Begin typing your search above and press return to search.

కొడుకు ప్రేమించాడ‌ని.. త‌ల్లికి శిక్ష‌.. న‌గ్నంగా ఊరేగించి.. దారుణం ఎక్క‌డంటే!

ఆమె అభం శుభం తెలియ‌ని అమాయ‌క మాతృమూర్తి. త‌న కుమారుడు వేరే యువ‌తిని ప్రేమించాడ‌ని, ఆమెను పెళ్లి చేసుకునేం దుకు సిద్ధ‌మ‌య్యాడ‌ని తెలియ‌దు.

By:  Tupaki Desk   |   12 Dec 2023 3:15 AM GMT
కొడుకు ప్రేమించాడ‌ని.. త‌ల్లికి శిక్ష‌.. న‌గ్నంగా ఊరేగించి.. దారుణం ఎక్క‌డంటే!
X

ఆమె అభం శుభం తెలియ‌ని అమాయ‌క మాతృమూర్తి. త‌న కుమారుడు వేరే యువ‌తిని ప్రేమించాడ‌ని, ఆమెను పెళ్లి చేసుకునేం దుకు సిద్ధ‌మ‌య్యాడ‌ని తెలియ‌దు. కానీ, యువ‌తి కుటుంబం క‌న్నెర్ర‌కు ఈ మాతృమూర్తి శిక్ష‌ను అనుభ‌వించింది. న‌గ్నంగా ఆమెను ఊరేగిస్తూ.. విద్యుత్ స్తంభానికి క‌ట్టేసి.. చిత‌క‌బాదారు. ఎంత వేడుకున్నా వ‌దిలి పెట్టలేదు. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. దీనిపై ప్ర‌భుత్వం తీవ్రంగా స్పందిస్తూ.. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాలని ఆదేశించింది.

ఎక్క‌డంటే..

క‌ర్ణాట‌క‌లోని బెలగావికి చెందిన అశోక్(24), ప్రియాంక(18) ప్రేమించుకున్నారు. అయితే.. అమ్మాయి కుటుంబ సభ్యులు.. ఆమెకు మరొకరితో వివాహం నిశ్చయించారు. ప్రియాంకకి ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో.. ప్రియుడిని బ్ర‌తిమాలి.. అత‌నితో లేచిపోవాల‌ని నిర్ణ‌యించుకుంది. ప‌క్కా ప్లాన్ ప్రకారం.. సోమవారం అర్థరాత్రి 12:30 గంటల సమయంలో ఎవరికీ తెలియకుండా గ్రామం నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న యువ‌తి తల్లిదండ్రులు.. అశోక్ ఇంటిపై దాడికి దిగారు.

ఈ స‌మ‌యంలో అశోక్ మాతృమూర్తి ఒక్క‌రే ఇంట్లో ఉన్నారు. త‌న‌కు ప్రేమ వ్య‌వ‌హారం తెలియ‌ద‌ని చెప్పినా ప్రియాంక బంధువులు ఆమె ప‌ట్ల అమానవీయంగా ప్రవర్తించారు. కొడుకు చేసిన పనికి నువ్వు శిక్ష అనుభవించు అంటూ కొట్టారు. నగ్నంగా ఊరేగించి.. విద్యుత్ స్థంభానికి కట్టేశారు. తెల్లవారుజామున 4 గంటల వ‌ర‌కు ఆమెను శిక్షించారు. నైట్ రౌండ్‌లో ఉన్న పోలీసుల‌కు ఈ సమాచారం తెలియడంతో.. ఘటనా స్థలానికి చేరుకొని.. మహిళను విడిపించారు.

నిందితుల్లో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ సంఘటనపై సిద్ద‌రామ‌య్య స‌ర్కారు తీవ్రంగా స్పందించింది. ఇది అత్యంత అమానుషమని.. ఇది సమాజాన్ని సిగ్గుతో తల దించుకునేలా చేసిందని.. ఇలాంటి నీచమైన చర్యలను తమ ప్రభుత్వం సహించదని హోంమంత్రి పరమేశ్వర తేల్చి చెప్పారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని ఆదేశించారు.