విమానంలో భర్త పక్కనుండగానే మహిళా టెక్కీకి వేధింపులు.. ప్రయాణికుల షాక్
విమానం హైదరాబాద్లోని శంషాబాద్ (RGIA) ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన వెంటనే, బాధితురాలు నేరుగా RGIA పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
By: A.N.Kumar | 20 Oct 2025 5:31 PM ISTచెన్నై నుంచి హైదరాబాద్కు వస్తున్న ఓ విమానంలో అత్యంత షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 38 ఏళ్ల మహిళా ఐటీ ప్రొఫెషనల్పై తోటి ప్రయాణికుడు లైంగికంగా వేధించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన గత శుక్రవారం జరిగినట్లుగా పోలీసులు తెలిపారు.
సమాచారం ప్రకారం.., బాధితురాలు తన భర్తతో కలిసి చెన్నై నుంచి హైదరాబాద్కు విమానంలో ప్రయాణిస్తోంది. ఆమె పక్క సీటులో మద్యపానంతో మత్తులో ఉన్న ఓ వ్యక్తి కూర్చున్నాడు. ప్రయాణం మధ్యలో ఆ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడని, ముఖ్యంగా విమానం ల్యాండ్ అవుతుండగా తనను తాకాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
వెంటనే ఆమె గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న ఆమె భర్తతో పాటు విమాన కేబిన్ క్రూ సిబ్బంది జోక్యం చేసుకున్నారు. ప్రయాణికులందరూ ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
కేసు నమోదు, విచారణ
విమానం హైదరాబాద్లోని శంషాబాద్ (RGIA) ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన వెంటనే, బాధితురాలు నేరుగా RGIA పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తక్షణమే స్పందించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ గౌరవాన్ని అవమానపరిచే విధంగా ప్రవర్తించినందుకు సంబంధిత భారతీయ న్యాయ సంహిత నిబంధనల కింద కేసు పెట్టారు. నిందితుడు తన చర్య అనుకోకుండా జరిగిందని చెప్పుకుంటున్నప్పటికీ, పోలీసులు దీనిని సీరియస్గా తీసుకున్నారు. ప్రస్తుతం వారు సాక్షులను, కేబిన్ క్రూ సిబ్బందిని విచారిస్తున్నారు. అలాగే, విమానంలోని సీసీటీవీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు.
ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు
విమానంలో జరిగిన ఈ దారుణమైన ఘటన ప్రయాణికుల భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తేలా చేసింది. విమానాల్లో, ముఖ్యంగా మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఎయిర్లైన్స్ మరింత కఠినమైన నిఘా, చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, మహిళా సంఘాల నుంచి డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.
