పెద్దల సభ చిన్నబోయేలా.. వైసీపీ సభ్యుల హంగామా
ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యులు చేసిన హంగామా... సభా మర్యాదను మంటగలిపేలా చేసింది.
By: Garuda Media | 19 Feb 2026 5:45 PM ISTఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యులు చేసిన హంగామా... సభా మర్యాదను మంటగలిపేలా చేసింది. పెద్దల సభ చిన్నబోయేలా వైసీపీ మండలి సభ్యులు వ్యవహరించిన తీరు.. తీవ్ర ఆవేదన, ఆందోళనకు కూడా దారి తీసింది. గురువారం మండలి ప్రారంభం కాగానే.. చైర్మన్ మోషేన్ రాజు జీరో అవర్ ప్రారంభించారు. ఈ సమయంలో వైసీపీ సభ్యులు తమ తమ స్థానాల్లో నిలబడి.. హెరిటేజ్ వ్యవహారాన్ని ప్రస్తావించారు.
ఇందాపూర్ డెయిరీ-హెరిటేజ్కు మద్య ఉన్న సంబంధంపై తొలుత చర్చించాలని పట్టుబట్టారు. దీనికి సంబంధించి వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని కోరారు. దీనికి చైర్మన్ నిరాకరించారు. తీర్మాన ప్రతు లను తోసిపుచ్చుతున్నట్టు ప్రకటించారు. దీంతో వైసీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. సభలో యాగీ చేశారు. దీనిని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు.
పెద్దల సభను సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. అయినప్పటికీ.. వైసీపీ సభ్యులు శాంతించక పోగా.. చైర్మన్ పోడియంను చుట్టుముట్టి అరుపులు.. కేకలతో దద్దరిల్లేలా చేశారు. ఇదే సమయంలో పలువురు సభ్యులు బయట నుంచి ముందే తెచ్చుకున్న చిన్నపిల్లలు ఊదే విజిల్స్తో నానా హంగామా చేశారు. ఈ వ్యవహారంపై చైర్మన్ మోషేన్ రాజు సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు అధికార పార్టీ సభ్యులు స్పందిస్తూ.. పెద్ద సభను చిన్నబోయేలా చేశారని మండిపడ్డారు.
వైసీపీ సభ్యులను సభ నుంచి బహిష్కరించాలని టీడీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. అనంతరం.. వైసీపీ సభ్యులు సభ నుంచి బయటకు వచ్చారు. ఇదిలావుంటే.. అసలు వైసీపీ సభ్యులు సభలోకి విజిల్స్ ఎలా తీసుకువచ్చారన్న విషయంపై చైర్మన్ భద్రతా సిబ్బందిని ప్రశ్నించారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఇకనుంచి ఇలాంటి జరగడానికి వీల్లేదని తేల్చి చెప్పారు.
