Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ చెప్పినా.. న‌మ్మ‌కం లేదా... !

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి బలమైన నాయకులు ఉన్నారు. అదేవిధంగా కార్యకర్తలు కూడా ఉన్నారు.

By:  Garuda Media   |   15 May 2026 5:00 PM IST
జ‌గ‌న్ చెప్పినా.. న‌మ్మ‌కం లేదా... !
X

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి బలమైన నాయకులు ఉన్నారు. అదేవిధంగా కార్యకర్తలు కూడా ఉన్నారు. ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న సమయంలో కార్యకర్తలను పట్టించుకోలేదన్న‌ వాదన దరిమిలా కార్యకర్తలు పార్టీకి దూరమయ్యారు అన్నది వాస్తవం. ఇది ఇప్పటికీ కొనసాగుతూ ఉండడమే పార్టీకి పెద్ద శాపంగా మారుతోంది. వాస్తవానికి ఎన్నికల అనంతరం కార్యకర్తలను ప్రభావితం చేసేలా జగన్ వ్యవహరించారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నష్టపోయామని తద్వారా కార్యకర్తలను మెప్పించ లేకపోయామని ఆయన ఒప్పుకున్నారు.

ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని వారిని తన సొంత మనుషుల్లా చూస్తామని కూడా జగన్ చెప్పారు. కానీ.. జ‌గ‌న్ చెప్పినా.. దీనిపై పెద్దగా నమ్మకం అయితే కుదరడం లేదన్నది క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని గమనిస్తే అర్థమవుతోంది. దీనికి ప్రధాన కారణం రాష్ట్రవ్యాప్తంగా నాయకులు ఉన్నప్పటికీ కార్యకర్తల్లో పెద్దగా జోష్ అయితే కనిపించడం లేదు. నిజానికి టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు దూకుడుగా ఉంటే నాయకులకు కొంత వెనుకబాటు తనంతో వ్యవహరించారు.

ఆ సమయంలోనే చంద్రబాబు జోక్యం చేసుకుని రోడ్డు మీదకు రావడంతో ఇటు నాయకులు అటు కార్యకర్తలు మధ్య సమన్వయం ఏర్పడింది. పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్లేందుకు అవకాశం కల్పించేలాగా వ్యవహరించినట్టు అయింది. ఇప్పుడు వైసీపీలో నాయకులు ఒకంత యాక్టివ్ గా కనిపించినా కార్యకర్తలు మాత్రం ఎక్కడా వైసిపి జండా పట్టుకునేందుకు కూడా పెద్దగా ఇష్టపడడం లేదు. అంటే వారు జగన్ ని కూడా విశ్వసించటం లేదన్నది స్పష్టం అవుతుంది.

ఎన్నికల సమయం వరకు ఇలానే మాటలు చెబుతారని, ఎన్నికల తర్వాత తమను పట్టించుకునేది ఎవరని ఇటీవల మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను కొంతమంది కార్యకర్తలు నిలదీశారు. ఈ సమయంలో ఆయన వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలిస్తే తాము కార్యకర్తలకు అండగా ఉంటామని మరోసారి చెప్పారు. కానీ ఈ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తల అసంతృప్తిని చ‌ల్ల‌బ‌ర‌చ‌డం లేదు. దీంతో జగన్ చెప్పినా కూడా ఒకప్పటి మాదిరిగా కార్యకర్తల్లో నమ్మకం అయితే కల్పించలేకపోతున్నారనేది పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న అంశం.

దీనిని అధిగమించకపోతే పార్టీలో నాయకులు మాత్రమే మిగులుతారు తప్ప జండా మోసే వారు పార్టీ తరఫున ప్రజల్లో పని చేసేవారు తగ్గుతారనేది స్పష్టం అవుతుంది. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లాలి అనే విషయంపై కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసేలా వ్యవహరించాల్సిన అవసరం దానికి సంబంధించిన పక్కా ప్రణాళిక వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశీలకులు చెబుతున్నారు.