Begin typing your search above and press return to search.

గోదారి ఈదలేమంటున్న వైసీపీ నేతలు !

వైసీపీ 2024 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయింది అంటే దానికి ఆ పార్టీ చెప్పే కారణాలు చాలా ఉంటాయి. కొత్తల్లో అయితే కొంత మంది నేతలు ఈవీఎంల వల్ల ఓటమి పాలు అయ్యామని అంటూండేవారు.

By:  Satya P   |   1 Feb 2026 4:00 AM IST
గోదారి ఈదలేమంటున్న వైసీపీ నేతలు !
X

వైసీపీ 2024 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయింది అంటే దానికి ఆ పార్టీ చెప్పే కారణాలు చాలా ఉంటాయి. కొత్తల్లో అయితే కొంత మంది నేతలు ఈవీఎంల వల్ల ఓటమి పాలు అయ్యామని అంటూండేవారు. మరి కొంతమంది కూటమి పార్టీల కలయికతో ఓడామని చెబుతూంటారు, ఇంకొంతమంది తాము సరిగ్గా ప్రజలలో ప్రచారం చేసుకోలేకపోయామని నిర్లిప్తతను వ్యక్తం చేస్తారు. బలమైన మీడియా బాబు రాజకీయ మాయాజాలం అని అక్కసు వెళ్ళగక్కే వారూ ఉన్నారు. బహుశా ఇవన్నీ కారణం కావచ్చు కానీ అంతకు మించి కూడా అనేకం ఉన్నాయి. ఏపీ అంటేనే కులాల సంకుల సమరం. ఈ సమరంలో వైసీపీ ఓడింది. అందుకే ఘోరంగా ఓటమి వరించింది అన్నది ఒక కఠినమైన రాజకీయ విశ్లేషణగా ఉంది.

బలమైన వర్గం దూరం :

ఏపీ రాజకీయాలను ఎపుడూ గోదావరి జిల్లాల రాజకీయాలు తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. 2024 లో అదే జరిగింది. బలమైన కాపులు వైసీపీకి ఎదురు నిలిచారు. వారంతా జనసేన తో ర్యాలీ అయ్యారు. దానికి పవన్ కళ్యాణ్ ఆకర్షణ శక్తి ప్రధాన కారణం అయితే వైసీపీ నేతలు అవసరానికి మించి పవన్ ని నేరుగా టార్గెట్ చేయడం వల్ల న్యూట్రల్స్ కూడా వైసీపీకి దూరం అయిపోయారు అని అంటారు. ఫలితంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో వైసీపీకి 2024 ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కానీ ఎమ్మెల్యే సీటు కానీ దక్కలేదు అన్నది ఒక విశ్లేషణ. ఇక అధికారంలో కూటమి ఉంది. దాంతో ఎంతో కొంత యాంటీ ఇంకెంబెన్సీ రావాలి, అంతే కాదు ఈ బలమైన సామాజిక వర్గంలో ఆశలు ఎంతో కొంత కరిగి నెమ్మదిగా సీన్ మారాల్సి ఉంది. కానీ అలాంటి వాతావరణం ఏర్పడకుండా ఇంకా పవన్ మీదనే వైసీపీ టార్గెట్ చేస్తూ వస్తోంది.

కంచుకోటలుగా :

ఇక వెనక్కి వెళ్తే కాంగ్రెస్ టీడీపీల మధ్య పోరున్న కాలంలోనూ గోదావరి జిల్లాలలో టీడీపీకి గట్టి పట్టు ఉంది. అయితే కొంతలో కొంత తూర్పు గోదావరి జిల్లాలో కాంగ్రెస్ కి బేస్ ఉండేది. ఇపుడు జనసేన తోడు కావడంతో రెండు పార్టీల జంట అత్యంత బలంగా మారింది. దాంతో యాభై శాతానికి మించి ఓటు బ్యాంక్ తో కంచు కోటలుగా ఈ ఉమ్మడి జిల్లాలను చేసుకుంటున్నారు. దాంతో కూటమి గద్దెనెక్కి 20 నెలలు దాటినా గోదావరి జిల్లాలలో వైసీపీ గ్రాఫ్ అయితే పెద్దగా పెరగలేదు అన్న మాట వినిపిస్తోంది.

ముందే దాటేశారు :

ఇక ఎన్నికలు ముగిసిన తరువాత కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు వైసీపీని వీడి బయటకు వెళ్ళిపోయారు. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ ఫ్యామిలీకి అండగా ఉంటూ వస్తున్న ఆళ్ళ నాని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏకంగా పవన్ మీదనే పోటీ చేసి ఓడించిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో చేరారు. ఇదే వరసలో ఇతర నాయకులు అనేకమంది పార్టీని వీడిపోయారు. ఇక ఇపుడు మరింతమంది కూడా వైసీపీలో ఉంటున్నా ఫ్యాన్ నీడన ఉక్క బోత అని అంటున్నారని చర్చ అయితే సాగుతోంది.

గెలుపు కోసమేనా :

తాజాగా వస్తున్న ప్రచారం కానీ పుకార్లు కానీ తీసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన మాజీ మంత్రి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వైసీపీని వీడుతారు అని అంటున్నారు. ఆయన లేటెస్ట్ గా ఒక ప్రకటన చేశారు. తాను త్వరలో చంద్రబాబుని కలుస్తాను అని. అది కూడా వైసీపీకి చెందిన ఒక నేత విషయంలో ఫిర్యాదు చేస్తారని అంటున్నారు. అయితే పిల్లి అసంతృప్తిగా ఉన్నారని ఆయన కుమారుడుకి రామచంద్రాపురం టికెట్ ని వచ్చే ఎన్నికల్లో ఇవ్వడానికి వైసీపీ భరోసా కల్పించడం లేదని అంటున్నారు. అదే సమయంలో వైసీపీలో ఉంటే గెలుస్తామా లేదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. దాంతో 2029 నాటికి అసెంబ్లీ సీట్ల పునర్ విభజన జరిగితే తమ వారసుడికి కూటమిలో టికెట్ దక్కితే ఆయన గెలుపు సులువు అవుతుందని ఆశతోనే పిల్లి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు.

వీరు సైతం :

ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద ఓడిన మాజీ ఎంపీ వంగా గీత కూడా తనకు వేరే సీటు ఇవ్వాలని అధినాయకత్వాన్ని కోరుతున్నారని అంటున్నారు. పిఠాపురంలో పవన్ మీద గెలవలేమని ఆమె భావిస్తున్నారు అని అంటున్నారు. ఇక ప్రత్తిపాడులో తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు మీద ముద్రగడ సైతం ఆలోచన చేస్తున్నారు అని పుకార్లు షికారు చేస్తున్నారు. వీరే కాదు చాలా మంది కీలక నేతలు గోదావరి జిల్లాలో వైసీపీ గ్రాఫ్ ఇంకా పెరగాల్సి ఉందని అంటున్నారు. అయితే దానికి కూటమి ఐక్యత అడ్డుగా మారుతోందని అంటున్నారు. దాంతో గోదారిలో ఎదురీదలేమని తేల్చేసుకుంటున్న వారు బయటకు రావాలని అనుకుంటున్నారు అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో, వైసీపీ ఏ రకంగా అక్కడ రాజకీయాన్ని మారుస్తుందో.