ఆఫీసు కంటే ఇల్లే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ తో ఉద్యోగుల్లో పెరిగిన ఆనందం
తాజాగా సౌత్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన అధ్యయనం ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది.
By: Tupaki Desk | 27 May 2025 1:00 AM ISTకరోనా మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా 'వర్క్ ఫ్రమ్ హోమ్' అనేది ఒక కొత్త ట్రెండ్గా మారింది. మొదట్లో కొంతమంది దీనికి అలవాటు పడలేకపోయినా ఇప్పుడు చాలా మంది ఉద్యోగులు ఆఫీసు కంటే ఇంటి నుంచే పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. తాజాగా సౌత్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన అధ్యయనం ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ఆఫీసుకు వెళ్లి పనిచేసేవారితో పోలిస్తే, ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులు మరింత ఆనందంగా ఉన్నారని ఈ అధ్యయనంలో తేలింది. దీనికి ప్రధాన కారణం వారికి అదనంగా లభిస్తున్న నిద్ర, ప్రయాణ సమయం ఆదా అవ్వడం.
ఆఫీసు ప్రయాణాల కష్టాలు తీరాయి
ఈ అధ్యయనం ప్రకారం.. ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులు రోజూ రాత్రి అదనంగా 30 నిమిషాల నిద్రను ఆస్వాదిస్తున్నారట. ఆఫీసుకు వెళ్లే ఉద్యోగులకు రోజులో గంటల కొద్దీ సమయం ప్రయాణానికే వృథా అవుతుంది. ఈ ప్రయాణ కష్టం వల్ల శారీరకంగా, మానసికంగా ఒత్తిడి పెరిగిపోతుంది. ఉదయాన్నే ట్రాఫిక్లో ఇరుక్కోవడం, సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకోవడానికి పడే శ్రమ నిజంగా ఎంతో అలసటను కలిగిస్తుంది.
వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఈ ప్రయాణ సమయం పూర్తిగా ఆదా అవుతుంది. ఆ ఆదా అయిన సమయాన్ని ఉద్యోగులు తమకు నచ్చిన పనులకు, విశ్రాంతికి, లేదా కుటుంబంతో గడపడానికి ఉపయోగిస్తున్నారు. ప్రయాణ కష్టం లేకపోవడంతో, త్వరగా పడుకుని మంచి నిద్రను పొందగలుగుతున్నారు. దీనివల్ల ఉదయాన్నే ఫ్రెష్గా, ఎనర్జిటిక్గా మేల్కొంటున్నారు. తగినంత నిద్ర, ప్రయాణ ఒత్తిడి లేకపోవడం వల్ల ఉద్యోగుల్లో మానసిక ఆనందం, ఉత్సాహం పెరిగిందని పరిశోధకులు గుర్తించారు. ఇది వారి పనితీరుపై కూడా సానుకూల ప్రభావం చూపుతోంది.
వర్క్ ఫ్రమ్ హోమ్ భవిష్యత్ పని విధానమా?
ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా హైబ్రిడ్ మోడల్ను అనుసరిస్తున్నాయి. ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, వారి పనితీరు కూడా పెరుగుతుందని ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది భవిష్యత్లో పని విధానాల్లో మరింత మార్పులు తీసుకురావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
