వైసీపీ వెన్నుపోటు దినానికి అదిరే కౌంటర్.. గొడ్డలిపోటు దినం ఎప్పుడు?
అందుకే అంటారు.. మనం ఒకటి అంటే అవతలి వాళ్లు రెండు అంటారు. రాజకీయం అన్న తర్వాత అనకుండా.. అనిపించుకోకుండా సాధ్యమా? అంటే సాధ్యం కాదనే చెప్పాలి.
By: Tupaki Desk | 2 Jun 2025 4:24 AMఅందుకే అంటారు.. మనం ఒకటి అంటే అవతలి వాళ్లు రెండు అంటారు. రాజకీయం అన్న తర్వాత అనకుండా.. అనిపించుకోకుండా సాధ్యమా? అంటే సాధ్యం కాదనే చెప్పాలి. అలాంటప్పుడు మనం అనేది మనం అందాం. అవతలోళ్లు అనేది అవతలోళ్లు అంటారని సరిపెట్టుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే.. రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసిన సమయంలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవటం.. మనం అనే మాటలకు అవతలివాళ్లు తేలిగ్గా కౌంటర్లు ఇచ్చేలా ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే తప్పించి.. ఏది అనిపిస్తే అది అనేయటం ద్వారా మైలేజీ కంటే డ్యామేజీనే ఎక్కువ జరుగుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
తాజాగా వైసీపీ నేతలు ఇలాంటి తప్పులే చేస్తున్నారు. టీడీపీ సర్కారు మీద విరుచుకుపడేందుకు ఏ అవకాశం లభిస్తుందా? అని ఎదురుచూస్తున్న వారు.. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ.. ప్రజలు కూడా తమలా చూడాలనుకోవటం అత్యాశే అవుతుంది. అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాక ముందే హడావుడి కార్యక్రమాల్ని నిర్వహించటం ద్వారా.. అమ్ముల పొదిలోని అస్త్రాలు అనవసరంగా వేస్టు అవుతాయన్న పాయింట్ ను మిస్ అవుతున్నారు.
కూటమి సర్కారు చేతికి అధికారాన్ని ఇస్తూ ఎన్నికల ఫలితాలు వెల్లడైన జూన్ 4ను వెన్నుపోటు దినంగా ప్రకటించటం ద్వారా వైసీపీ నేతలు పెద్ద తప్పే చేశారు. చారిత్రక తీర్పును ప్రశ్నించాలని డిసైడ్ అయినప్పుడు.. ఆ అంశం మీద మరింత హోంవర్కు చేయాల్సి ఉంది. అలాంటిదేమీ లేకుండా హడావుడిగా నాలుగు పాయింట్లు పట్టుకొని ప్రకటనలు చేస్తే.. ప్రత్యర్థుల నుంచి ఘాటైన స్పందన ఉంటుందన్న విషయాన్ని వైసీపీ నేతలు మర్చిపోయినట్లున్నారు.
జూన్ 4ను వెన్నుపోటు దినంగా వైసీపీ నేతలు ప్రకటించిన నేపథ్యంలో.. దానికి కౌంటర్ గా తెలుగు తమ్ముళ్లు రియాక్టు అవుతున్నారు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ ఇచ్చిన కౌంటర్ మాత్రం అందరిని ఆకర్షిస్తోంది. భారీ కుంభకోణాలు. విధ్వంసకర కార్యకలాపాలతో విసిగిపోయిన ప్రజలు ఆ నరకాసుర పాలన నుంచి విముక్తి కోసం ఓట్లు వేసి తీర్పు ఇచ్చిన రోజును వెన్నుపోటు దినంగా ప్రకటిస్తారా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు.. ప్రజలు ఛీ కొట్టి అధికారాన్ని వెనక్కి తీసుకున్న తర్వాత కూడా ఈ తరహా వ్యాఖ్యలు ఎలా చేస్తారు? అని ప్రశ్నిస్తున్న ఆమె. ‘‘మరి గొడ్డలిపోటు దినం.. సొంత చెల్లిని.. తల్లిని గెంటేసిన దినం.. అమ్మ మీద కేసు పెట్టిన దినం లాంటివి వైసీపీ నేతలు ఎప్పుడు చేస్తారో చెబుతారా?’’ అంటూ దిమ్మ తిరిగే కౌంటర్ ను ఇచ్చారు. మద్యనిషేధమంటూ తప్పుడు హామీతో అధికారంలోకి వచ్చి కల్తీ మద్యంతో 30 వేల మంది అక్కాచెల్లెమ్మల పసుపుకుంకాలు దూరం చేసి వెన్నుపోటు పొడిచింది మీరు కాదా? సీపీఎస్ రద్దు చేస్తామన్న హామీకి తూట్లు పొడిచి ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచింది మీరు కాదా’’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదంతా చూసినప్పుడు సరైన హోంవర్కు చేయకుండా హడావుడిగా చేసే విమర్శల వల్ల మైలేజీ రావటం తర్వాత డ్యామేజ్ జరుగుతుందన్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.