Begin typing your search above and press return to search.

ఫలితాల తర్వాత ఫస్ట్ టైం... కీలక నేతపై వైసీపీ వేటు!

వివరాళ్లోకి వెళ్తే... శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత డాక్టర్ పీవీ సిద్ధారెడ్డిని వైసీపీ సస్పెండ్ చేసింది.

By:  Tupaki Desk   |   10 July 2024 9:48 AM GMT
ఫలితాల తర్వాత ఫస్ట్  టైం... కీలక నేతపై వైసీపీ వేటు!
X

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచిన ఆ పార్టీ 5 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన అనంతరం 11 స్థానాలకు పరిమితమైపోయింది. ఈ ఘోర పరాజయం నుంచి ఆ పార్టీ అధినేత, నేతలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని అంటున్నారు. ఈ సమయంలో ఫలితాల అనంతరం పార్టీలో ఫస్ట్ వేటు పడింది.

అవును... ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ స్థాయిలో పరాజయం పొందడంపై తొలుత ఈవీఎంలపైవు వేలు చూపించినా.. తదనంతరం వాస్తవాలు మాట్లాడటం మొదలుపెట్టారు వైసీపీ నేతలు! అయితే ఈ ఫలితాలు వెలువడిన తర్వాత తొలిసారిగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారనే కారణంతో వేటు వేశారు.

వివరాళ్లోకి వెళ్తే... శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత డాక్టర్ పీవీ సిద్ధారెడ్డిని వైసీపీ సస్పెండ్ చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి, పార్టీ అభ్యర్థి ఓటమికి కారణం అయ్యాడనే కారణంతో సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది.

కాగా... 2019 ఎన్నికల్లో కదిరి శాసనసభ స్థానం నూంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పీవీ సిద్ధారెడ్డి... టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ పై 27,243 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో సిద్ధారెడ్డికి వైసీపీ అధిష్టాణం టిక్కెట్ నిరాకరించింది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బీఎస్ మక్బూల్ ను బరిలోకి దింపింది.

దీంతో... సిద్ధారెడ్డి పార్టీకి తెరవెనుక వ్యతిరేకంగా పనిచేశారని అంటున్నారు. అందువల్లే టీడీపీ అభ్యర్థి వెంకట ప్రసాద్ 6,265 ఓట్ల మెజారిటీతో గెలిచారనేది అభియోగం! దీంతో పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు అధ్యక్షుడు వైఎస్ జగన్... సిద్ధారెడ్డిని పార్టీని సస్పెండ్ చేశారు!