Begin typing your search above and press return to search.

వైఎస్సార్ పేరు షర్మిళ నాశనం చేసింది... వైఎస్సార్టీపీ నేతలుఫైర్!

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ సమయంలో వైఎస్సార్టీపీ నేతలు షర్మిళకు బిగ్ షాకిచ్చారు

By:  Tupaki Desk   |   7 Nov 2023 12:16 PM GMT
వైఎస్సార్ పేరు షర్మిళ నాశనం చేసింది... వైఎస్సార్టీపీ నేతలుఫైర్!
X

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ సమయంలో వైఎస్సార్టీపీ నేతలు షర్మిళకు బిగ్ షాకిచ్చారు. గతంలో రాజన్న రాజ్యం తెస్తానంటూ పార్టీ పెట్టిన షర్మిళ ఇప్పుడు ఎన్నికల్లో పోటీచేయను, కాంగ్రెస్ కు మద్దతిస్తాననడంపై నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. వైఎస్సార్ పరువు తీస్తున్నారంటూ విమర్శించారు. ఈ సమయంలో ఆ పార్టీ నాయకులంతా ఊకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఇదే సమయంలో తెలంగాణ నుంచి షర్మిళ వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు.

అవును... తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కాసేపు రాజన్న రాజ్యం, కాసేపు కాంగ్రెస్ తో పొత్తు, కాసేపు అన్ని స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ.. చివరిగా ఎన్నికల్లో పోటీచేయకూడదని నిర్ణయం! ఈ నిర్ణయాలు అన్నీ ఏకపక్షంగా తీసుకున్నారని ఫైరవుతూ వైఎస్సార్టీపీ నాయకులు రాజీనామాలుచేశారు. ఈ సందర్బహంగా షర్మిళ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు!

ఇదే క్రమంలో పార్టీని నమ్ముకుంటే మొండిచెయ్యి చూపించారని, ఒంటెద్దుపోకడలకు పోయారని మండిపడుతున్నారు. ఈ సందర్భంగా మైకందుకున్న గట్టు రామచంద్రరావు షర్మిలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇందులో భాగంగా.. షర్మిళను నమ్మి మోసపోయామని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని ఇన్నాళ్లు గౌరవించామని తెలిపారు. ఇక తెలంగాణ సమాజంలో షర్మిలకు స్థానం లేదని గట్టు గట్టిగా తెలిపారు!

ఈ సందర్భంగా అత్యంత బాధాకరంగా రాజీనామాలు సమర్పించామని అన్నారు గట్టు. వైఎస్సార్ పైన ఉన్న నమ్మకంతో తామంతా పార్టీలో చేరితే, ఆ వైఎస్సార్ పేరుని ఈరోజు షర్మిళ నాశనం చేసిందని.. ఆయన పేరుని డీఫేం చేసిందని.. ప్రతీఒక్కరూ విమర్శించే స్థితిలోకి తీసుకొచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పుడితేనే వారసులు కాదని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... వైఎస్సార్ కడుపున పుట్టినోళ్లే ఆయనకు వారసులు కాదని, ఆయన ఆశయాలను తీసుకున్నవారు వారసులు అవుతారని తెలిపారు. ఆమె సొంతంగా పార్టీ పెట్టి.. తామందరినీ రాజకీయాల్లో నిలబెడతా అని చెప్పి... ఇప్పుడు ఆమె మాత్రం కాంగ్రెస్ లో నిలబడతా, మీ అందరినీ రోడ్లపై నిలబెడతా అంటుందని గట్టు విమర్శించారు.

ఇదే క్రమంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ తమదని, షర్మిలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని ఈ సందర్భంగా గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదే క్రమంలో... వైఎస్సార్టీపీతో షర్మిలకు ఎటువంటి సంబంధం లేదని, ఆమెకు అసలు పార్టీలో సభ్యత్వమే లేదని గట్టు ప్రకటించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులను షర్మిల తడి గుడ్డతో గొంతు కోశారని వాపోయారు. రెండు, మూడు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా మహిళా నాయకురాలు సత్యవతి మరింత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇందులో భాగంగా... మహిళలకు ప్రాధాన్యత ఇస్తామంటే పార్టీలో చేరి, పాదయాత్రలో పాల్గొన్నట్లు ఆమె తెలిపారు. వైఎస్సార్ పై ఉన్న అభిమానంతో అంతా పార్టీలో చేరారని.. ఈ క్రమంలో వరుసపెట్టి షర్మిళ అందరిని మోసం చేసిందని ఆమె ఫైర్ అయ్యారు.

పార్టీలో ఆమె ఎవరని గౌరవించలేదని, ఎవరి అభిప్రాయాలూ తీసుకోలేదని, కేవలం సొంత ఎజెండాతో ముందుకు వెళ్లిందని నేతలు ఫైరయ్యారు. ఈ సందర్భంగా పాదాల మీద కాదు.. తమ శవాల మీద నడిచేందుకు సిద్ధమైందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో షర్మిల ఎక్కడ పొటి చేసిన ఓడిస్తామని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో "బయ్యారం గుట్ట"ను దోచుకోవడానికి వచ్చిన వైఎస్ షర్మిల ఖబర్దార్ అంటూ నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు. తెలంగాణ సొమ్మును దోచుకోవడానికే షర్మిళ ఇక్కడికి వచ్చిందని.. ఆమె ఈ రాష్ట్రంలో ఎక్కడనుంచి పోటీ చేసినా రాళ్లతో కొట్టి ఆంధ్రకు పంపిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో ఎన్నో డ్రామాలు నడిపి, ఆఖరికి కాంగ్రెస్‌ తో కుమ్మక్కైందని ఆరోపించారు.