Begin typing your search above and press return to search.

వైసీపీ కీలక నిర్ణయం.. కేసులపై కౌంటర్ యాక్షన్!

చట్టబద్ధమైన నిబంధనలు పాటించకుండా పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం దారుణమని సజ్జల వ్యాఖ్యానించారు.

By:  Tupaki Desk   |   12 May 2025 8:30 PM
వైసీపీ కీలక నిర్ణయం.. కేసులపై కౌంటర్ యాక్షన్!
X

ఏపీ పోలీసులతో తాడోపేడో తేల్చుకోవాలని వైసీపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటోందని ప్రచారం జరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన 11 నెలలుగా కేసులు, అరెస్టులతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడుతున్న విపక్షం.. ఇక చూస్తే ఊరుకోవద్దని నిర్ణయించుకుందని సమాచారం. పార్టీ ప్రధాన కార్యదర్శి, స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లిలోని భేటీ అయిన ఆ పార్టీ నేతలు పోలీసులు, ప్రభుత్వంపై కౌంటర్ యాక్షన్ పై చర్చించినట్లు చెబుతున్నారు.

వైసీపీ కార్యకర్తలు, నాయకులే టార్గెట్ గా పోలీసు కేసులు నమోదు చేయడమే కాకుండా, అరెస్టులతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని భావిస్తున్న వైసీపీ.. తాజాగా మాజీ మంత్రి విడదల రజిని పీఏ అరెస్టు సందర్భంగా పోలీసులు ఆమె పట్ల వ్యవహరించిన తీరుపై చర్చించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో సజ్జల సమావేశమయ్యారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై చర్చించారు.

రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని నీరుగార్చేలా ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు, పోలీసులను వినియోగిస్తున్న విధానం, శాంతిభద్రతలు, మాజీ మంత్రి విడదల రజనిపై దురుసుగా ప్రవర్తించిన విషయాలపై సజ్జల ఆధ్వర్యంలో నేతలు చర్చించారు. చట్టాన్ని చేతిలో తీసుకుని పోలీసు వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, పోలీసు యంత్రాంగాన్ని తప్పుదోవన నడిపిస్తున్న వైనంపై ప్రచారం చేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తోందని, ఎవరైనా ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తే పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని సజ్జల మండిపడ్డారు.

చట్టబద్ధమైన నిబంధనలు పాటించకుండా పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం దారుణమని సజ్జల వ్యాఖ్యానించారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయాయని, డీజీపీకి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నిసార్లు డీజీపీ అపాయింట్‌మెంట్ కోరినా స్పందించకపోవడం దేనికి సంకేతమని నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వైఎస్ఆర్సీపీ సిరియస్ గా తీసుకుంటోందని వ్యవస్థలను కాపాడేందుకు బాధ్యత గల ప్రతిపక్షంగా దీనిపై స్పందిస్తుందన్నారు.