Begin typing your search above and press return to search.

విడుదల రజినీ కోసం ప్రెస్ మీట్ ఏంటి?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)లో ప్రస్తుత పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

By:  Tupaki Desk   |   13 May 2025 5:32 AM
Womens Leaders Unhappy Over Pressure to Defend Vidadala Rajini
X

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)లో ప్రస్తుత పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా మాజీ మంత్రి విడదల రజినీ చుట్టూ నెలకొన్న వివాదాలు, వాటిపై పార్టీలోని మహిళా నాయకురాళ్ల స్పందన పార్టీలో అంతర్గత విభేదాలు రాజుకుంటున్నాయనే చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల విడదల రజినీ విషయంలో ప్రెస్ మీట్లు నిర్వహించాలని పార్టీ అధిష్టానం నుండి మహిళా నాయకురాళ్లకు సందేశాలు వెళ్లినట్లు సమాచారం. అయితే, దీనిపై కొందరు మహిళా నాయకురాళ్లు అయిష్టత వ్యక్తం చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు వైసీపీలో అంతర్గత పరిస్థితిని అద్దం పడుతున్నాయి.

-ఏం జరుగుతోంది?

విడదల రజినీ, ఆమె అనుచరుడి చుట్టూ ఇటీవల చోటుచేసుకున్న అరెస్టులు.. ఆమెపై వచ్చిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. ఈ నేపథ్యంలో విడదల రజినీకి మద్దతుగా నిలిచేందుకు..ప్రభుత్వ చర్యలను ఖండించేందుకు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయాలని వైసీపీ నాయకత్వం మహిళా నేతలను కోరినట్లు ప్రచారం సాగుతోంది.. అయితే కొంతమంది మహిళా నాయకురాళ్ల నుండి దీనిపై ప్రతిఘటన వస్తున్నట్లు సమాచారం.

-మహిళా నేతల నుండి వ్యతిరేకత ఎందుకు?

పార్టీ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం, ప్రెస్ మీట్లు పెట్టడానికి మహిళా నాయకురాళ్లు పలు కారణాలు చూపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.. విడదల రజినీ కోసం తామెందుకు ప్రెస్ మీట్లు పెట్టాలని, ఆమె తమకంటే సీనియరా లేక పార్టీ కోసం ఏదైనా గొప్ప పని చేశారా అని వారు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ వైఫల్యాలు లేదా ఇతర కీలక అంశాలపై ప్రెస్ మీట్లు పెట్టడం సమంజసమని, కానీ పోలీసులపై నిందలు వేయడం, అనుచరులపై కేసులు పెడితే బెయిల్ తీసుకొచ్చుకోవచ్చని వాదించడం వంటి "చవకబారు పనులు" ,"చెత్త సబ్జెక్టుల"పై ఎందుకు స్పందించాలని వారు అంటున్నట్లు సమాచారం.

అంతేకాకుండా విడదల రజినీ మరిదిని ఆధారాలు దొరకబట్టే అరెస్ట్ చేశారని, ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం పార్టీ పరువు తీయడమేనని కొందరు వాదిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కుట్టు మిషన్ల కుంభకోణం వంటి ప్రజా సమస్యలపై తాము స్పందించామని, అటువంటి ఇష్యూ ఆధారిత అంశాలపైనే ముందు ఉంటామని మహిళా నాయకురాళ్లు పేర్కొంటున్నట్లు సమాచారం.

-అధిష్టానంపై అసంతృప్తి?

కొంతమంది నాయకులు, ముఖ్యంగా వంశీ, విడదల రజినీ, కొడాలి నాని, అంబటి రాంబాబు వంటి వారి వలనే పార్టీ నేడు ఈ పరిస్థితిలో ఉందని మహిళా నాయకురాళ్లు భావిస్తున్నట్లు వస్తున్న వార్తలు అంతర్గత అసంతృప్తిని సూచిస్తున్నాయి. విడుదల రజినీ లాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వడం పార్టీకి నష్టమని, జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని క్యాడర్ కోరుకుంటుంటే, ఇలాంటి నాయకుల వల్లే డ్యామేజ్ అవుతోందని నేతలంతా భావిస్తున్నట్టు సమాచారం. అందుకే నేతల అరెస్ట్ పై క్యాడర్‌లో స్పందన లేకపోవడానికి కారణమవుతోందని.. ఈ విషయంలో అధిష్టానం ఆలోచించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.

ఈ మొత్తం వ్యవహారం వైసీపీలో నెలకొన్న అంతర్గత వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది. ఒకవైపు పార్టీ నాయకత్వం విడదల రజినీని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తుంటే, క్షేత్రస్థాయిలోని కొందరు మహిళా నాయకురాళ్లు.. క్యాడర్ ఆమె వ్యవహారశైలి , ఆరోపణలపై అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది కేవలం విడదల రజినీ ఒకరి వలనే కాదని, కొందరు ముఖ్య నాయకుల తీరు పై క్యాడర్‌లో అసంతృప్తి ఉందని వస్తున్న వార్తలు పార్టీకి దీర్ఘకాలంలో నష్టం కలిగించే అవకాశం ఉంది.

ప్రజా సమస్యలపై కాకుండా, వ్యక్తిగత ఆరోపణలు, పోలీసు కేసుల చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు పై క్యాడర్‌లో నిరాశ వస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితులు పార్టీ ఐక్యతను బలహీనపరచడమే కాకుండా, ప్రతిపక్షాలకు విమర్శలు చేయడానికి ఆస్కారం కల్పిస్తాయి. వైసీపీ అధిష్టానం ఈ అంతర్గత కలహాలను, క్యాడర్ మనోభావాలను ఎంత త్వరగా గుర్తించి, పరిష్కరిస్తుందనే దానిపైన పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. లేనిపక్షంలో, ఈ అంతర్గత విభేదాలు పార్టీకి మరిన్ని సవాళ్లను సృష్టించే అవకాశం ఉంది.