ట్రంప్ ను తిట్టాడు..నోబెల్ బహుమతి గ్రహీత అమెరికా వీసా రద్దైంది..
నైజీరియాకు చెందిన ప్రముఖ రచయిత.. నోబెల్ బహుమతి గ్రహీత వోలే సోయింకా సంచలన విషయాన్ని వెల్లడించారు. అమెరికా తన వీసాను రద్దు చేసినట్లు ఆయన ప్రకటించారు.
By: A.N.Kumar | 30 Oct 2025 10:19 AM ISTనైజీరియాకు చెందిన ప్రముఖ రచయిత.. నోబెల్ బహుమతి గ్రహీత వోలే సోయింకా సంచలన విషయాన్ని వెల్లడించారు. అమెరికా తన వీసాను రద్దు చేసినట్లు ఆయన ప్రకటించారు. ఈ అనూహ్య నిర్ణయం వెనుక కారణం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై తాను చేసిన తీవ్ర విమర్శలే కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
* వీసా రద్దు వెనుక ట్రంప్ విమర్శలా?
91 ఏళ్ల వయసులో కూడా తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న సోయింకా 1986లో సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న తొలి ఆఫ్రికన్గా చరిత్ర సృష్టించారు.
ఇటీవల ట్రంప్ను ఉద్దేశిస్తూ “ఇడి అమీన్కు తెల్లజాతి వెర్షన్” అని ఆయన చేసిన వ్యాఖ్యలు వీసా రద్దుకు కారణమై ఉండవచ్చని సోయింకా అనుమానం వ్యక్తం చేశారు. వీసా రద్దు లేఖలో "వీసా జారీ తర్వాత కొన్ని అదనపు సమాచారం లభించడంతో వీసా రద్దు చేయబడింది" అని మాత్రమే పేర్కొన్నారని ఆయన తెలిపారు.
* సూత్రం కోసం పోరాటం
మంగళవారం జరిగిన పత్రికా సమావేశంలో సోయింకా మాట్లాడుతూ ఈ చర్యను తనపై చేసిన వ్యక్తిగత చర్యగా భావించడం లేదనీ, ఇది కేవలం అమెరికా వలస విధానాల ఫలితమేనని స్పష్టం చేశారు. "మానవులను ఎక్కడ ఉన్నా గౌరవంగా చూసే హక్కు వారికి ఉంది" అని ఆయన నొక్కి చెప్పారు. "నాకు అమెరికాకు తిరిగి వెళ్లాలనే ఆసక్తి లేదు. కానీ ఇది ఒక సూత్రం. మానవ గౌరవం కాపాడబడాలి" అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.
* గ్రీన్ కార్డ్ ధ్వంసం, వ్యంగ్య వ్యాఖ్యలు
గతంలో తాను అమెరికాలో బోధన చేశానని, గ్రీన్ కార్డ్ కూడా కలిగి ఉన్నానని సోయింకా గుర్తు చేసుకున్నారు. అయితే 2017లో డొనాల్డ్ ట్రంప్ పదవీ స్వీకార వేడుకకు నిరసనగా తన గ్రీన్ కార్డ్ను తానే కత్తిరించి ధ్వంసం చేసినట్లు తెలిపారు. “నా గ్రీన్ కార్డ్ ఎనిమిదేళ్ల క్రితం కత్తెరల మధ్య పడిపోయింది” అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.
వీసా రద్దు లేఖను ఆయన వ్యంగ్యంగా "ప్రేమలేఖలా అనిపించింది" అని పేర్కొన్నారు. “నేను ఇప్పుడు అమెరికా వీసా లేనివాడిని. ఇక అక్కడికి వెళ్లే ఆలోచన లేదు. ఎవరికైనా నన్ను కలవాలంటే, ఎక్కడ ఉన్నానో తెలుసు కదా” అంటూ చిరునవ్వుతో తన వ్యాఖ్యలను ముగించారు.
ఈ విషయంపై అమెరికా కాన్సులేట్ (లాగోస్) స్పందించకుండా అన్ని ప్రశ్నలను వాషింగ్టన్ డీసీలోని స్టేట్ డిపార్ట్మెంట్కు మళ్లించినప్పటికీ, అక్కడి నుంచి ఎటువంటి వ్యాఖ్యలు వెలువడలేదు. వోలే సోయింకా వ్యాఖ్యలపై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది.
