కొన్ని 'డౌట్లు' వదిలేయాల్సిందే.. వైసీపీలో ఇదే హాట్ టాపిక్... !
రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని అనుమానాలు పట్టిపీడిస్తుంటాయి. వాటిని కొంత వరకు ప్రజల్లోకి తీసుకువెళ్లొచ్చు.
By: Tupaki Desk | 5 July 2025 7:00 PM ISTరాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని అనుమానాలు పట్టిపీడిస్తుంటాయి. వాటిని కొంత వరకు ప్రజల్లోకి తీసుకువెళ్లొచ్చు. కానీ, అదే పనిగా ప్రచారం చేస్తే.. అసలుకుఎసరు వస్తుంది. ఇప్పుడు వైసీపీ కూడా ఇదే ఆలోచన చేస్తోంది. కొన్ని డౌట్లు వదిలేయాల్సిందే.. అంటూ.. అంతర్గతంగా నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి రాజకీయాల్లో ఉన్న లక్షణంఏంటంటే.. తాము గెలిచి.. అధికారంలోకి వస్తే.. అంతా బాగుందని అంటారు నాయకులు. అదే తాము ఓడితే.. తప్పులు తెలుసుకునే ప్రయత్నం చేయ కుండా ఈవీఎంలపై పడిపోతారు.
దేశవ్యాప్తంగా దాదాపు ఓడిపోయిన అన్ని పార్టీలదీ ఇప్పుడు అదే తీరుగా ఉంది. తాజాగా వైసీపీ కూడా ఇదే పాట పాడుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఎన్నికల్లో ఘోర పరాజయానికి గురైన ఈ పార్టీ 11 స్థానాలకు పరిమితమైంది. దీంతో ఈవీఎంలోపై అనుమానాలు వ్యక్తం చేసింది. `లక్షల కోట్లు పంచాను.. ఆ ఓట్లు ఏమై పోయాయో!` అంటూ.. అప్పట్లోనే జగన్ వ్యాఖ్యానించారు. తాజాగా వైసీపీ నాయకులు.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఈ సందర్భంగా తమకు ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని.. బ్యాలెట్ విధానంలోనే పోలింగ్ నిర్వహించాలని 10 పేజీల నివేదికను అందించారు.
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని.. వైసీపీ నాయకుడు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఎన్నికల సంఘానికి చెప్పారు. అంతేకాదు.. అప్పటి ఎన్నికల్లో సాయంత్రం 6 తర్వాత భారీ ఎత్తున పోలింగ్ నమోదైందని వైవీ చెప్పారు. దీనిపైన కూడా తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. సుమారు 50 లక్షల ఓట్లు పోలయ్యాయని తెలిపారు. వీటిపై విచారణ జరపా లని అభ్యర్థించారు. అయితే.. దీనికి ఎన్నికల సంఘం కాదు పొమ్మంది. ఇది వేరే సంగతి. అయితే.. దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని శుక్రవారం పార్టీ అంతర్గత సమావేశంలో జగన్ సూచించారు.
కానీ, దీని విషయంలో ఓ మాజీ సలహాదారు కీలక ప్రతిపాదన చేశారని తెలిసింది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దామని.. ప్రజలు కూడా మరిచిపోయారని.. చెప్పారని తెలిసింది. అంతేకాదు.. ఈ డౌట్ను పెంచి పోషించినా.. ఇప్పుడు ఒరిగేదేమీ లేదని కూడా వ్యాఖ్యానించారు. పైగా గతంలో మనం గెలిచినప్పుడు కూడా ఇలానే వ్యాఖ్యానించిన కొందరు తర్వాత.. ఆ ఊసు ఎత్తలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. అవసరం లేని విషయాలను ప్రస్తావించినా ప్రయోజనం లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు.. కొన్ని `డౌట్లు` వదిలేయాల్సిందే.. అని మరో ఇద్దరు నాయకులు కూడా చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయానికి ఇక్కడితో స్వస్తి చెప్పేద్దామని తీర్మానించినట్టు తెలిసింది.