చంద్రబాబుకు 'మనసు' లేదు: జగన్ ఫైర్
అనంతరం రైతులను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ.. పొగాకు ధరల పతనానికి అధికార పార్టీల నేతలే కారణమని ఆరోపించారు.
By: Garuda Media | 5 Aug 2026 4:37 PM IST"చంద్రబాబుకు రైతులంటే చులకన. వారి పట్ల ఆయనకు మనసు లేదు. రైతులను చిన్న చూపు చూస్తు న్నారు. వారిసమస్యలను పట్టించుకోవడం లేదు. అదేమని అడిగితే పోలీసులతో కొట్టిస్తున్నాడు" అని వైసీపీ అధినేత జగన్.. సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించిన జగన్.. బుధవారం ఇక్కడి పొగాకు రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా తొలుత రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం తమకు ఎలాంటి సహకారం అందించడం లేదని రైతులు పేర్కొన్నారు.
అనంతరం రైతులను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ.. పొగాకు ధరల పతనానికి అధికార పార్టీల నేతలే కారణమని ఆరోపించారు. మధ్యవర్తుల అవతారం ఎత్తి రైతులను మాయ చేస్తున్నారని చెప్పారు. ఎంతో కష్టపడి పండించిన పొగాకును దోచుకుంటున్నారని ఆరోపించారు. రైతుల కష్టాలు తెలుసుకునేందుకు.. వారిని ఓదార్చేందుకు జిల్లాలో ఒక్క మంత్రి కానీ, ఒక్క ఎంపీగానీ ముందుకు రాలేదని విమర్శించారు. గిట్టుబాటు ధర లేదని రైతులు వాపోతున్నారని, అయినా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని అన్నారు.
"కూటమి ప్రభుత్వం వచ్చాక నష్టపోయామని రైతుల ఆవేదన.చెందుతున్నారు. ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క ఎంపీగానీ ఇక్కడికి రాలేదు. 98 శాతం పొగాకును కేజీ 170 రూపాయలకే అన్యాయంగా కొనుగోలు చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో కేజీ పొగాకు 365 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేశాం. ఇప్పుడు 260 మాత్రమే ఉంది. అది కూడా ఎవరికీ ఇవ్వడం లేదు. దళారుల అవతారం ఎత్తి అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా.. చంద్రబాబు మౌనంగా ఉన్నాడు`` అని ఆరోపించారు.
క్రెడిట్ చోరీ కే సమయం లేదు!
చంద్రబాబుకు క్రెడిట్ చోరీ వ్యాధి ముదిరిందని జగన్ ఆరోపించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన పనులను కూడా ఆయన తన ఖాతాలో వేసుకుంటున్నారని.. దీనికే ఆయనకు సమయం సరిపోవడం లేదని అందుకే రైతులను గాలికి వదిలేశారని అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో లక్ష వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు. ఈ ప్రభుత్వంలో రుణానికి వడ్డీ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.
