Begin typing your search above and press return to search.

అసోం సీఎంకు ఊహించని అనుభవం! హిమంత బిశ్వశర్మకు ముద్దులే ముద్దులు

అసోం అసెంబ్లీ ఎన్నికల సమరంలో ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   29 March 2026 12:23 PM IST
అసోం సీఎంకు ఊహించని అనుభవం! హిమంత బిశ్వశర్మకు ముద్దులే ముద్దులు
X

అసోం అసెంబ్లీ ఎన్నికల సమరంలో ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వచ్చనెల 9న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో ఇలా కష్టపడుతున్న సీఎం హిమంత బిశ్వశర్మకు అరుదైన సంఘటనులు, ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయి. దీంతో ఎన్నికల కోసం ఆయన పడుతున్న కష్టానికి తగ్గ ఫలితం ఎదురవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఎన్నికల ప్రచారంలో ఓ మహిళ ఆయనను హత్తుకుని ముద్దాడిన వీడియో వైరల్ అవుతోంది. లఖింపూర్ జిల్లాలోని బిహ్‌పురియా ప్రాంతంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ వేదిక దిగి ప్రజలతో కరచాలనం చేస్తుండగా, ఒక మహిళా అభిమాని ముఖ్యమంత్రిని దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకున్నారు. ఆ పరిణామమే సెక్యూరిటీని షాక్ కు గురిచేయగా, క్షణాల వ్యవధిలోనే ఆ మహిళ ముఖ్యమంత్రి బుగ్గపై ముద్దాడటం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ సంఘటన జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా హిమంత్ బిశ్వ శర్మ జనాల మధ్య తిరుగుతుండగా, ఒక మహిళ ఒక్కసారిగా ఆయన వద్దకు వచ్చి ఉత్సాహంగా బుగ్గపై ముద్దు పెట్టింది. ఈ ఊహించని పరిణామానికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే, ముఖ్యమంత్రి ఏమాత్రం తత్తరపడకుండా నవ్వుతూ ఆ అభిమానాన్ని స్వీకరించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ముఖ్యమంత్రి పట్ల ప్రజల్లో ఉన్న సాన్నిహిత్యానికి ఇది నిదర్శనం" అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, ప్రజాప్రతినిధుల భద్రత విషయంలో ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ ఘటన అసోంలో విస్తృత చర్చనీయాంశంగా మారింది. ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి పర్యటనలు, ప్రచార కార్యక్రమాలలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని అసోం మీడియా గుర్తు చేస్తోంది.

సాధారణంగా ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఓటర్లే స్వయంగా వచ్చి తమ అభిమాన నాయకుడిని ఇలా ఆలింగనం చేసుకోవడం లేదా ముద్దాడటం అనేది ఆ నాయకుడికి ఉన్న మాస్ ఇమేజ్‌ను ప్రతిబింబిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఘటన ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మకు ప్రజల్లో ఉన్న ఆదరణను మరోసారి చాటిచెప్పినట్లయిందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ఒపీనియన్ పోల్స్ లో పరిస్థితులు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మకు అనుకూలంగా ఉన్నాయని కథనాలు వెలువడ్డాయి. వీటికి బలం చేకూరుస్తున్నట్లు తాజా పరిణామాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.