మాన్స్టర్ క్లౌడ్...రాష్ట్రాలకు పెను ముప్పు ?
మాన్స్టర్ క్లౌడ్ అంటే ఏమిటి అన్నది తెలుసుకోవాలి. అచ్చమైన తెలుగులో అనువదించాలి అంటే రాక్షస మేఘం అని చెప్పాలి.
By: Satya P | 20 May 2026 9:40 AM ISTమాన్స్టర్ క్లౌడ్ అంటే ఏమిటి అన్నది తెలుసుకోవాలి. అచ్చమైన తెలుగులో అనువదించాలి అంటే రాక్షస మేఘం అని చెప్పాలి. అతి పెద్ద మేఘాల సముదాయాలను అలా పిలుస్తారు. అవి వందల వేల కిలోమీటర్ల విస్తీర్ణం దాకా పాకి ఉంటాయి. వాటిని భయంకరమైన మేఘాల దండుగా కూడా పేర్కొనవచ్చు. ఇవి కనుక మేఘ విస్ఫోటనం చెందితే కనుక ఆకస్మిక వరదలతో నగరాలకు నగరాలు జల దిగ్బంధనంతో చిక్కుకుపోతాయి. భారీ నష్టమే వాటిల్లుతుంది. ప్రస్తుతం మాన్స్టర్ క్లౌడ్ అన్నది బంగాళాఖాతం నుండి దూసుకొస్తోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
భారీ పొడవుతో :
ఈ మాన్స్టర్ క్లౌడ్ ఏకంగా మూడు వేల కిలోమీటర్ల పొడవుతో ఒక భారీ పరిమాణంతో ఇరాన్, పాకిస్తాన్ మీదుగా ప్రయాణిస్తూ భారత్పై విస్తరిస్తున్నదని చెబుతున్నారు. దీంతో దేశంలోని తూర్పు ఈశాన్య భారతదేశానికి పెను ముప్పు ఉందని అంటున్నారు. ఈ మాన్స్టర్ క్లౌడ్ వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, సిక్కిం మేఘాలయ వంటి రాష్ట్రాలకు ఆకస్మిక వరదలు, మేఘ విస్ఫోటనాలు, తీవ్రమైన మెరుపులు ఉరుములతో కూడిన తుఫానుల ప్రమాదం పొంచి ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒక్క రాత్రిలో 300 మిల్లీమీటర్ల వర్షం :
ఇక ఈ రాక్షస మేఘం బంగాళాఖాతంలో మూడు వేల కిలోమీటర్ల పొడవైన భారీ మేఘ వలయంగా మారిందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఇది రాత్రికి రాత్రే 200 నుంచి 00 మిల్లీమీటర్ల వర్షాన్ని కురిపించగలదని హెచ్చరిస్తున్నారు. దీంతో అధిక ప్రమాదం ఉన్న రాష్ట్రాలుగా ఒడిశా తీరం గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్కు రెడ్ అలర్ట్ ని జారీ చేశారు. అలాగే జార్ఖండ్, బీహార్, సిక్కిం, అస్సాం మేఘాలయలకు ఆరెంజ్ అలర్ట్లు జారీ చేశారు. భద్రతా చర్యలని తీసుకోవాలని స్థానిక అధికార యంత్రాంగాన్ని కోరుతున్నారు. ఈ భీభత్సమైన ఫానుల సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అలాగే నీరు నిలిచిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ఐఎండి కోరింది. ఇక దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ తూర్పు ఉత్తరప్రదేశ్లలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ఈ నెల 21 తేదీ వరకూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
బంగాళాఖాతంలో నీరు వేడెక్కి :
ఇంతకీ ఈ రాక్షస మేఘం ఏ విధంగా రూపొందింది అంటే బంగాళాఖాతంలో నీరు 31 డిగ్రీల సెల్సియస్ వరకు వేడెక్కడంతో పాటు దానికి అరేబియా సముద్రం బలమైన గాలులు తోడవడంతో వందలాది మేఘాలు కలిసిపోయి ఒక భారీ శక్తిగా మారాయని అంటున్నారు. గతంలో ఈ తరహా రాక్షస మేఘాల సమూహం వల్లనే 2013 కేదార్నాథ్ లో పెను విపత్తు సంభవించింది అని గుర్తు చేస్తున్నారు. అంతే కాదు మహా నగరాలను సైతం ఆకస్మిక వరదలతో ముంచెత్తే విధంగా ఈ భారీ మేఘాల సముదాయం పనిచేస్తుంది అని అంటున్నారు.
ఈ అంశాలే కారణం :
ఇదిలా ఉంటే కీలకమైన అంశాలు తుఫాను తీవ్రతను పెంచుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అందులో ఒకటి ఎల్ నినో కారణంగా బంగాళాఖాతం సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉండి అదనపు తేమను అందిస్తున్నాయి. అలాగే తేమతో కూడిన గాలులు ఢీకొంటున్నందువల్ల కూడా ఈ కలయిక తుఫాను వేగంగా తీవ్రతరం కావడానికి దారి తీస్తోందని వాతావరణ నిపుణులు అంటున్నారు.
