆధారపడాల్సిన స్థితిలో ఉన్నానని అఫిడవిట్‌లో పేర్కొంది. కానీ క్రాస్ ఎగ్జామినేషన్‌లో నిజం బయటపడింది. ఆమె పోస్టు గ్రాడ్యుయేట్, వెబ్ డిజైనింగ్‌లో ప్రావీణ్యం ఉన్నవారు, ఒక కంపెనీలో సీనియర్ సేల్స్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తూ నెలకు రూ.34 వేల నుంచి 36 వేల వరకు సంపాదిస్తున్నారని తేలింది. ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత, దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు సరికాదని హైకోర్టు స్పష్టంగా చెప్పింది.

భారీగానే సంపాదిస్తున్న భార్య..

ఈ కేసును పరిశీలించిన న్యాయస్థానం చేసిన మరో ముఖ్యమైన వ్యాఖ్యను చేసింది. ‘ఎలాంటి బాధ్యతలు లేని ఒక వ్యక్తికి నెలకు రూ.36 వేలు తక్కువ అని చెప్పలేం’ అని పేర్కొంది. అదే సమయంలో మాజీ భర్తకు వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ వంటి బాధ్యతలున్నాయన్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. అంటే, భరణం నిర్ణయంలో కేవలం లింగం కాదు ఆర్థిక స్థితి, బాధ్యతలు, నిజాయితీ అన్నీ సమానంగా చూడాలన్నదే కోర్టు ఉద్దేశం.

ఈ తీర్పు వెనుక ఉన్న పెద్ద ఆలోచన ఒక్కటే.. భరణం అనేది శిక్ష కాదు, భారం కాదు.. అది అవసరంలో ఉన్నవారికి మాత్రమే. స్వయం పోషణకు సామర్థ్యం ఉన్న వ్యక్తి, తన ఆదాయాన్ని దాచిపెట్టి భరణం కోరితే, అది చట్ట ప్రకారం దుర్వినియోగమే అవుతుంది. అందుకే హైకోర్టు కీలక హెచ్చరిక చేసింది: సత్యాన్ని దాచే, వాస్తవాలను విస్మరించే కక్షిదారుల కేసులను న్యాయస్థానాలు బుట్టదాఖలు చేయాల్సిన అవసరం ఉంది.

సామాజిక కోణంలో కూడా చూడాలి..

ఇక్కడ మరో సామాజిక కోణం కూడా ఉంది. మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్న ఈ కాలంలో, మహిళలు స్వయం సంపాదకులుగా ఎదగడం గొప్ప పురోగతి. కానీ అదే సమయంలో, ఆ స్వయం సంపాదనను దాచిపెట్టి ‘బలహీనత’ ముసుగులో చట్టాన్ని ఉపయోగించుకోవడం ఆ పురోగతినే బలహీనపరుస్తుంది. ఇది నిజమైన అవసరంలో ఉన్న మహిళల కేసులపై కూడా అనవసరమైన అనుమానాలను పెంచుతుంది.

ఈ తీర్పు భరణం చట్టాలను తిరస్కరించదు. వాటి అసలు ఆత్మను గుర్తు చేస్తుంది. అవసరం ఉన్నవారికి రక్షణ.. అవసరం లేనివారికి బాధ్యత. ఇదే న్యాయసమ్మత సమతుల్యం. భవిష్యత్తులో ఇలాంటి కేసులు ఎదురైనప్పుడు, ఈ తీర్పు ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. చివరగా ఒక విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. న్యాయం లింగపక్షపాతం కాదు, నిజాయితీ పక్షపాతం. ఆర్జించే వ్యక్తి పురుషుడైనా, స్ర్తీ అయినా.. తన బాధ్యతలను తానే భరించాల్సిందే. భరణం అనేది సహాయం కోసం, మోసం కోసం కాదు. ఈ తీర్పు అదే సత్యాన్ని గట్టిగా గుర్తుచేసింది.